Anurag Dobhal: 10 కోట్ల బైకులని అమ్మేసుకున్న యూట్యూబర్- డ్రీమ్ బైక్స్ గ్యారేజ్ ఖాళీ- మళ్లీ జీరో నుంచి అనురాగ్ జీవితం
YouTuber Anurag Dobhal Sold 10 Crore Bike Collection: యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ 2 ఫేమ్ అనురాగ్ దొభాల్ (UK07 రైడర్) తన ప్రాణంగా చూసుకునే రూ.10 కోట్ల విలువైన లగ్జరీ బైకుల కలెక్షన్ను అమ్మేయాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం రెండు బైక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
YouTuber Anurag Dobhal Sold 10 Crore Bike Collection: యూట్యూబ్ ప్రపంచంలో కోట్లాది మంది ఫాలోవర్లు, గ్యారేజ్ నిండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖరీదైన బైకులతో ఒక వెలుగు వెలిగిన 'UK07 రైడర్' అలియాస్ యూట్యూబర్ అనురాగ్ దొభాల్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది.

బిగ్ బాస్ ఓటీటీ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ సెలబ్రిటీ, ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి రావడంతో తన డ్రీమ్ బైకుల సామ్రాజ్యాన్ని అమ్మేసినట్లు అనురాగ్ దోభాల్ స్వయంగా వెల్లడించారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బైక్ రైడింగ్ వ్లాగ్స్ చూసే యువతకు అనురాగ్ దొభాల్ పరిచయం ఉన్న పేరే.
కన్నీరు పెట్టించిన ఖాళీ గ్యారేజ్
తన తాజా వ్లాగ్లో అనురాగ్ దోభాల్ ఈ హృదయ విదారక విషయాలను పంచుకున్నారు. తను ఎంతో ఇష్టపడి 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించుకున్న డ్రీమ్ గ్యారేజ్కు వెళ్లి, అక్కడ ఖాళీగా ఉన్న స్థలాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు.
"మేము ఎంతో కష్టపడి నిర్మించిన సామ్రాజ్యం ఈ రోజు పూర్తిగా ఖాళీ అయిపోయింది. నిత్యం ఆర్థిక ఇబ్బందులు వెంటాడటంతో గతేడాదే చాలా బైకులను అమ్మేశాం. ఇప్పుడు కేవలం రెండు బైకులు మాత్రమే మిగిలాయి" అని యూట్యూబర్ అనురాగ్ దోభాల్ తెలిపారు.
"ఆ కఠిన పరిస్థితుల నుంచి నేను ఎలా బయటపడ్డానో నా మనస్సాక్షికే తెలుసు. ఒక్కో బైక్ అమ్ముతుంటే నా గుండె తరుక్కుపోయింది. మానసికంగా అస్వస్థతకు గురికావడం వల్ల ఈ విషయాలను అప్పట్లో వ్లాగ్స్ ద్వారా పంచుకోలేకపోయాను" అని అనురాగ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ గ్యారేజ్ ఉన్న స్థలం తన పేరు మీద లేకపోవడంతో కరెంట్ కూడా కట్ చేశారని, చివరకు దాన్ని ఖాళీ చేయాల్సి వచ్చిందని చెప్పారు.
యాక్సిడెంట్ గాయాల నుంచి కోలుకుంటూ..
ఈ ఏడాది మార్చి నెలలో అనురాగ్ జీవితంలో పెద్ద తుఫాను రేగింది. ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో ఉంటూనే కారును వేగంగా నడిపి ఘోర ప్రమాదానికి గురయ్యారు అనురాగ్. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం తన వద్ద రెండు బైకులు ఉన్నప్పటికీ, కాళ్లలో ఇంకా బలం రాకపోవడంతో వాటి బరువును మోస్తూ కనీసం నడపలేకపోతున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం డెహ్రాడూన్ వదిలి సొంతంగా ఉండేందుకు మరో చోట ఇల్లు వెతుక్కుంటున్నట్లు తెలిపారు. తన మర్చండైజ్ బిజినెస్ను మళ్లీ ప్రారంభించాలనుకున్నా కుదరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కులాంతర వివాహం.. కుటుంబంతో గొడవలు
అనురాగ్ దొభాల్ ఈ స్థాయికి పడిపోవడానికి వెనుక పెద్ద కుటుంబ కలహాలు ఉన్నాయి. రితిక అనే యువతిని కులాంతర వివాహం చేసుకోవడం ఆయన ఇంట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. తన తల్లిదండ్రులు, సోదరుడు తనను తీవ్రంగా మానసిక వేధింపులకు గురిచేశారని గతంలో అనురాగ్ ఆరోపించారు.
ఆ తీవ్రమైన డిప్రెషన్ లోనే ఆయన కారు ప్రమాదం రూపంలో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఒక దశలో భార్య కూడా వదిలేసిందని ప్రచారం జరిగినా, ఆసుపత్రిలో ఆమె దగ్గరుండి సేవలు చేసింది. మార్చి 27న వీరికి ఒక బాబు జన్మించాడు.
జీరో నుంచి జీవితం
"నా బిడ్డ కోసమే ఇది నా రెండో జన్మ" అని అనురాగ్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. లగ్జరీ బైకుల ప్రపంచాన్ని ఏలిన ఈ రైడర్, ఇప్పుడు తన భార్య, బిడ్డ కోసం మళ్లీ జీరో నుంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. అనురాగ్ దొభాల్ ఎవరు, ఆయనకు ఎందుకు అంత క్రేజ్ ఉంది?
అనురాగ్ దొభాల్ 'UK07 రైడర్' పేరుతో యూట్యూబ్లో లగ్జరీ బైక్ వ్లాగ్స్ చేస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన 'బిగ్ బాస్ ఓటీటీ 2' రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు.
2. అనురాగ్ తన రూ.10 కోట్ల బైకుల కలెక్షన్ను ఎందుకు అమ్మేశారు?
గత కొంతకాలంగా అనురాగ్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, రోజువారీ డబ్బు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అత్యవసరంగా డబ్బు అవసరం అవ్వడంతో ఆయన తన డ్రీమ్ గ్యారేజ్ లోని బైకులను అమ్మేయాల్సి వచ్చింది.
3. మార్చి 2026లో అనురాగ్ దొభాల్కు ఏమైంది?
కుటుంబ సమస్యలు, మానసిక వేధింపుల కారణంగా తీవ్ర డిప్రెషన్కు గురైన అనురాగ్, ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో కారు ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలపాలైన ఆయన ప్రస్తుతం ఆ గాయాల నుంచి కోలుకుంటున్నారు.
4. అనురాగ్ దొభాల్ భార్య ఎవరు?
అనురాగ్ భార్య పేరు రితిక. వీరిది అంతర్ మత వివాహం. ఈ ఏడాది మార్చి 27న ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


