SIR in Telangana : కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ - 30 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ, లెక్కలు ఇలా
Telangana Voter List Revision : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియ వేగంగా సాగుతోంది. జూన్ 25న ప్రారంభమైన ఈ ఇంటింటి సర్వేలో కేవలం మూడు రోజుల్లోనే 30 శాతానికి పైగా ఇళ్లను బూత్ స్థాయి అధికారులు (BLO) విజయవంతంగా పూర్తి చేశారు.
Telangana Voter List Revision : తెలంగాణలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియ అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. జూన్ 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక ఇంటింటి సర్వే….. జూన్ 27 నాటికి రాష్ట్రంలోని మొత్తం ఇళ్లలో 30 శాతానికి పైగా ఓటర్ల పరిశీలన పూర్తయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు వివరాలను వెల్లడించారు.

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి.సుదర్శన్ రెడ్డి కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూన్ 25 నుంచి జూన్ 27 వరకు జరిగిన ఈ మూడు రోజుల సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,02,75,000 ఎన్యుమరేషన్ (ఓటర్ల వివరాల నమోదు) ఫారాలను పంపిణీ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలోని 30.08 శాతం ఇళ్లను బూత్ స్థాయి అధికారులు సందర్శించి…. ఓటర్ల సమాచారాన్ని సేకరించారు.
రాష్ట్రంలో ఓటర్ల జాబితాను పారదర్శకంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 36,000 మంది బూత్ స్థాయి అధికారులను ఎన్నికల సంఘం రంగంలోకి దించింది. వీరంతా నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలను అందిస్తున్నారు. అలాగే ఓటర్లు తమ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా పూరించడంలో తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు.
జూలై 24 వరకు గడువు….
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఈ సర్వే గడువుపై స్పష్టతనిచ్చారు. ఈ ఇంటింటి వెరిఫికేషన్ ప్రక్రియ జూలై 24వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన వివరించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి నుంచి వచ్చిన డేటాను క్రోడీకరించి…. జూలై 31వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. ముసాయిదా విడుదల అనంతరం ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, క్లెయిములను స్వీకరిస్తారు. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత అక్టోబర్ 1వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ( ECI ) జారీ చేసిన కఠినమైన మార్గదర్శకాలు, నిబంధనలకు కట్టుబడి ఈ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాకుండా….. జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం.
రాష్ట్రంలో గత ఏడాది (2025) నాటి లెక్కల ప్రకారం మొత్తం 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది జూన్ 20 నాటికి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా దాదాపు 2.38 కోట్ల మంది ఓటర్ల వివరాలను మ్యాపింగ్ చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 90 లక్షల మంది ఓటర్ల వివరాలలో రకరకాల వ్యత్యాసాలు, తప్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఒకే ఓటరుకు రెండు చోట్ల ఓటు ఉండటం, పేర్లు లేదా చిరునామాల్లో తప్పులు, ఫొటోలు సరిగా లేకపోవడం వంటి సమస్యలను ఈ ఇంటింటి సర్వే ద్వారా బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలోనే పరిష్కరిస్తున్నారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

