నా మెదడులో చాలా కథలున్నాయి, నాకు ఎదురైన అనుభవంతోనే ఈ కథ రాశా, మలయాళంలోనే ఇలాంటివి ఎక్కువ వస్తాయంటారు: దండోరా దర్శకుడు
రూరల్ బ్యాక్డ్రాప్ సోషల్ సెటైరికల్ సినిమా దండోరా. బిగ్ బాస్ శివాజీ, నందు, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల నేపథ్యంలో తాజాగా ఇవాళ దండోరా సినీ విశేషాలను తెలిపారు డైరెక్టర్ మురళీకాంత్.
సమాజంలోని సామాజిక అసమానతలపై సోషల్ సెటైరికల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా దండోరా. బిగ్ బాస్ శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి, అదితి భావరాజు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు.
నా మెదడులో చాలా కథలున్నాయి, నాకు ఎదురైన అనుభవంతోనే ఈ కథ రాశా, మలయాళంలోనే ఇలాంటివి ఎక్కువ వస్తాయంటారు: దండోరా దర్శకుడు
దండోరా దర్శకుడి కామెంట్స్
డిసెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్గా దండోరా మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ (డిసెంబర్ 15) మీడియా ఇంటర్వ్యూలో దండోరా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు డైరెక్టర్ మురళీకాంత్.
‘దండోరా’ కథ ఆలోచన ఎక్కడ, ఎలా మొదలైంది?
-మాది మెదక్. నాకు ఓ మంచి సినిమాను తీయాలనే కోరిక ఉండేది. అమెరికాలో జాబ్ చేస్తుండేవాడిని. కానీ, నాకు అది రొటీన్ లైఫ్ అని అనిపించింది. నేను అక్కడ కూడా ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడిని. అలా సినిమాల మీద ఇష్టంతో జీవితంలో రిస్క్ తీసుకుని ఇటు వైపు వచ్చాను.
-నా మెదడులో చాలా కథలు ఉన్నాయి. అయితే ప్రేమ కథల్ని నెరేట్ చేయడం చాలా కష్టం. అందుకే ఓ కాన్సెప్ట్, మూలాల్లోని కథ చెప్పాలని ఈ స్టోరీ అనుకున్నాను. పుస్తకాలు చదవడం ద్వారా ఎంతో మంది, ఎన్నో రకాల లైఫ్ స్టైల్స్ తెలుస్తాయి. సమాజంలోని అసమానతల మీద కథ చెప్పాలనే ఉద్దేశంతో ‘దండోరా’ తీశాను.
‘దండోరా’ కథ కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు?
-చనిపోయిన వ్యక్తుల్ని పూడ్చేందుకు కమ్యూనిటీ వైజ్గా, రిలీజియస్ వైజ్గా కొంత మందికి భూమిని కేటాయిస్తారని నాకు అంతగా తెలీదు. నాకు ఎదురైన ఓ అనుభవంతో ఈ కథను రాసుకున్నాను. మలయాళంలో ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తాయని అంటుంటారు. మన దగ్గర ఎందుకు రావు? అనే ఆలోచనల్లోంచి ఈ కథను రాసుకున్నాను.
‘బలగం’ కూడా చనిపోయిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ‘దండోరా’తో పోలికలు ఏమైనా వస్తాయా?
-‘బలగం’లో వ్యక్తి చనిపోయిన తరువాత జరిగే పిండ ప్రధానం చుట్టూ తిరుగుతుంది. ‘దండోరా’ చిత్రంలో వ్యక్తి చనిపోయిన తరువాత నుంచి పూడ్చి పెట్టే వరకు జరుగుతుంది. క్రిమేషన్తో ఈ చిత్రం ఎండ్ కార్డ్ పడుతుంది.
-‘బలగం’ కథకి, ‘దండోరా’కి ఎలాంటి పోలికలు, స్పూర్తి గానీ లేదు. ఓ వ్యక్తిని ఎందుకు పూడ్చనివ్వడం లేదు? ఆ ఊరి సమస్య ఏంటి? సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా? అన్నదే కథ.
వైకుంఠధామాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా? ఈ చిత్రంలో ఆ పాయింట్ టచ్ చేశారా?
-ప్రభుత్వాలు వైకుంఠ ధామాల్ని ఏర్పాటు చేసింది. కానీ, అక్కడ కూడా వివక్షనే చూపిస్తుంటారు. నేను ప్రత్యక్షంగా ఎన్నో ఘటనల్ని చూశాను. అందుకే ఈ కథను రాసుకున్నాను. అయితే ఈ సమస్యకు నేను పూర్తిగా పరిష్కారాన్ని ఇచ్చానా? చూపించానా? అన్నది సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెప్పాలి.