PM Modi : 76ఏళ్ల వయస్సులోనూ సూపర్ ఫిట్- ప్రధాని మోదీ సింపుల్ డైట్ ప్లాన్ ఇదే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోగ్య రహస్యాలు, ఆహార అలవాట్లు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఎటువంటి ఆడంబరాలు లేని దేశీ ఆహారం, మునగాకు పరోటాలు, కఠినమైన ఉపవాసాలతో ఆయన తన ఫిట్నెస్ను ఎలా కాపాడుకుంటున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సెప్టెంబర్ 17న 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. 70 ఏళ్లు దాటినా రోజుకు 16-18 గంటల పాటు అలసట లేకుండా పనిచేసే ఆయన నిరంతర శక్తికి కారణం ఏంటని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. యోగా, వ్యాయామంతో పాటు ఆయన పాటించే నిరాడంబరమైన ఆహార అలవాట్లే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతుంటారు. పెద్ద పెద్ద డైట్ చార్టులు, విదేశీ సప్లిమెంట్లు లేకుండా మన ఇంట్లో వండుకునే సాదాసీదా భారతీయ భోజనమే ఆయన ఆరోగ్య రక్షణ కవచం. ఈ నేపథ్యంలో 76ఏళ్ల వయస్సులోనూ మోదీ సూపర్ ఫిట్గా ఉండటానికి కారణమైన డైట్ వివరాలను ఇక్కడ తెలుసుకోడి..

మునగాకు పరోటా.. వారంలో రెండుసార్లు!
మోదీ రోజువారి ఆహారంలో అత్యంత ఆసక్తికరమైనది 'మునగాకు పరోటా' (Moringa Paratha). 2020లో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్తో జరిగిన 'ఫిట్ ఇండియా' సంభాషణలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పంచుకున్నారు. వారంలో ఒకటి రెండు సార్లు మునగాకుతో చేసిన పరోటాలను కచ్చితంగా తింటానని వెల్లడించారు.
తెలుగు ఇళ్లలో తరచూ వాడే మునగాకులో విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
ఇక చిన్నప్పటి నుంచి తన తల్లి రోజూ పసుపు తీసుకుంటున్నావా అని అడిగేవారని గుర్తుచేసుకున్న మోదీ.. ఇప్పటికీ పసుపు, నెయ్యి, పప్పు-అన్నం వంటి సాంప్రదాయ పదార్థాలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
ప్రాసెస్డ్ ఫుడ్కు దూరం.. మన ఇంటి వంటకే ప్రాధాన్యం
ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్ను పూర్తిగా పక్కనబెట్టి, ఫ్రెష్గా ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మోదీ ప్రాథమిక సూత్రం. అటుకులు (పోహా), ఉప్మా, రొట్టెలు, కూరగాయలు, ప్రాంతీయ వంటకాలను ఆయన ఇష్టపడతారు. ఫ్యాషనబుల్ డైట్లను పక్కనబెట్టి, శతాబ్దాలుగా మన భారతీయులు తింటున్న పప్పు, అన్నం, నెయ్యి వంటి సహజమైన వంటకాలనే ఆయన ఎంచుకుంటారు.
దశాబ్దాల ఉపవాస దీక్ష.. చతుర్మాసం నుంచి నవరాత్రుల వరకు
ఆహారం తీసుకోవడంలోనే కాదు, ఉపవాసాలు ఆచరించడంలోనూ మోదీ అత్యంత కఠినమైన నియమాలు పాటిస్తారు. దాదాపు 50 నుంచి 55 ఏళ్లుగా ఆయన ఈ ఉపవాస పద్ధతులను అనుసరిస్తున్నారు.
చతుర్మాస ఉపవాసం: జూన్ మధ్య నుంచి దీపావళి వరకు సాగే చతుర్మాస కాలంలో ఆయన రోజుకు ఒకసారి మాత్రమే (24 గంటలకు ఒకపూటే) భోజనం చేస్తారు.
శరన్నవరాత్రులు (సెప్టెంబర్/అక్టోబర్): తొమ్మిది రోజుల పాటు ఆహారం అస్సలు తీసుకోనని, కేవలం గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగుతూ కఠినమైన నిరాహార దీక్ష చేస్తానని మోదీ గతంలో చెప్పారు.
చైత్ర నవరాత్రులు: ఈ తొమ్మిది రోజులు రోజుకు ఒకే రకమైన పండును ఒక్కసారి మాత్రమే తింటారు. ఉదాహరణకు బొప్పాయి ఎంచుకుంటే, తొమ్మిది రోజులు కేవలం రోజుకోసారి బొప్పాయి మాత్రమే తింటారు.
వేడి నీళ్లే మోదీ నిత్య ఔషధం!
మోదీ దినచర్యలో ఎప్పుడూ మారని ముఖ్యమైన అలవాటు ‘వేడి నీళ్లు’. యవ్వనంలో ఉన్నప్పటి నుంచే ఆయన నిరంతరం గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకున్నారు. నవరాత్రుల కఠిన ఉపవాస సమయంలో కూడా ఈ గోరువెచ్చని నీళ్లే ఆయనకు ప్రధాన ఆధారంగా నిలుస్తాయి. శరీరంలో వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఈ అలవాటు ఎంతో దోహదపడుతుంది.
ఆడంబరమైన లైఫ్స్టైల్ కాకుండా ప్రాచీన భారతీయ డైట్, జీవన విధానాన్ని పాటించడమే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్నెస్ వెనుక ఉన్న అసలు రహస్యం!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


