ఆర్టీసీ సమ్మె.. మరో సకల జనుల సమ్మెగా మారుతుంది: ఆర్టీసీ జేఏసీ హెచ్చరిక

TGSRTC Employees Strike : తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్ధతు ప్రకటించాయని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్‌ వెంకన్న చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలన్నారు.

Updated on: Apr 21, 2026 1:47 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ నెల 22 నుంచి చేపట్టబోయే సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు తెలిపాయని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీజీఎస్ఆర్టీసీ
టీజీఎస్ఆర్టీసీ

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కేవలం ప్రకటనలకే పరిమితమైందని, కాలయాపన కోసమే కమిటీలు వేశారని జేఏసీ ఛైర్మన్ వెంకన్న విమర్శించారు. మెట్రోపై ఉన్న ప్రేమ ఆర్టీసీపై లేదని విమర్శించారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న పాలకులు, ఆర్టీసీని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే, మూసీ పునరుజ్జీవనానికి వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని వెంకన్న ప్రశ్నించారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, హైదరాబాద్‌లో ఆర్టీసీ ఉనికినే లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

'ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఈ పోరాటంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా భాగస్వాములు కావాలి. ఈ సమ్మె రాబోయే రోజుల్లో మరో 'సకల జనుల సమ్మె'ను తలపిస్తుంది.' అని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలు జరపాలని, లేనిపక్షంలో సమ్మె తీవ్రత పెంచుతామని జేఏసీ నేతలు హెచ్చరించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలు జరపాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. లేదంటే.. సమ్మె తీవ్రత పెంచుతామని హెచ్చరించింది. మరికొన్ని గంటల్లో సమ్మె ప్రారంభం కానుందని, ఇప్పటికీ సమ్మె నివారణకు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని తెలిపింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని అడుగుతున్నా.. పట్టించుకోవడం లేదని జేఏసీ చెప్పింది.

'సమ్మె చేయకుండా కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరు భయానికి గురికావొద్దు. కార్మికులు అందరూ సమ్మె చేయడానికీ సిద్ధంగా ఉన్నారు. కాలయాపన కోసమే కమిటీ అంటున్నారు. మెట్రో రైల్ వ్యవస్థను వెంటనే విలీనం చేసింది ప్రభుత్వం. ఆర్టీసీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు వెళ్లటానికి జేఏసీ సిద్ధంగా ఉంది.' అని జేఏసీ ఛైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యూనియన్లు, జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో ఏప్రిల్ 22 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో అంతరాయం కలగనుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై ప్రభుత్వ యంత్రాంగంతో వారాల తరబడి జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. జేఏసీ మూడు కీలక ప్రాధాన్యతలతో 32 డిమాండ్లను ప్రవేశపెట్టింది. చర్చలు విఫలమైన తర్వాత మార్చి 13న జేఏసీ అధికారిక నోటీసు జారీ చేసినప్పటి నుండి సమ్మె గురించి ఆందోళన కొనసాగుతూనే ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More