OTT Show: మందు తాగి భర్తను బెల్ట్‌తో కొట్టడం నా డ్రీమ్.. మా నాన్న, తమ్ముడు కూడా నచ్చరు- ఓటీటీ షోలో టీచర్ సాక్షి రచ్చ

India's Got Latent 2 OTT Show Sakshi Jha Hates Men: ప్రముఖ ఓటీటీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్'లో బిహార్‌కు చెందిన సాక్షి ఝా అనే టీచర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పురుషులపై విపరీతమైన ద్వేషాన్ని కక్కిన ఆమెకు జడ్జీలు, ఆడియన్స్ ఏకగ్రీవంగా సున్నా మార్కులు వేసి గట్టి షాకిచ్చారు.

Published on: Jul 19, 2026, 11:29:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

India's Got Latent 2 OTT Show Sakshi Jha Hates Men: యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వేదికలుగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ ఓటీటీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' (India's Got Latent Season 2). సమయ్ రైనా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ వినూత్న కామెడీ టాలెంట్ షో మూడో ఎపిసోడ్‌తో సరికొత్త వివాదంలో చిక్కుకుంది.

మందు తాగి భర్తను బెల్ట్‌తో కొట్టడం నా డ్రీమ్.. మా నాన్న, తమ్ముడు కూడా నచ్చరు- ఓటీటీ షోలో టీచర్ సాక్షి రచ్చ
మందు తాగి భర్తను బెల్ట్‌తో కొట్టడం నా డ్రీమ్.. మా నాన్న, తమ్ముడు కూడా నచ్చరు- ఓటీటీ షోలో టీచర్ సాక్షి రచ్చ

పురుష ద్వేషిగా పరిచయం

బిహార్‌కు చెందిన సాక్షి ఝా అనే కంటెస్టెంట్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై దావానలంలా వ్యాపిస్తున్నాయి. వింత ప్రవర్తన, రొటీన్‌కు భిన్నమైన ఆలోచనలతో వచ్చే వారిని జడ్జీలు రోస్ట్ చేసే ఈ షోలో.. సాక్షి తనను తాను "మ్యాన్ హేటర్" (పురుష ద్వేషి)గా పరిచయం చేసుకుంది.

అంతటితో ఆగకుండా భవిష్యత్తులో పెళ్లయ్యాక మద్యం తాగి బెల్ట్‌తో తన భర్తని చితకబాదడమే తన జీవిత ఆశయమంటూ వేదికపైనే ప్రకటించి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.

తరాల నాటి గాయం.. తండ్రి, తమ్ముడిపై ద్వేషం!

బిహార్‌లో ఉపాధ్యాయురాలిగా, సోషల్ మీడియా క్రియేటర్‌గా పనిచేస్తున్న సాక్షి ఝా.. ఈ వేదికపై మాట్లాడుతూ సమాజంలో పురుషుల అహంకారాన్ని దెబ్బతీయడమే తనకు కిక్ ఇస్తుందని చెప్పింది. "ఈ జనరేషన్‌లో ఆడపిల్లగా పుట్టడమే ఒక పెద్ద మానసిక క్షోభ. నాకు ఏ కులం మీదా కోపం లేదు కానీ, మగాళ్లంటేనే అసహ్యం. అసలు మగాళ్లకు ఏం వచ్చని అంత గర్వపడతారు? వాళ్లేమైనా తండ్రి కడుపున పుట్టారా, తల్లి కడుపు నుంచే కదా వచ్చింది" అని సాక్షి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

సాక్షి ఝా మాటలు విన్న జడ్జీలు సమయ్ రైనా, తన్మయ్ భట్, విశాల్ దద్లానీ, రఘు రామ్, యశ్‌రాజ్ మెహ్రా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంతటి ద్వేషానికి కారణమేంటని హోస్ట్ సమయ్ ప్రశ్నించగా.. ఇది తన కుటుంబంలో తరాలుగా వస్తున్న మానసిక గాయం (జనరేషనల్ ట్రామా) అని సమాధానమిచ్చింది.

తండ్రి, తమ్ముడు కూడా మగాళ్లే కదా

"మా నాన్నను కూడా నేను ద్వేషిస్తాను. ఆయన నా తండ్రి కావచ్చు కానీ ఒక మగాడే కదా! మా తాతయ్యకు కూడా నేను నచ్చను, ఎందుకంటే ఆయన మనవడిని, అంటే నా తమ్ముడిని నేను అస్సలు ఇష్టపడను కాబట్టి" అని సాక్షి కుండబద్దలు కొట్టింది. తన సొంత ఊరు బిహార్ ప్రజలపై కూడా ఆమె కొన్ని వెటకారపు కామెంట్లు చేసింది.

షో చరిత్రలోనే తొలిసారి.. అందరూ 'బిగ్ జీరో'!

సాక్షి ఝా తన పర్ఫార్మెన్స్‌కు తాను 10కి 8 మార్కులు ఇచ్చుకోగా.. జడ్జీల ప్యానెల్ మాత్రం ఆమెకు ఊహించని షాకిచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షో చరిత్రలోనే తొలిసారిగా ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా ఆమెకు సున్నా మార్కులు (0) ఇచ్చారు.

చివరకు ఆడియన్స్‌ను రేటింగ్ అడగ్గా.. హాల్‌లోని వారంతా ఏకతాటిపై నిలబడి 'జీరో' అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఈ సీజన్‌లోనే అందరి దగ్గర క్లీన్ స్వీప్‌గా జీరో మార్కులు సాధించిన ఏకైక కంటెస్టెంట్‌గా సాక్షి ఝా రికార్డు సృష్టించింది.

నెటిజన్ల ఫైర్.. 'ఇదా మీ ఫెమినిజం?'

ఈ ఎపిసోడ్ ఓటీటీ రిలీజ్ అయిన కొద్దిసేపటికే దీనికి సంబంధించిన క్లిప్‌లు ఎక్స్ (ట్విటర్), ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. సాక్షి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇది ఫెమినిజం కాదు, 'టాక్సిక్ ఫెమినిజం' (విషపూరిత స్త్రీవాదం) అంటూ విమర్శలు చేస్తున్నారు.

"భారతదేశంలో ఫెమినిజం అంటే ఇదే అనుకుంటున్నారు, ఇది చాలా బాధాకరం" అని ఒక నెటిజన్ ఎక్స్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఇలాంటి నకిలీ ఫెమినిస్టుల వల్లే సమాజంలో నిజమైన స్త్రీవాదానికి చెడ్డపేరు వస్తోంది. మగాళ్లను తిట్టడమే వీళ్ల కెరీర్" అని మరో యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ద్వేషాన్ని పెంచుతున్నారు

ఆధునిక కాలంలో 'కూల్'గా, విభిన్నంగా కనిపించడం కోసం కొందరు యువతులు ఇలాంటి విపరీత ధోరణులను ప్రదర్శిస్తూ సమాజంలో లేనిపోని ద్వేషాన్ని పెంచుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్‌లలో

అయితే, పలు కారణాల వల్ల సాక్షి ఝా కామెంట్స్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపించట్లేదు. కాగా, ప్రస్తుతం ఈ ఎపిసోడ్ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More