Urvashi Rautela: ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా ముందు మోకరిల్లినట్లు ఫొటో- ఊర్వశి రౌటెలా ఆగ్రహం- విషం చిమ్మడమేనంటూ!

Urvashi Rautela On Aishwarya Rai Priyanka Chopra Comparison Photo: ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా ముందు అలియా భట్, కత్రినా కైఫ్, కరీనా కపూర్‌తోపాటు ఊర్వశి రౌటెలా మోకరిల్లునట్లుగా ఏఐ ఫొటోను సృష్టించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఊర్వశి తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. ఈ ఫొటో వైరల్ అవుతోంది.

Published on: May 28, 2026, 06:10:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Urvashi Rautela On Aishwarya Rai Priyanka Chopra Comparison Photo: ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ తారలు తమ గ్లామర్‌తో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది కేన్స్ 2026 రెడ్ కార్పెట్‌పై బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా తన విభిన్నమైన, ఖరీదైన గౌన్లతో అందరి దృష్టిని ఆకర్షించారు.

ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా ముందు మోకరిల్లినట్లు ఫొటో- ఊర్వశి రౌటెలా ఆగ్రహం- విషం చిమ్మడమేనంటూ!
ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా ముందు మోకరిల్లినట్లు ఫొటో- ఊర్వశి రౌటెలా ఆగ్రహం- విషం చిమ్మడమేనంటూ!

హీరోయిన్ల మధ్య జరుగుతున్న పోలిక

ముఖ్యంగా యోలాండ్ అఫీషియల్ డిజైన్ చేసిన బ్లాక్ వెల్వెట్ గౌనులో ఊర్వశి దేవకన్యలా మెరిసిపోయారు. అయితే ఒకవైపు కేన్స్ వేడుకల్లో ప్రశంసలు అందుకుంటున్న తరుణంలోనే, సోషల్ మీడియాలో హీరోయిన్ల మధ్య జరుగుతున్న ఒక పోలికపై ఊర్వశి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెటిజన్ల ఏఐ క్రియేటివిటీ.. వివాదానికి కారణం ఇదే!

సమస్య అంతా ఒక అభిమాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించిన ఫొటోతో మొదలైంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ల గ్లోబల్ స్టార్‌డమ్‌ను లెక్కిస్తూ ఒకరు ఈ వింత పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్ అగ్రస్థానంలో నిలబడగా, ప్రియాంక చోప్రా మధ్యలో సింహాసనంపై కూర్చుని ఉన్నారు.

ఆమెకు ఇరువైపులా దీపికా పదుకొణె, మాధురీ దీక్షిత్ నిల్చున్నారు. ఇక నేటితరం స్టార్ హీరోయిన్లు అలియా భట్, కత్రినా కైఫ్, కరీనా కపూర్లతో పాటు ఊర్వశి రౌటెలా కింద మోకాళ్లపై కూర్చున్నట్లుగా చూపిస్తూ వారి పేర్లను ట్యాగ్ చేశారు. అంటే, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాల ముందు ఊర్వశి రౌటెలాతోపాటు అలియా, కత్రినా, కరీనా మోకరిల్లినట్లు ఆ ఫొటో ఉంది.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్

ఈ పోస్టర్ నెట్టింట తీవ్ర చర్చకు దారితీయడంతో ఊర్వశి రౌటెలా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇండస్ట్రీలోని మహిళా నటీమణుల మధ్య నిరంతరం పోలికలు తీసుకురావడాన్ని ఆమె తప్పుబట్టారు.

"ప్రతి నటికి తనదైన సొంత ప్రయాణం, కృషి, గమ్యం ఉంటాయని నేను బలంగా నమ్ముతాను. ఇలా మహిళలను పోల్చడం లేదా ఫ్యాన్ వార్స్ సృష్టించడం వల్ల సమాజంలో కేవలం నెగెటివిటీ మాత్రమే పెరుగుతుంది. దానికి బదులు ప్రతి ఒక్కరి ప్రతిభను, వారి ఎదుగుదలను, మంచితనాన్ని అభినందిద్దాం. దయచేసి ఈ విషం చిమ్మడం ఆపండి" అని ఊర్వశి రౌటెలా తన ఆవేదనను పంచుకున్నారు.

కేన్స్ వేదికపై దేశం కోసం ఎమోషనల్ స్పీచ్

ఇదెలా ఉండగా, ఈ ఏడాది కేన్స్ వేడుకల్లో ఊర్వశి వియత్నాంకు చెందిన ప్రసిద్ధ డిజైనర్ లేబుల్ 'జోలిపోలి కోట్యూర్' డిజైన్ చేసిన అద్భుతమైన లావెండర్ కలర్ నెట్ గౌనులో రెడ్ కార్పెట్‌పై నడిచారు. అక్కడ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కాస్త భావోద్వేగానికి గురయ్యారు.

"నేను అంతర్జాతీయ వేదికలపై నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు నా పేరు ఊర్వశి కాదు, నేను భారతదేశాన్ని.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ప్రారంభోత్సవంలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకెంతో గర్వంగా ఉంది" అని ఊర్వశి రౌటెలా పేర్కొన్నారు. వరుసగా ఐదో ఏడాది కూడా కేన్స్ వేదికపై అడుగుపెట్టే అవకాశం రావడం తనకెంతో ప్రత్యేకమని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

కేన్స్ వేదికపై ఇతర భారతీయ భామలు

భారతదేశం నుంచి కేన్స్ వేడుకలకు వెళ్లిన తారల్లో ఐశ్వర్య రాయ్ అందరికంటే సీనియర్. గత రెండు దశాబ్దాలుగా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఐశ్వర్య ఈ రెడ్ కార్పెట్‌పై మెరుస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆమె తన లుక్స్‌తో ఆకట్టుకోగా, మరో హీరోయిన్ అలియా భట్ రెండోసారి బ్రాండ్ అంబాసిడర్‌గా ఇక్కడ సందడి చేశారు.

ఊర్వశి రౌటెలా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
ఊర్వశి రౌటెలా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

గతంలో ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దీపికా పదుకోణె, 2022లో కేన్స్ ప్రధాన జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించి మన దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More