తెలంగాణలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయడానికి నాలుగు ప్రధాన సర్క్యూట్‌లు

తెలంగాణ ప్రభుత్వం టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కొండా సురేఖ్ చెప్పారు. పర్యాటకం పెంచడం, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటం కోసం మాస్టర్ ప్లాన్స్ రూపొందిస్తున్నట్టుగా తెలిపారు.

Published on: Dec 9, 2025, 18:05:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమైన దేవాలయాలను అనుసంధానించే నాలుగు ప్రధాన సర్క్యూట్ల ద్వారా టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మంగళవారం తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. విజన్ 2047 కింద సౌకర్యాలను మెరుగుపరచడం, పర్యాటకాన్ని పెంచడం, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటం కోసం మాస్టర్ ప్లాన్‌లను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్

జోగులాంబ, మన్యంకొండ, వికారాబాద్ అనంతగిరి, యాదగిరిగుట్ట, రామప్ప, భద్రాచలం, వేములవాడ, మేడారం, కాళేశ్వరం తదితర ముఖ్యమైన ఆలయాలను కలుపుతూ నాలుగు ప్రధాన సర్క్యూట్‌ల ద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు.

'Less structures, more experiences' అనే సూత్రం ఆధారంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ నోడల్ ఏజెన్సీతో పర్యాటక విధానం 2025-30 కింద కొత్త పర్యావరణ-పర్యాటక ఫ్రేమ్ వర్క్‌ను ఆమె ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 ఎకో-టూరిజం సర్క్యూట్లు ఉన్నాయని, ప్రకృతి ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ అనే కొత్త బ్రాండ్ ప్రారంభించినట్టుగా చెప్పారు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఇప్పుడు 36 పులులు ఉన్నాయని, 2024లో ఇది గణనీయమైన పెరుగుదల అని మంత్రి కొండా సురేఖ అన్నారు. నందిపేట్, తడ్వాయి, పాకాల వంటి కొత్త గమ్యస్థానాలను ట్రెక్కింగ్ మార్గాలు, సందర్శకులకు సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను ప్లాన్ చేస్తున్నామన్నారు.

తెలంగాణలో 19 శాతం అటవీ ప్రాంతం ఉందని, అడవుల వెలుపల చెట్లు విస్తరించడంతో మొత్తం పచ్చదనం 22 శాతానికి చేరుకుందని మంత్రి సురేఖ వెల్లడించారు. అడవులను రక్షించడం, పచ్చదనం విస్తరించడం, వాతావరణ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఆలయాల నిర్వహణ గురించి మంత్రి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ 12,000 కు పైగా దేవాలయాలను పర్యవేక్షిస్తుందని అన్నారు. 695 దేవాలయాలు ఆదాయాన్ని ఆర్జిస్తుండగా, 3,500 దేవాలయాలు భూమి ఆదాయంతో, దేవాదాయ శాఖ మద్దతుతో నడుస్తున్నాయన్నారు. ప్రాథమిక ఆచారాలకు కూడా వనరులు లేని 6,400 కు పైగా దేవాలయాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని మంత్రి సురేఖ ఈ సందర్భంగా చెప్పారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ : శ్రీధర్ బాబు

హైదరాబాద్‌‌కు నాలుగో కేంద్రంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. 13500 ఎకరాల్లో గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీని మెట్రో రైలుతో అనుసంధానిస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. జోన్లవారీగా విభజించి ప్రతీ జోన్‌ను విభిన్నంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ జోన్, ఎకో టూరిజం ఉంటాయన్నారు. ఫ్యూచర్ సిటీలో వర్సిటీల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకొచ్చాయన్నారు. త్వరలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తామన్నారు. జూపార్క్ ఏర్పాటు కోసం వంతారాతో ఇప్పటికే ఒప్పంద జరిగిందన్నారు. 400 ఎకరాల్లో డేటా సెంటర్ సిటీ నిర్మాణం జరుగుతుందన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More