దురంధర్పై సందీప్ రెడ్డి వంగా రివ్యూ- ఇంత గొప్పగా చూపించినందుకు కృతజ్ఞతలంటూ- దర్శకుడు ఆదిత్య ధర్ రియాక్షన్ అలా!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ సినిమాపై ప్రశంసల పరంపర కొనసాగుతోంది. తాజాగా ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని ఆకాశానికెత్తేశారు. రణ్వీర్ సింగ్తోపాటు ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్, మేకింగ్ అద్భుతమంటూ సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ‘ధురంధర్’ పేరు మారుమోగిపోతోంది. సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ దిగ్గజాల వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

ప్రశంసల జాబితాలో సందీప్ రెడ్డి వంగా
తాజాగా ఈ జాబితాలో ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేరారు. దురంధర్ సినిమా చూసిన తర్వాత తన మనసులోని భావాలను సందీప్ రెడ్డి ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
“నిక్కచ్చిగా.. బలంగా ఉంది”
‘ధురంధర్’ చిత్రంపై సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో స్పందించారు. "ఎక్కువగా మాట్లాడకుండా, బలమైన ఆత్మవిశ్వాసంతో ఉండే ఒక ధీరుడిలా ఈ సినిమా ఉంది. ‘ధురంధర్’ అనే టైటిల్కు తగ్గట్టుగానే సినిమా ఆద్యంతం ఎంతో గంభీరంగా, పవర్ఫుల్ గమనంతో సాగింది" అని సందీప్ రెడ్డి వంగా రాసుకొచ్చారు.
"ఎక్కడా గందరగోళం లేకుండా మేకర్స్ చాలా స్పష్టమైన విజన్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంగీతం, నటీనటుల ప్రదర్శన, స్క్రీన్ప్లే, దర్శకత్వం.. ఇలా ప్రతి విభాగం అత్యున్నత స్థాయిలో ఉన్నాయి" అని సందీప్ రెడ్డి వంగా ప్రశంసించారు.
పాత్రలో కనిపిస్తాయి
"ముఖ్యంగా అక్షయ్ ఖన్నా సార్, రణ్వీర్ సింగ్ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. వాళ్లు కనిపిస్తున్నంత సేపు తెరపై నటులు కాదు, ఆ పాత్రలే మనకు కనిపిస్తాయి" అని సందీప్ రెడ్డి వంగా కొనియాడారు.
"మన దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను ఇంత గొప్పగా చూపించినందుకు డైరెక్టర్ ఆదిత్య ధర్ సర్ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు" అని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. అయితే, సందీప్ రెడ్డి వంగా ట్వీట్కు దురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ స్పందించారు.
ఆదిత్య ధర్ రియాక్షన్
"మీలాంటి దర్శకుడి నుంచి ఈ మాటలు రావడం నాకు ఎంతో గొప్ప విషయం. మీరు చేసే సినిమాల్లో ఉండే నిర్భీతి, మగతనాన్ని ఎంతో సహజంగా, నిక్కచ్చిగా చూపించే మీ శైలి నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది" అని ఆదిత్య ధర్ రాసుకొచ్చారు.
"దురంధర్ సినిమాను మేము ఎంతో చిత్తశుద్ధితో, నిబద్ధతతో రూపొందించాము. మీ మాటలు మా ప్రయత్నానికి ఒక గుర్తింపును ఇచ్చాయి. మన భారతీయ సినిమాను నిజాయితీగా, మూలాలను మర్చిపోకుండా ఉంచే మీలాంటి గొంతుకలు ఉండటం సంతోషకరం" అని ఆదిత్య ధర్ పేర్కొన్నారు.
మరో స్థాయికి తీసుకెళ్దామంటూ
రానున్న రోజుల్లో ధైర్యంతో కూడిన సినిమాలతో భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్దామని ఆదిత్య ధర్ పిలుపునిచ్చారు. కాగా, కేవలం సందీప్ రెడ్డి వంగా మాత్రమే కాకుండా ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ, కరణ్ జోహార్, సిద్ధార్థ్ ఆనంద్ వంటి ప్రముఖ దర్శకులు కూడా ‘ధురంధర్’ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.

E-Paper












