Amazon Prime OTT: సూపర్ హిట్ సిరీస్ను క్యాన్సిల్ చేసిన అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- మరుసటిరోజే ఏకంగా 5 అవార్డులు- ఇప్పుడేంటీ?
Amazon Prime OTT Cancelled Spider Noir Series: సూపర్ హిట్ సిరీస్ను క్యాన్సిల్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సంస్థకు మరుసటి రోజే షాక్ తగిలింది. ఆ సిరీసే స్పైడర్ నోయిర్. 78వ ఎమ్మీ అవార్డుల ప్రారంభోత్సవంలో ఏకంగా 5 అవార్డులను కొల్లగొట్టి స్పైడర్ నోయిర్ అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ వివరాలేంటో చూద్దాం.
Amazon Prime OTT Cancelled Spider Noir Series: హాలీవుడ్ బుల్లితెర ఆస్కార్గా భావించే ప్రతిష్టాత్మక 78వ ఎమ్మీ పురస్కారాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ప్రధాన వేడుకకు మరో వారముందే అవార్డుల ప్రదానం మొదలైంది. ఈ ఏడాది ఎమ్మీల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం 'స్పైడర్ నోయిర్' ఓటీటీ సిరీసే.

క్యాన్సిల్ అయిన మరుసటి రోజే 5 ఎమ్మీలు
కొన్ని రోజుల కిందటే ఈ సిరీస్ను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించగా, ఆ మరుసటి రోజే ఏకంగా ఐదు ఎమ్మీ అవార్డులు అందుకొని హాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది ఈ స్పైడర్ నోయిర్ ఓటీటీ సిరీస్.
క్యాన్సిల్ చేసిన కొద్ది రోజులకే ఐదు ట్రోఫీలు!
అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎంజీఎమ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సూపర్హీరో సిరీస్కు విమర్శకుల నుంచి ప్రశంసలు, వీక్షకుల నుంచి మంచి ఆదరణ లభించినా అనుకోకుండా మొదటి సీజన్తోనే నిలిపివేశారు. మే నెలలో అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ 78వ ఎమ్మీ అవార్డుల్లో అత్యధికంగా 11 కేటగిరీల్లో నామినేషన్లు సాధించి రికార్డు సృష్టించింది.
ఆదివారం (సెప్టెంబర్ 6) రాత్రి జరిగిన తొలి విడత అవార్డుల ప్రధానోత్సవంలో స్టంట్ కోఆర్డినేషన్, సౌండ్ ఎడిటింగ్, టైటిల్ డిజైన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ విభాగాల్లో ఐదు పురస్కారాలను కైవసం చేసుకుంది స్పైడర్ నోయిర్ సిరీస్.
ఎవరికి ఫోన్ చేయాలో చెప్పండి
"ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రైమ్ వీడియోను కోరేందుకు ఎవరికి ఫోన్ చేయాలో చెప్పండి. నేను మాట్లాడతాను" అని స్టంట్ కోఆర్డినేటర్ ఫెడ్రిక్ బౌసీగ్యూస్ ఈ సందర్భంగా సరదాగా వ్యాఖ్యానించారు. 1930ల నాటి న్యూయార్క్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్లో హాలీవుడ్ స్టార్ నికోలస్ కేజ్ ప్రైవేట్ డిటెక్టివ్ బెన్ రైలీ పాత్రలో అలరించారు.
మరణానంతరం రాబ్ రైనర్కు ఎమ్మీ గౌరవం
గతేడాది డిసెంబర్లో భార్యతో సహా దుర్మరణం చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు రాబ్ రైనర్ను ఎమ్మీ వేదిక గౌరవంగా స్మరించుకుంది. హిట్ సిరీస్ 'ది బేర్'లో అత్యుత్తమ గెస్ట్ రోల్ పోషించినందుకుగానూ ఆయనకు మరణానంతరం (Posthumous) ఎమ్మీ అవార్డు ప్రకటించారు. 1995లో రౌల్ జూలియా తర్వాత మరణానంతరం ఎమ్మీ దక్కించుకున్న నటుడు రాబ్ రైనర్ మాత్రమే కావడం విశేషం.
దాదాపు 48 ఏళ్ల తర్వాత రాబ్ రైనర్ నటనకు ఎమ్మీ అవార్డ్ లభించింది. ఈ అవార్డును ప్రకటిస్తున్న సమయంలో సభలోని ప్రతినిధులు నిలబడి కరతాళ ధ్వనులతో నివాళులర్పించారు. ఆయన తరఫున నటి వెండి మెక్క్లెండన్ ఈ అవార్డును స్వీకరించారు.
మారుపేరుతో కొత్త రూపంలో ఎమ్మీలు
ఇన్నాళ్లూ 'క్రియేటివ్ ఆర్ట్స్ ఎమ్మీస్' పేరుతో నిర్వహించే సాంకేతిక అవార్డుల కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచి నేరుగా 78వ ఎమ్మీ అవార్డుల తొలి ఘట్టంగానే పరిగణిస్తున్నారు. సాంకేతిక విభాగాలతో పాటు గతంలో ప్రధాన వేడుకలో ఇచ్చే కొన్ని సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలను కూడా ఈ మొదటి రెండు రోజుల కార్యక్రమంలోనే ప్రదానం చేశారు.

జియో హాట్స్టార్ ఓటీటీలో
లాస్ ఏంజిల్స్లోని పీకాక్ థియేటర్ వేదికగా జరుగుతున్న ఈ సంబరాల ప్రధాన వేడుక సెప్టెంబర్ 14న ఘనంగా జరగనుంది. మరిస్కా హార్గిటే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ ప్రధాన కార్యక్రమాన్ని ఇండియాలో 'జియో హాట్స్టార్' (JioHotstar) ద్వారా ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


