South Central Railway Special Trains : ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని కాచిగూడ నుండి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచానూరు మధ్య ప్రత్యేక రైలు సర్వీసును నడపనున్నట్లు ప్రకటించింది.
షెడ్యూల్ వివరాలు :
- రైలు నంబర్ 07787 (కాచిగూడ - తిరుచానూరు) : ఈ ప్రత్యేక రైలు 23 జులై 2026 (గురువారం) నాడు కాచిగూడ నుండి తిరుచానూరుకు బయల్దేరుతుంది.
- రైలు నంబర్ 07788 (తిరుచానూరు - కాచిగూడ) : ఇక 24 జులై 2026 (శుక్రవారం) నాడు తిరుచానూరు నుండి బయలుదేరి కాచిగూడకు చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించేటప్పుడు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో మల్కాజ్గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు ,రేణిగుంట స్టేషన్లు ఉన్నాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని రకాల క్లాస్లను అందుబాటులో ఉంచారు. ఇందులో ఏసీ 2 టైర్ , ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ (General Second Class) కోచ్లు ఉంటాయి. తిరుపతి /తిరుచానూరు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసును ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
చర్లపల్లి - కేరళ మధ్య ప్రత్యేక రైళ్లు:
పండుగలు, సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి కేరళలోని కొల్లం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 14వ తేదీ నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు మొత్తం ఎనిమిది సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
- చర్లపల్లి - కొల్లం ప్రత్యేక రైలు (నెం.07195): ఈ రైలు ఆగస్టు 14, 21, 28 మరియు సెప్టెంబరు 4 తేదీల్లో చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది (మొత్తం 4 సర్వీసులు).
- కొల్లం - చర్లపల్లి ప్రత్యేక రైలు (నెం.07196): ఈ తిరుగు ప్రయాణ రైలు ఆగస్టు 15, 22, 29 మరియు సెప్టెంబరు 5 తేదీల్లో కొల్లం నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది (మొత్తం 4 సర్వీసులు).