...
...
Next Story

Warangal Airport : వరంగల్ ఎయిర్‌పోర్టుపై బిగ్ అప్డేట్ - భూసేకరణ పూర్తి, మంచి పేరు సూచించాలని సీఎం పిలుపు

వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి భూసేకరణ పూర్తి చేసి ఏఏఐకి స్థలాన్ని అప్పగించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విమానాశ్రయానికి నామకరణంపై ప్రజల సలహాలను ఆహ్వానించారు.

Published on: Sep 19, 2026, 21:46:08 IST
Advertisement

ఉత్తర తెలంగాణ ప్రజలు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న వరంగల్ విమానాశ్రయ కల నెరవేరే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కావలసిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి…. ఆ స్థలాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అధికారికంగా అందజేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. శనివారం సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని పంచుకున్న ఆయన….. నిర్మించబోయే కొత్త విమానాశ్రయానికి ఏ పేరు పెడితే బాగుంటుందో సూచించాలని ప్రజలను కోరారు.

మామునూర్ ఎయిర్‌పోర్ట్‌
మామునూర్ ఎయిర్‌పోర్ట్‌

గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన ఎయిర్‌పోర్ట్‌ను సాకారం చేయడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. ఆ పార్టీ నాయకులు కేవలం తమ కుటుంబ ప్రయోజనాలు, విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లపైనే శ్రద్ధ చూపారని విమర్శించారు. "ప్రజా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ కల ఎట్టకేలకు నిజరూపం దాలుస్తోంది," అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

వరంగల్ సమీపంలోని మామునూరు వద్ద విమానాశ్రయ నిర్మాణానికి కావలసిన భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 295 కోట్లను కేటాయించిందని ముఖ్యమంత్రి తెలిపారు. కావలసిన స్థలాన్ని సేకరించి ఏఏఐకి అప్పగించడంతో ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయని పేర్కొన్నారు.

ఏ పేరు పెట్టాలి..? సూచనలివ్వండి - సీఎం రేవంత్

వరంగల్‌లో రాబోయే ఈ విమానాశ్రయం కేవలం విమానాల రాకపోకలకు మాత్రమే పరిమితం కాదని…. ఇది ఈ ప్రాంతంలో పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉద్యోగాలు మరియు భారీ పెట్టుబడులకు ఒక కొత్త ద్వారంగా మారుతుందని స్పష్టం చేశారు. "వేగంగా అభివృద్ధి చెందుతున్న, అనుసంధానమవుతున్న తెలంగాణకు సరికొత్త ప్రతీకగా నిలిచే మామునూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం ఎక్కేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. వరంగల్ కొత్త ఎయిర్‌పోర్ట్‌కు మనం ఏ పేరు పెట్టాలి? మీ సూచనలను తెలియజేయండి," అని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కు చాలా మంది ప్రముఖులతో పాటు నెటిజన్లు స్పందిస్తున్నారు. కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, సమ్మక్క సారక్క ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఇలా అనేక పేర్లను సూచిస్తూ… పోస్టులు చేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks