Shahrukh: పెళ్లి తర్వాత మొదట నివసించిన బిల్డింగ్కి సోలో ఓనర్ అయిన షారుఖ్ ఖాన్- 37 కోట్లతో- జ్ఞాపకాల పందిరి అన్న భార్య!
Shah Rukh Khan Buys Delhi Property Worth 37 Cr: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఢిల్లీలోని తన పాత జ్ఞాపకాల నిలయాన్ని పూర్తిగా సొంతం చేసుకున్నారు. సౌత్ ఢిల్లీలోని పాష్ ఏరియాలో ఉన్న ఓ బిల్డింగ్లో మిగిలిన రెండు అంతస్తులను రూ.37 కోట్లకు కొనుగోలు చేసి ఆ ఆస్తి మొత్తానికి ఆయనే ఏకైక యజమానిగా మారారు.
Shah Rukh Khan Buys Delhi Property Worth 37 Cr: బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్కు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ముంబైలోని ఆయన నివాసం 'మన్నత్' ఒక పర్యాటక ప్రాంతంలా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

అయితే, షారుఖ్ తాజాగా చేసిన ఒక భారీ ప్రాపర్టీ డీల్ వెనుక మాత్రం కేవలం వ్యాపార కోణం లేదు, దాని వెనుక ఎంతో ఎమోషన్ దాగుంది. తన పుట్టిన ఊరు, కెరీర్ ప్రారంభరోజులకు వేదికైన దేశ రాజధాని ఢిల్లీలో షారుఖ్ ఖాన్ ఒక కీలకమైన ఆస్తిని కొనుగోలు చేశారు. సౌత్ ఢిల్లీలోని అత్యంత సంపన్న ప్రాంతమైన పంచ్శీల్ పార్క్లో ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్కు సంబంధించిన రెండు అంతస్తులను షారుఖ్ సొంతం చేసుకున్నారు.
రూ.37 కోట్లతో మొత్తం బిల్డింగ్ సొంతం
మనీకంట్రోల్ కథనం ప్రకారం, ఈ అపార్ట్మెంట్లోని రెండు అంతస్తుల (సెకండ్, థర్డ్ ఫ్లోర్స్) కొనుగోలు కోసం షారుఖ్ ఖాన్ సుమారు రూ.37 కోట్లు వెచ్చించారు. నిజానికి ఈ బిల్డింగ్లోని బేస్మెంట్, మొదటి అంతస్తు (ఫస్ట్ ఫ్లోర్) ఇప్పటికే షారుఖ్ పేరిటే ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన రెండు అంతస్తులను కూడా కొనేయడంతో, ఆ మొత్తం బిల్డింగ్కు షారుఖ్ ఖాన్ ఏకైక యజమానిగా మారారు.
ఈ బిల్డింగ్కు షారుఖ్, గౌరీ ఖాన్ దంపతుల జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. 1991లో వీరి వివాహం జరిగిన తర్వాత, ముంబైకి మారడానికి ముందు ఇక్కడే తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. షారుఖ్, గౌరీ ఇద్దరూ ఢిల్లీలోనే పుట్టి పెరిగారు.
ఆ తర్వాత నటుడిగా మారాలనే బలమైన కోరికతో షారుఖ్ ముంబైకి పయనమయ్యారు. కాలక్రమేణా అక్కడే స్థిరపడినా, ఢిల్లీతో ఉన్న బంధాన్ని మాత్రం వారు ఎప్పుడూ తెంచుకోలేదు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్ ప్రాంతాలు తెలుగు స్టార్ హీరోలకు ఎంత సెంటిమెంటో, షారుఖ్కు ఈ ఢిల్లీ ఇల్లు అంతకంటే ఎక్కువేనని బాలీవుడ్ వర్గాలు అంటుంటాయి.
చదరపు అడుగు రూ.34 వేలకు పైగా..
ఈ లగ్జరీ ప్రాపర్టీ దాదాపు 1,200 చదరపు గజాల (సుమారు 10,800 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాంతంలో భూమి విలువ చదరపు అడుగుకు దాదాపు రూ.34,260 గా ఉంది. అందుకే ఈ రెండు అంతస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.37 కోట్లకు చేరింది.
జ్ఞాపకాల పందిరి.. గౌరీ ఖాన్ భావోద్వేగం
ఈ ఢిల్లీ ఇల్లు తమకు ఎంత ప్రత్యేకమైనదో గతంలో గౌరీ ఖాన్ 'ఐదివా' (iDiva) కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తమ జీవితంలోని మధురమైన జ్ఞాపకాలన్నీ ఈ ఇంటితోనే ముడిపడి ఉన్నాయని ఆమె వివరించారు.
"మా ఢిల్లీ ఇల్లు దాదాపు 20 ఏళ్ల నాటిది. నేను ఢిల్లీలోనే పుట్టడం, నా జీవితంలో ఎక్కువ భాగం ఇక్కడే గడపడం వల్ల మా అమ్మగారి ఇంటికి దగ్గరలోనే ఒక ఇల్లు కొని దాన్ని స్వయంగా డిజైన్ చేయాలనుకున్నాను. మా జ్ఞాపకాలన్నీ ఒకే తాటిపైకి తీసుకురావాలనేదే నా ఆలోచన. ఇన్నేళ్ల ప్రయాణంలో మేము ఎన్నో దేశాలు తిరిగాం, పిల్లలతో కలిసి ఎన్నో వస్తువులను సేకరించాం. అవన్నీ ఈ ఇంట్లోనే భద్రంగా దాచుకున్నాం" అని గౌరీ ఖాన్ పేర్కొన్నారు.
పిల్లల చిన్ననాటి వస్తువులతో 'నోస్టాల్జియా వాల్'
ఈ ఇల్లు తమ పిల్లల ఎదుగుదలకు సజీవ సాక్ష్యమని గౌరీ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంటి లోపలికి అడుగుపెట్టగానే ప్రతి మూలలో ఒక కథ కనిపిస్తుందని చెప్పారు.
"మా పిల్లలు చిన్నతనం నుంచి పెద్దవాళ్లు అయ్యే వరకు సాగిన ప్రయాణం ఈ ఇంట్లో కనిపిస్తుంది. మా ఇంట్లో ఒక 'నోస్టాల్జియా వాల్' (జ్ఞాపకాల గోడ) ఏర్పాటు చేశాం. అందులో సుహానా మేకప్ బ్రష్లు, ఆర్యన్ ఖాన్ బాడ్మింటన్ రాకెట్, అబ్రామ్ మొదటి పుట్టినరోజు కానుక, షారుఖ్ గీసిన పెయింటింగ్స్, పోస్ట్కార్డులతో పాటు ఇన్నేళ్లలో షారుఖ్ నాకు బహుమతిగా ఇచ్చిన ఎన్నో పురాతన వస్తువులను ఫ్రేమ్ కట్టించి ఆ గోడకు తగిలించాను. మా ఇంట్లో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అదే" అని గౌరీ ఖాన్ వివరించారు.
మొదటి సంపాదనతో ముడిపడిన జ్ఞాపకాలు
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని నమ్మే షారుఖ్ ఖాన్, తన కెరీర్ మొదలైన చోటును, తన మొదటి సంపాదనతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను ఇలా పదిలపరుచుకోవడం చూసి అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


