ISRO scientists : 100 మందికిపైగా శాస్త్రవేత్తల రాజీనామా! ఎందుకు? ఇస్రోలో అసలేం జరుగుతోంది?
ISRO scientist resignation : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో తప్పుకుంటున్నారు. గత కొన్ని నెలల్లోనే 100 మందికి పైగా రాజీనామా లేదా ముందస్తు పదవీ విరమణ చేశారు. దీనికి కారణాలేంటి? ఇస్రోలో అసలేం జరుగుతోంది?
భారత అంతరిక్ష రంగం సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న వేళ, ఇస్రో ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతిక లోపాలో, ప్రయోగాల వైఫల్యాలో కాదు.. దశాబ్దాల అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు సంస్థను వీడిపోతుండటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. గత కొన్ని నెలల వ్యవధిలోనే 100 మందికి పైగా నిపుణులైన శాస్త్రవేత్తలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడం అంతరిక్ష వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఈ సామూహిక నిష్క్రమణలను అడ్డుకునేందుకు కేంద్ర అంతరిక్ష శాఖ (డీఓఎస్) నేరుగా రంగంలోకి దిగింది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్యాన్' వంటి కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలను ఇకపై సాధారణ పద్ధతిలో ఆమోదించకూడదని స్పష్టం చేస్తూ జులై 14న అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దేశ అంతరిక్ష ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో, శాస్త్రవేత్తలు ఇస్రోను వీడి వెళ్లడానికి అసలు కారణాలు ఏంటనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వీడుతున్నారు?
అంతరిక్ష నిపుణులు, ఇస్రో సీనియర్ అధికారుల విశ్లేషణల ప్రకారం.. దీని వెనుక ప్రధానంగా ప్రైవేట్ అంతరిక్ష రంగం పుంజుకోవడం, సంస్థాగత జాప్యం, పెద్ద ప్రాజెక్టులపై నెలకొన్న అనిశ్చితి వంటి బలమైన కారణాలు ఉన్నాయి.
ప్రైవేట్ స్టార్టప్ల జోరు: 2020లో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరిచినప్పటి నుంచి భారత్లో ఒక సరికొత్త విప్లవం వచ్చింది. స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, ధ్రువ స్పేస్ వంటి ప్రైవేట్ స్టార్టప్లు రాకెట్లు, శాటిలైట్లను అత్యంత వేగంగా తయారు చేస్తున్నాయి.
భారీ ప్యాకేజీలు - మెరుగైన అవకాశాలు: ప్రభుత్వ నిబంధనలతో నడిచే ఇస్రోతో పోలిస్తే, ఈ ప్రైవేట్ కంపెనీలు శాస్త్రవేత్తలకు భారీ జీతాలు, స్టాక్ ఆప్షన్స్ ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాకుండా, కెరీర్ ప్రారంభంలోనే లీడర్షిప్ రోల్స్ దక్కడం, సరికొత్త ఆలోచనలను వేగంగా అమలు చేసే స్వేచ్ఛ ఉండటంతో యువ శాస్త్రవేత్తలు అటువైపు ఆకర్షితులవుతున్నారు.
సీనియర్ల అండ: ఇస్రో నుంచి పదవీ విరమణ చేసిన పలువురు మాజీ సీనియర్ అధికారులు ఇప్పుడు ఈ స్టార్టప్లను స్థాపించడం లేదా వాటికి మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ అనుభవం, ప్రైవేట్ పెట్టుబడులు తోడవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు బయట అద్భుతమైన కెరీర్ ఆప్షన్లు లభిస్తున్నాయి.
ప్రయోగాల్లో జాప్యం.. కేంద్రీకృత నిర్ణయాలు!
కేవలం ప్రైవేట్ కంపెనీల ఆకర్షణ మాత్రమే కాదు, ఇస్రో అంతర్గత వాతావరణం కూడా ఇందుకు ఒక కారణమని తెలుస్తోంది. గగన్యాన్ జీ1 టెస్ట్ ఫ్లైట్, ఎస్ఎస్ఎల్వీ-ఎల్1, జీఎస్ఎల్వీ-ఎఫ్17 వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలు అనుకున్న సమయానికి జరగకుండా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఎదురైన ఎదురుదెబ్బల వల్ల లాంచ్ యాక్టివిటీస్ మరింత మందగించాయి.
దీనికి తోడు ఇస్రోలో నిర్ణయాధికారాలన్నీ కేవలం చైర్మన్ కార్యాలయం చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న సాంకేతిక లేదా పరిపాలనాపరమైన అనుమతులకు కూడా ఎక్కువ సమయం పడుతుండటంతో క్షేత్రస్థాయిలో పని చేసే అధికారుల పనితీరుపై ప్రభావం పడుతోందని కొందరు అధికారులు అంతర్గత సంభాషణల్లో వ్యక్తంచేశారు.
నాసా మోడల్ వైపు అడుగులు పడాలా?
అమెరికాకు చెందిన నాసా లేదా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంటి అంతర్జాతీయ సంస్థల తరహాలో ఇస్రో కూడా తన ఎంప్లాయ్మెంట్ మోడల్ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నాసాలో పర్మనెంట్ ఉద్యోగులతో పాటు ప్రాజెక్ట్ ఆధారిత కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు. దీనివల్ల సంస్థపై భారం తగ్గడమే కాకుండా, అవసరమైన నిపుణులను సమర్థవంతంగా వాడుకునే వీలుంటుంది. ప్రైవేట్ రంగం ఇంతలా విస్తరిస్తున్న వేళ, ఇస్రో ఇకపై కేవలం మిషన్ డిజైన్, హ్యూమన్ స్పేస్ఫ్లైట్, పునర్వినియోగ రాకెట్లు వంటి అత్యంత అధునాతన రీసెర్చ్లపైనే దృష్టి పెట్టాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నష్టం ఎక్కడంటే..
ఇస్రోలో మొత్తం 14,600 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో 100 మంది వెళ్లిపోవడం సంఖ్యాపరంగా చిన్నదే కావచ్చు, కానీ వెళ్లిన వారంతా చంద్రయాన్-3, గగన్యాన్, స్పేస్డెక్స్ వంటి కీలక మిషన్లలో ఏళ్ల తరబడి అనుభవం గడించిన గ్రూప్ 'ఏ' స్థాయి సీనియర్ శాస్త్రవేత్తలు కావడమే ఇస్రోను ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తగా కాలేజీల నుంచి వచ్చే గ్రాడ్యుయేట్లతో ఈ అనుభవాన్ని భర్తీ చేయడం అసాధ్యం.
ఇప్పటివరకు అంతరిక్ష రంగం అనగానే కేవలం ఇస్రో మాత్రమే ఏకైక దిక్కుగా ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది, పోటీ పెరిగింది. దేశానికి గర్వకారణమైన ఇస్రోకు ఇప్పుడు ప్రతిభావంతులను ఆకర్షించడం మాత్రమే కాదు, ఉన్నవారిని కాపాడుకోవడం కూడా అతిపెద్ద సవాలుగా నిలిచింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


