Jana Nayagan: 7 నెలలు లేట్ అయిన తగ్గని క్రేజ్- అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లో అదరగొడుతోన్న సీఎం విజయ్ జన నాయగన్!

CM Thalapathy Vijay Jana Nayagan Ticket Booking: కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం 'జన నాయగన్' ఎట్టకేలకు సెన్సార్ అడ్డంకులను దాటుకుని విడుదలకు సిద్ధమైంది. జూలై 24న గ్లోబల్ రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

Published on: Jul 12, 2026, 07:40:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CM Thalapathy Vijay Jana Nayagan Ticket Booking: తమిళ స్టార్ హీరో, ముఖ్యమంత్రి దళపతి విజయ్ అభిమానులకు, కోలీవుడ్ వర్గాలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హెచ్. వినోద్ కాంబినేషన్‌లో విజయ్ నటిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) ఎట్టకేలకు విడుదలకు లైన్ క్లియర్ చేసుకుంది.

7 నెలలు లేట్ అయిన తగ్గని క్రేజ్- అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లో అదరగొడుతోన్న సీఎం విజయ్ జన నాయగన్!
7 నెలలు లేట్ అయిన తగ్గని క్రేజ్- అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లో అదరగొడుతోన్న సీఎం విజయ్ జన నాయగన్!

సెన్సార్ వివాదాలతో నలిగి

గత కొన్ని నెలలుగా తీవ్ర సెన్సార్ వివాదాలతో నలిగిన ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరిలోనే థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే, సెన్సార్ ఎగ్జామినింగ్ కమిటీ సభ్యుడొకరు ఫిర్యాదు చేయడంతో సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లింది.

దాదాపు ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణ, పలు కట్స్, మార్పుల తర్వాత బోర్డు జన నాయకన్ సినిమాకు 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. శనివారం (జూలై 11) నాడు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, "థియేటర్లలో కలుద్దాం ఫ్రెండ్స్" అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో నెలలుగా ఆందోళనలో ఉన్న అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.

యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ విధ్వంసం

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దళపతి విజయ్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం, అలాగే ఆయన సినీ కెరీర్‌లో ఇదే చివరి చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజకీయాల్లో బిజీ అవ్వడానికంటే ముందే విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు.

జన నాయగన్ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండటంతో విదేశాల్లో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. యూకే డిస్ట్రిబ్యూటర్ 'అహింసా ఎంటర్‌టైన్‌మెంట్స్' బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 60 నిమిషాల్లోనే వేల టికెట్లు అమ్ముడయ్యాయని ప్రకటించింది.

డిస్ట్రిబ్యూటర్ల ట్వీట్

"విజయ్ అనే పేరుకున్న క్రేజ్ నమ్మశక్యం కానిది. బ్రిటన్ సినిమా చరిత్రలోనే ఇది ఒక నటుడికి ఇచ్చే అతిపెద్ద వీడ్కోలు కాబోతోంది. అందరూ థియేటర్లలో ఎంజాయ్ చేయడానికి సిద్ధమవ్వండి" అని డిస్ట్రిబ్యూటర్లు ట్వీట్ చేశారు. భారత్‌తో పాటు మిగిలిన దేశాల్లోనూ త్వరలోనే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

తెలుగు 'భగవంత్ కేసరి'కి రీమేక్?

ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులతోనూ గట్టి సంబంధమే ఉంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన 2023 నాటి సూపర్ హిట్ చిత్రం 'భగవంత్ కేసరి'కి ఇది అధికారిక రీమేక్ అని ఇండస్ట్రీ టాక్. తెలుగులో బాలయ్య బాబాయ్-అమ్మాయి సెంటిమెంట్‌తో మెప్పించగా, తమిళంలో విజయ్ తనదైన శైలిలో ఈ రోల్ చేయనున్నారు.

తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో ఉండటం విశేషం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, 'యానిమల్' విలన్ బాబీ డియోల్ పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌లో కనిపిస్తారు. 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషిస్తోంది.

పొలిటికల్ డైలాగ్స్‌పై ఇంట్రెస్ట్

వీళ్లతో పాటు ప్రకాష్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరైన్ వంటి భారీ తారాగణం జన నాయగన్ చిత్రంలో ఉంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇందులో పొలిటికల్ డైలాగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More