వేసవి కాలం ముగుస్తున్న తరుణంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని జల్నా నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 2026 జూన్ మొదటి వారం నుంచి జూన్ ఆఖరి వారం వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
టైమింగ్స్ - ముఖ్య వివరాలు:
- రైలు నంబర్ 07814 (జల్నా - తిరుపతి) : ఈ ప్రత్యేక రైలు జూన్ 4, 2026 నుంచి జూన్ 25, 2026 వరకు ప్రతి వారం గురువారం నాడు జల్నా స్టేషన్ నుంచి తిరుపతికి బయలుదేరుతుంది.
- రైలు నంబర్ 07815 (తిరుపతి - జల్నా): తిరుగు ప్రయాణంలో ఈ రైలు జూన్ 5, 2026 నుంచి జూన్ 26, 2026 వరకు ప్రతి వారం శుక్రవారం నాడు తిరుపతి నుండి జల్నాకు ప్రయాణికులను చేరవేస్తుంది.

ఈ ప్రత్యేక రైళ్లు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
- ఆంధ్రప్రదేశ్: విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట.
- తెలంగాణ: బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం.
- మహారాష్ట్ర: పార్తూర్, సెలూ, పర్భణి, పూర్ణ, నాందేడ్, ముద్ఖేడ్.
ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం సెకండ్ ఏసీ (2AC), థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్ (Sleeper Class), జనరల్ సెకండ్ క్లాస్ (General Second Class) కోచ్లను ఏర్పాటు చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, అలాగే వేసవి సెలవుల ముగింపులో సొంతూళ్లకు ప్రయాణమయ్యే వారికి ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ప్రయాణాన్ని ముందస్తుగానే ప్లాన్ చేసుకోవాలని, సురక్షితంగా ప్రయాణించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.