GT Vs RCB IPL 2026: ఫైనల్‌లో బెడిసికొట్టిన గుజరాత్ తప్పుడు వ్యూహం- నెహ్రాపై ఏబీ డివిలియర్స్ ఫైర్- వైభవ్‌కే ఆరెంజ్ క్యాప్

IPL 2026 Final GT vs RCB: ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్‌ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్, సాయి సుదర్శన్ తక్కువ పరుగులకే అవుట్ అవ్వగా.. జోస్ బట్లర్‌ను కాదని నిశాంత్ సింధును వన్‌డౌన్‌లో పంపడంపై ఏబీ డివిలియర్స్ తీవ్రంగా మండిపడ్డారు.

Published on: May 31, 2026, 20:36:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IPL 2026 Final GT vs RCB Nehra AB De Villiers: మెగా టోర్నీ ఐపీఎల్ 2026 తుది పోరులో గుజరాత్ టైటాన్స్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరుగుతున్న ఈ గ్రాండ్ ఐపీఎల్ ఫైనల్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే భారీ షాక్‌లు తగిలాయి.

ఫైనల్‌లో బెడిసికొట్టిన గుజరాత్ తప్పుడు వ్యూహం- నెహ్రాపై ఏబీ డివిలియర్స్ ఫైర్- వైభవ్‌కే ఆరెంజ్ క్యాప్ (PTI)
ఫైనల్‌లో బెడిసికొట్టిన గుజరాత్ తప్పుడు వ్యూహం- నెహ్రాపై ఏబీ డివిలియర్స్ ఫైర్- వైభవ్‌కే ఆరెంజ్ క్యాప్ (PTI)

పవర్‌ప్లేలో ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు

పవర్‌ప్లేలోనే ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లను కోల్పోయి టైటాన్స్ తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే, కెప్టెన్ గిల్ అవుటైన తర్వాత క్రీజులోకి స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ వస్తాడని అందరూ ఆశించగా, గుజరాత్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఒక వింత నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.

నెహ్రా వ్యూహంపై డివిలియర్స్ తీవ్ర అసంతృప్తి

గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా నేతృత్వంలోని థింక్ ట్యాంక్.. బట్లర్‌ను కాదని యువ ఆటగాడు నిశాంత్ సింధును వన్‌డౌన్ (నెంబర్ 3)లో బ్యాటింగ్‌కు పంపింది. ఈ నిర్ణయంపై క్రికెట్ విశ్లేషకులు పెదవి విరవగా, ఆర్సీబీ మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ లైవ్ కామెంట్రీలో గుజరాత్ వ్యూహాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల బట్లర్ లాంటి స్టార్ ప్లేయర్‌ను వెనక్కి నెట్టడం ఏమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

"బట్లర్‌ను ముందే పంపి రిస్క్ తీసుకోకూడదని గుజరాత్ భావించి ఉండవచ్చు. నా కెరీర్‌లో కూడా నేను చాలాసార్లు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేయడానికే బట్లర్‌ను వెనక్కి నెట్టారు" అని ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించారు. అయితే, గుజరాత్ తీసుకున్న నిర్ణయం డిఫెన్సివ్ (రక్షణాత్మక) కాల్ అని భావిస్తున్నారా అని తోటి కామెంటేటర్ ప్రశ్నించగా డివిలియర్స్ ఘాటుగా స్పందించారు.

"ఇది పక్కా డిఫెన్సివ్ వ్యూహం. నాకైతే ఈ నిర్ణయం అస్సలు నచ్చలేదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు. చివరకు డివిలియర్స్ అన్నట్టే గుజరాత్ వ్యూహం బెడిసికొట్టింది. నెంబర్ 3లో వచ్చిన నిశాంత్ సింధు 18 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేసి రసీఖ్ సలామ్ దార్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అనంతరం 73 పరుగుల వద్ద జోస్ బట్లర్ స్టెంప్ అవుట్ అయి జీటీకి కోలుకోలేని షాక్ ఇచ్చాడు.

పవర్‌ప్లేలోనే కోలుకోలేని దెబ్బ

అంతకుముందు ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే జోష్ హేజిల్‌వుడ్ వేసిన షార్ట్ పిచ్ బంతికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10) అవుటయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బంతితో సాయి సుదర్శన్ (12)ను క్లీన్ బౌల్డ్ చేసి గుజరాత్‌కు కోలుకోలేని దెబ్బ తీశాడు.

ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు ఇద్దరూ ఫ్లాప్ అవ్వడంతో ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరనేది అధికారికంగా ఖరారైంది. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తంలో ఏకంగా 776 పరుగులు సాధించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.

చరిత్ర సృష్టించే ఛాన్స్‌లో రజత్ పటిదార్

అంతకుముందు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ టాస్ గెలిచి పిచ్ పరిస్థితులను అంచనా వేస్తూ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. "ఇది బ్యాటింగ్‌కు చాలా అనుకూలమైన వికెట్. బంతి బ్యాట్‌పైకి బాగా వస్తుంది. 40 ఓవర్ల పాటు ఈ పిచ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండదు. అందుకే గుజరాత్‌ను వీలైనంత తక్కువ పరుగులకే కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాం" అని టాస్ సమయంలో పటిదార్ ధీమా వ్యక్తం చేశాడు.

గతేడాది సరిగ్గా ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలుచుకుంది. ఒకవేళ ఈ ఫైనల్లో కూడా గుజరాత్‌పై విజయం సాధిస్తే, ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల తర్వాత వరుసగా రెండుసార్లు (బ్యాక్-టు-బ్యాక్) టైటిల్ గెలిచిన మూడో కెప్టెన్‌గా రజత్ పటిదార్ అరుదైన రికార్డు సృష్టిస్తాడు.

గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి

"గతేడాది ఈ మైదానంలో మాకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, అది 2025, ఇప్పుడు 2026. గతాన్ని మర్చిపోయి ప్రస్తుత మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాలి. మన చేతుల్లో ఉన్న విషయాలను నియంత్రించడమే ముఖ్యం. ఇక్కడి క్రౌడ్, ప్రత్యేకంగా ఆర్సీబీ '12త్ మ్యాన్ ఆర్మీ' ఇచ్చే సపోర్ట్ వల్లే మాకు ఈ స్టేడియంలో ఆడటం ఎంతో ఇష్టం" అని పటిదార్ అభిమానులపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నాడు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More