TG EAPCET 2026 Final Phase Counselling : తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. టీజీ ఈఏపీసెట్ (TG EAPCET 2026) చివరి విడత ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ శుక్రవారం(నేటి) నుంచి ప్రారంభమైంది . మొదటి రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత…. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్లను ఈ విడత ద్వారా భర్తీ చేయనున్నారు.

రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాల ప్రకారం మొత్తం 80,167 మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ సీట్లు దక్కాయి. అయితే… అందులో 71,452 మంది విద్యార్థులు మాత్రమే సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేసి ప్రవేశాలు పొందారు. సీట్లు పొందినప్పటికీ దాదాపు 9,000 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదు.
ఫలితంగా…. ఆ సీట్లతో పాటు మిగిలిన ఖాళీలను కలిపి చివరి విడత కౌన్సెలింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం చివరి విడత కౌన్సెలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22,972 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఈ చివరి విడత కౌన్సెలింగ్లో పాల్గొనే అభ్యర్థులకు అధికారులు మరో అలర్ట్ ఇచ్చారు. మూడో విడతలో సీటు పొంది, ఆ తర్వాత ఏదైనా కారణంతో సీటును రద్దు చేసుకుంటే…. ఇప్పటికే చెల్లించిన ఫీజును తిరిగి ఇవ్వరని (నో రీఫండ్) స్పష్టం చేశారు. ఫలితంగా విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, కచ్చితంగా చేరాలనుకునే కళాశాలలు, కోర్సులను మాత్రమే ఎంచుకోవాలని సూచించారు.
TG EAPCET చివరి విడత కౌన్సెలింగ్ - తేదీలు
- జులై 31 (శుక్రవారం) : కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రాసెస్ ఫీజు చెల్లించి, స్లాట్ బుకింగ్(రిజిస్ట్రేషన్) చేసుకోవచ్చు.
- ఆగస్టు 1 : స్లాట్ బుక్ చేసుకున్న కొత్త అభ్యర్థులకు ధ్రువపత్రాల (సర్టిఫికెట్ల) పరిశీలన ఉంటుంది.
- ఆగస్టు 1, 2 తేదీలు : విద్యార్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సుల కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
- ఆగస్టు 5 నాటికి : మూడో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి, ఫలితాలను వెల్లడిస్తారు.
- ఆగస్ట్ - ఆగస్ట్ 7వ తేదీ : ఆన్ లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి.
- ఆగస్ట్ 7 వరకు : కాలేజీలో రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://tgeapcet.nic.in/default.aspx