Real estate : పెరుగుతున్న ఆందోళన- ఇల్లు కొనాలంటేనే భయపడుతున్న ఐటీ నిపుణులు! ధరలు పడతాయా?
Real estate : బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో ప్రస్తుతం ఒక రకమైన అప్రమత్తత కనపడుతోంది. 21-23 మధ్య కాలంలో ఇళ్ల కొనుగోలులో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు తగ్గింది. లేఆఫ్స్ భయం, ఏఐ కారణంగా ఉద్యోగాల్లో వస్తున్న మార్పులు, పెరుగుతున్న ఈఎంఐల నేపథ్యంలో టెక్కీలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడుతున్నారు.
బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొనుగోలుదారుల ధోరణి మారుతోంది. గత రెండు మూడేళ్లుగా సాగిన కొనుగోళ్ల జోరు తర్వాత, ఇప్పుడు టెక్ ఉద్యోగులు తమ నిర్ణయాలను పునరాలోచించుకుంటున్నారు. ఉద్యోగాల కోత, ఏఐ-ఆధారిత పునర్నిర్మాణం, స్థిరంగా ఉన్న ఇళ్ల ధరలు, పెరుగుతున్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు భారీ రుణాలు తీసుకోవడానికి దూరంగా ఉంటుండగా, మరికొందరు అద్దె కంటే స్వల్పంగా మాత్రమే ఎక్కువగా ఉండే రూ. 75-85 లక్షల విలువైన ఇళ్లను ఎంచుకుంటున్నారు. లగ్జరీ హంగుల కంటే ఆర్థిక స్తోమతకే వారు పెద్దపీట వేస్తున్నారు.

ఐటీ ఉద్యోగి ఆవేదన..
ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక ఐటీ నిపుణుడు రెడ్డిట్లో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన రూ. 2.5 కోట్ల విలువైన ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్, ఇంటీరియర్స్ అన్నీ కలిపి ఆ మొత్తం రూ. 3 కోట్లకు చేరుతుందని అంచనా. దీనికోసం రూ. 2 కోట్ల హోమ్ లోన్ తీసుకోవాలని ఆయన భావించారు.
"అయితే, బుకింగ్ చేసుకున్న వెంటనే నాలో ఆందోళన మొదలైంది. ఒకవేళ నేనో లేదా నా భార్యనో ఉద్యోగం కోల్పోతే పరిస్థితి ఏంటి? నెలకు అంత పెద్ద మొత్తంలో ఈఎంఐలు ఎలా చెల్లించాలి?" అని ఆయన తన భయాన్ని వ్యక్తం చేశారు. కనీసం 6 నుంచి 12 నెలల ఖర్చులకు సరిపడా సేవింగ్స్ ఉన్నప్పటికీ, లేఆఫ్స్ వంటి అత్యంత దారుణమైన పరిస్థితులను ఊహించుకొని ఆయన ఆ బుకింగ్ను రద్దు చేసుకున్నారు.
"సొంత ఇంటి కంటే ఇప్పుడు అద్దె ఇంట్లోనే ప్రశాంతంగా ఉంది," అని ఆయన ముగించారు.
మరికొందరి అనుభవాలు..
మరో టెక్కీ మాట్లాడుతూ, బెంగళూరులో తనకున్న ఒకటి రెండు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీల నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వార్షిక ఆదాయం తక్కువైనా పర్వాలేదు కానీ, రిస్క్ తగ్గించుకోవడమే తన లక్ష్యమని చెప్పారు. కోవిడ్ సమయంలో అవసరానికి మించి సిబ్బందిని తీసుకోవడం, గ్లోబల్ మార్జిన్లు తగ్గడం, ఏఐ కారణంగా వస్తున్న మార్పుల వల్ల ఐటీ రంగం ప్రస్తుతం "అనిశ్చితి జోన్"లో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు, ఒక కొనుగోలుదారు భారీ పెట్టుబడి నుంచి వెనక్కి తగ్గి, రూ. 75-85 లక్షల విలువైన చిన్న ఇంటిని ఎంచుకున్నారు. "నాకు పెద్ద పెద్ద సదుపాయాలు అక్కర్లేదు. అద్దె కంటే కేవలం రూ. 10,000 అదనంగా ఈఎంఐ కడితే చాలు, అది నా ఆర్థిక స్థితికి భారం కాదు," అని ఆయన వివరించారు.
ధరల హెచ్చుతగ్గులు, నిపుణుల హెచ్చరిక..
2021-23 మధ్య కాలంలో బెంగళూరులో ధరలు విపరీతంగా పెరగడంతో, ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ధరల వృద్ధి నెమ్మదించింది. 2028 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టుల కోసం ఇప్పుడే ఈఎంఐలు కట్టడం ఎంతవరకు సమంజసమని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు.
"కేవలం వస్తుందో రాదో అన్న భయంతో (ఫోమో) అప్పుల ఊబిలో కూరుకుపోవద్దు," అని రెడ్డిట్ యూజర్లు హెచ్చరిస్తున్నారు. 20 ఏళ్ల ఈఎంఐ భారాన్ని మోయాలంటే జీతాలు, ఉద్యోగాలు స్థిరంగా ఉండాలి, కానీ గత 2-3 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు ఐటీ ఉద్యోగాల్లో ఆ నమ్మకం తగ్గింది.
ఏఐ, లేఆఫ్స్ ప్రభావం ఎంత?
రియల్ ఎస్టేట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, బెంగళూరు మార్కెట్ పూర్తిగా ఐటీ రంగంపై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది కాలంగా కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఆటోమేషన్, ఏఐ ప్రభావం వల్ల నియామకాల్లో కూడా మార్పులు వస్తున్నాయి.
వెస్ట్రియన్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం, బెంగళూరులో మొత్తం ఆఫీస్ లీజింగ్లో ఐటీ రంగం వాటా 40 శాతంగా ఉంది. అంటే, గ్లోబల్ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగితే అది కచ్చితంగా ఇళ్ల అమ్మకాలపై, అద్దెలపై ప్రభావం చూపుతుంది.
అయితే, ఆసెట్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ పరీక్ మాత్రం మార్కెట్ కుప్పకూలదు అని అభిప్రాయపడ్డారు. 2014-20 మధ్య కాలంలో ధరల పెరుగుదల కేవలం 3-3.5% మాత్రమే ఉందని, ఆ తర్వాత పెరిగిన ధరలు కేవలం సర్దుబాటు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మార్కెట్ స్థిరమైన, నిలకడైన వృద్ధిని చూస్తుందని ఆయన అంచనా వేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


