నిషేధిత భూముల సమస్యలను పరిష్కరించడానికి కొత్త యాప్‌ : మంత్రి పొంగులేటి

నిషేధిత భూముల సమస్యలను పరిష్కరించడానికి కొత్త యాప్‌ తీసుకువస్తున్నట్టుగా మంత్రి పొంగులేటి అన్నారు. పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Published on: Jan 29, 2026 6:04 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కర్దనూర్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ సముదాయ నిర్మాణానికి మంత్రి, కార్మిక మంత్రి జి.వివేక్‌తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిషేధిత భూములకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి

ఈ సమస్యలను సమగ్రంగా పరిష్కరించడానికి రెండు నెలల్లో కొత్త అప్లికేషన్‌ను(యాప్) ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రతిపాదిత భూధార్ కార్డు భూమికి సంబంధించిన అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఉపయోగపడుతుందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇది భూమి యాజమాన్యం, రికార్డులలో పారదర్శకత, స్పష్టతను నిర్ధారిస్తుందన్నారు. భవిష్యత్తులో వివాదాలను నివారిస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న ధరణి వ్యవస్థను భూ భారతితో భర్తీ చేసిందని, ఇది ప్రజలకు అనుకూలమైనది, సాధారణ పౌరులకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇది భూ పరిపాలనను సులభతరం చేస్తుంది, ప్రజలకు ఇబ్బంది లేని సేవలను అందిస్తుందన్నారు మంత్రి పొంగులేటి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగానికి వచ్చే ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా ఉండేలా ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) పరిధిలో పటాన్‌చెరులోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంతో సహా 11 కార్యాలయాలు వస్తున్నాయని అన్నారు. ఈ పనిని రాజ్ పుష్ప గ్రూపునకు అప్పగించారు. అన్ని ఆధునిక సౌకర్యాలతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ భవనం రాబోయే ఆరు నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.

మౌలిక సదుపాయాల గురించి మంత్రి పొంగులేటి మాట్లాడారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఫైవ్ స్టార్ సౌకర్యాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా మినీ మ్యారేజ్ హాళ్లు, శిశువులు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయని పొంగులేటి స్పష్టం చేశారు.

భూధార్ కార్డు వ్యవస్థ అన్ని భూ సరిహద్దులు, వివరాలను ఒకే వేదికపైకి తీసుకువస్తుందని, పూర్తి పారదర్శకతను నిర్ధారిస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. భవిష్యత్తులో వివాదాలకు ఆస్కారం లేకుండా చేస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు.