OTT: 127 కట్స్, మూడేళ్ల నిరీక్షణ, టైటిల్ చేంజ్.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన బయోగ్రాఫికల్ క్రైమ్ థ్రిల్లర్- ఎక్కడంటే?
Satluj OTT Streaming: సెన్సార్ వివాదాల వల్ల మూడేళ్లుగా ల్యాబ్కే పరిమితమైన దిల్జీత్ దోసాంజ్ బయోగ్రాఫికల్ క్రైమ్ థ్రిల్లర్ 'పంజాబ్ 95' పేరు మార్చుకుని 'సట్లజ్'గా ఓటీటీలోకి వచ్చేసింది. మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 3 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
Satluj OTT Streaming Without Sensor Cuts: బాలీవుడ్, పంజాబీ చిత్రసీమల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దిల్జీత్ దోసాంజ్. ఆయన నటించిన మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ ఎట్టకేలకు భారతీయ ప్రేక్షకుల కోసం ఓటీటీలోకి వచ్చేసింది.

సట్లజ్ ఓటీటీ స్ట్రీమింగ్
గత మూడేళ్లుగా సెన్సార్ బోర్డు చుట్టూ తిరుగుతూ, అనేక వివాదాల్లో చిక్కుకున్న 'పంజాబ్ 95' సినిమా.. ఇప్పుడు సరికొత్త పేరుతో నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. 'సట్లజ్' (Satluj) అనే కొత్త టైటిల్తో జూలై 3 (శుక్రవారం) నుంచి జీ5 (ZEE5)లో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా నిజ జీవిత కథ ఆధారంగా దర్శకుడు హనీ ట్రెహాన్ ఈ సినిమాను బయోగ్రాఫికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందించారు. పంజాబ్ చరిత్రలో అత్యంత చీకటి రోజులుగా భావించే 1984 నుంచి 1994 మధ్య కాలంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఎవరీ జస్వంత్ సింగ్ ఖల్రా?
పంజాబ్లో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న రోజుల్లో (1984-1994) పోలీసులు వేలాది మంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను చట్టవిరుద్ధంగా దహనం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాలపై జస్వంత్ సింగ్ ఖల్రా తీవ్రంగా దర్యాప్తు చేశారు. దాదాపు వేలాది మంది అదృశ్యమైన కేసుల వెనుక ఉన్న నిజాలను ఆయన బయటపెట్టారు.
ఈ క్రమంలోనే 1995లో ఆయన కూడా హఠాత్తుగా అదృశ్యమయ్యారు. పోలీసులు ఆయనను కిడ్నాప్ చేసి హతమార్చారనే ఆరోపణలపై సుదీర్ఘ విచారణ జరిగింది. చివరికి 2005లో నలుగురు పంజాబ్ పోలీసు అధికారులకు ఈ కేసులో కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించగా.. 2007లో పంజాబ్, హర్యానా హైకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. ఈ సున్నితమైన అంశాన్ని దర్శకుడు ఎంతో ఎమోషనల్గా తెరపైకి తెచ్చారు.
సామాన్యుడి ధైర్యాన్ని
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో ఎన్కౌంటర్లు, అదృశ్యమైన వ్యక్తుల చుట్టూ పౌరహక్కుల సంఘాలు చేసిన పోరాటాలు పెద్ద చర్చకు దారితీశాయి. సరిగ్గా అలాంటి ఒక చారిత్రక పోరాటాన్ని, ఒక సామాన్యుడి ధైర్యాన్ని ఈ సినిమాలో చూపించారు.
ఈ చిత్రంలో దిల్జీత్ దోసాంజ్తో పాటు అర్జున్ రాంపాల్, కన్వల్జీత్ సింగ్, సువిందర్ విక్కీ కీలక పాత్రలు పోషించారు. మ్యాక్గఫిన్ పిక్చర్స్, ఆర్ఎస్వీపీ పతాకాలపై హనీ ట్రెహాన్, అభిషేక్ చౌబే, రోనీ స్క్రూవాలా ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.
సెన్సార్ బోర్డుతో మూడేళ్ల యుద్ధం
ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడానికి ప్రధాన కారణం సెన్సార్ బోర్డే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సట్లజ్ సినిమాకు ఏకంగా 127 కట్స్ చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. టైటిల్తో పాటు సినిమాలో ఉన్న అనేక కీలక సన్నివేశాలు, డైలాగులను తొలగించాలని సెన్సార్ బోర్డు పట్టుబట్టింది.
దీంతో 2023లో ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ప్రదర్శనకు ఎంపికైనప్పటికీ.. చివరి నిమిషంలో నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా ఈ సినిమాను జాబితా నుంచి తొలగించారు. ఆ తర్వాత 2025 ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావించినా భారత్లో సెన్సార్ ఇబ్బందుల వల్ల ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు.
ఒక్క కట్ కూడా లేకుండా ఒరిజినల్ వెర్షన్
ఎన్నో ఆంక్షల తర్వాత థియేటర్లను వదులుకుని ఓటీటీ బాట పట్టిన ఈ సినిమా గురించి దర్శకుడు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. జీ5 ఓటీటీలో ఎలాంటి కట్స్ లేకుండా, తాను అనుకున్న కథను అనుకున్నట్లుగానే ఒరిజినల్ వెర్షన్లో ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
"ఇది నిజాయితీతో, ఎంతో సున్నితంగా చేసిన ప్రయత్నం. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత మా కష్టాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. సట్లజ్ కేవలం ఒక వ్యక్తి కథ కాదు, కష్ట సమయాల్లో మనుషులు చూపే ధైర్యానికి ప్రతీక. ఈ కథను ఎలాంటి కట్స్, రాజీలు లేకుండా పూర్తి రూపంలో జీ5లో అందిస్తున్నాం" అని దర్శకుడు హనీ ట్రెహాన్ సంతోషం వ్యక్తం చేశారు.
నటుడి కామెంట్స్
నటుడు దిల్జీత్ దోసాంజ్ కూడా ఈ సినిమా తన కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. "ఇది ధైర్యం, మానవత్వానికి సంబంధించిన కథ. జస్వంత్ సింగ్ ఖల్రా గారి త్యాగం, సమాజానికి ఆయన చేసిన సేవలే నన్ను ఈ పాత్ర వైపు నడిపించాయి. కథ విన్నప్పుడే నా మనసు చలించింది. ఇంతటి గొప్ప కథను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తెచ్చినందుకు జీ5 ఓటీటీ సంస్థకు కృతజ్ఞతలు" అని దిల్జీత్ దోసాంజ్ వివరించారు.
వీకెండ్కు ఓటీటీలో చూసేందుకు
రాజకీయ అవినీతి, పాలకుల అణచివేతపై సామాన్యుడు చేసిన ఈ పోరాటం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఎలాంటి కట్స్ లేకుండా కేవలం టైటిల్ చేంజ్తో జీ5లో ఓటీటీ రిలీజ్ అయిన సట్లజ్ వీకెండ్లో చూసేందుకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


