...
...
Next Story

PM Modi birthday : ప్రధాని మోదీ 76వ పుట్టిన రోజు- గుజరాత్ సీఎం నుంచి గ్లోబల్ లీడర్ వరకు..

నేడు ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన పాతికేళ్లు పూర్తి చేసుకున్నారు. భయంకరమైన భూకంప సంక్షోభం నుంచి ప్రారంభమైన ఆయన పాలనా ప్రయాణం.. దేశ ప్రధానిగా భారత్‌ను గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చే వరకు ఎలా సాగిందో తెలిపే ప్రత్యేక కథనం..

Published on: Sep 17, 2026, 09:07:07 IST
Advertisement

2001 జనవరి 26.. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో పెను భూకంపం సంభవించింది. క్షణాల్లో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న 51 ఏళ్ల నరేంద్ర మోదీ సహాయక, పునరావాస చర్యల్లో మునిగిపోయారు. సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత, బీజేపీ అధిష్ఠానం నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ ఆయన జీవితాన్ని, భారత రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ( PMO)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ( PMO)

అదే ఏడాది అక్టోబర్ 7న తన ట్రేడ్‌మార్క్ హాఫ్ హాండ్స్ కుర్తా వేసుకుని గుజరాత్ 14వ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణస్వీకారం చేశారు. నాటి గవర్నర్ సురేంద్ర సింగ్ భండారీ ఆయనతో ప్రమాణం చేయించారు. సీనియర్ నేత కేశుభాయ్ పటేల్ స్థానంలో ఆయన ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నారు. భారత రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలకు చేరిన ఆయన ప్రయాణం ఆ రోజే మొదలైంది. వచ్చే అక్టోబర్ 7 నాటికి ఆయన ప్రజాసేవలో పాతికేళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఇందులో ఇప్పటికే 4,495 రోజుల పాటు ప్రధానిగా నిరంతరాయంగా సేవలు అందిస్తూ ఆయన సరికొత్త మైలురాయిని చేరుకున్నారు.

అడ్మినిస్ట్రేటర్‌గా తొలి అడుగులు..

సంస్థాగత నైపుణ్యాలు, ఎలాంటి బాధ్యతనైనా భుజాన వేసుకోగల సమర్థుడిగా పార్టీలో మోదీకి మొదటి నుంచి మంచి పేరుంది. కానీ, సీఎంగా ఆయన ముందు సవాళ్లు చాలా ఉండేవి. భూకంపం వల్ల ప్రజల్లో తీవ్ర ఆవేదన, అప్పటి ప్రభుత్వ నిర్వహణ వైఫల్యాలపై ఆగ్రహం ఎక్కువగా ఉండేది. రాష్ట్రం కరువుతో అల్లాడిపోయింది. కనీస వసతులు లేక జనం అగచాట్లు పడ్డారు. ఆ సమయంలో కుప్పకూలిన నగరాలు, గ్రామాలను పునర్నిర్మించడం మోదీ ముందున్న అతిపెద్ద లక్ష్యం.

పరిపాలనా అనుభవం లేకపోయినా, సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో మోదీ సఫలమయ్యారు. అట్టడుగు వర్గాల కష్టాలు తెలిసిన వ్యక్తి కావడంతో పేదల జీవితాలను మార్చే విధానాలకు రూపకల్పన చేశారు. సమాజంలో చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందాలన్న ఆర్ఎస్ఎస్ 'అంత్యోదయ' స్ఫూర్తే ఆయన సామాజిక సంక్షేమ పథకాలకు పునాది.

"సీఎంగా ప్రమాణం చేశాక మా అమ్మ నాకు రెండు విషయాలు చెప్పింది. ఒకటి.. ఎప్పుడూ పేదల కోసం పనిచేయాలి. రెండు.. ఎప్పుడూ లంచం తీసుకోకూడదు," అని తన తల్లి చెప్పిన మాటలను ప్రధాని మోదీ 2025లో ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తాను ఏ పని చేసినా అట్టడుగు వర్గాలకు సేవ చేయాలనే దృక్పథంతోనే చేస్తానని ఆయన పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.

దేశాన్ని ఆకర్షించిన 'గుజరాత్ మోడల్'!

సీఎంగా మోదీ ఎన్నో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టారు. ఎండిపోయిన భూములకు నీళ్లు తీసుకురావడం, హైవేల నిర్మాణం, కొత్త పరిశ్రమల స్థాపనతో సుప్రసిద్ధ 'గుజరాత్ మోడల్'ను ఆవిష్కరించారు. 1995 నుంచి 2001 వరకు యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పార్టీ కోసం పనిచేసిన అనుభవం ఆయనకు ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి సాయపడింది.

"ఆ క్షేత్రస్థాయి అనుభవమే ప్రధాని అయ్యాక ఆయనకు ఉపయోగపడింది. మౌలిక వసతులు, పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి కలగలిపిన గుజరాత్ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేశారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం పరుగులుపెట్టాయి. ఫలితంగా బీజేపీ అనేక రాష్ట్రాల్లో పాగా వేస్తూ దేశంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగింది," అని ఓ సీనియర్ బీజేపీ నేత విశ్లేషించారు.

సైద్ధాంతిక లక్ష్యాల సాధన.. విశ్వ వేదికపై భారత్

అభివృద్ధి అజెండాతో పాటే, పార్టీ సైద్ధాంతిక లక్ష్యాలైన అయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు లాంటి దశాబ్దాల కలలు మోదీ హయాంలోనే సాకారమయ్యాయి. విపక్షాలను ఎదుర్కోవడంలో, మారుతున్న కాలానికి తగ్గట్టు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. వాతావరణ మార్పులపై ప్రత్యేక విభాగాన్ని, ఫోరెన్సిక్ యూనివర్సిటీని గుజరాత్‌లో ఎప్పుడో స్థాపించారు. నేటి జెన్-జీ యువతతో మమేకం అయ్యేందుకు కొత్త డిజిటల్ కమ్యూనికేషన్ పద్ధతులను వాడుతున్నారు. ప్రపంచ దేశాల అధినేతలతో సత్సంబంధాలు నెరపుతూ, అంతర్జాతీయ వేదికలపై భారత్ స్థానాన్ని సుస్థిరం చేశారు.

మున్ముందు ఉన్న సవాళ్లు..

వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీకి ఇప్పుడు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. లోక్‌సభలో సొంతంగా మెజారిటీ లేకపోవడంతో టీడీపీ, జేడీయూ, శివసేన లాంటి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు పరీక్ష పత్రాల లీకేజీలు, యువతలో నిరుద్యోగం లాంటి సమస్యలు ప్రభుత్వం ముందున్నాయి. ఉక్రెయిన్, పశ్చిమాసియా యుద్ధాలు, అమెరికా వాణిజ్య విధానాల వల్ల అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయాలు క్లిష్టంగా మారాయి.

అయినప్పటికీ, దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడిగా మోదీయే ముందున్నారు. హరియాణా, మహారాష్ట్ర, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో పార్టీ అనూహ్య విజయాలు సాధించడంలో ఆయన చరిష్మానే ప్రధాన కారణం. వచ్చే ఏడాది జరగనున్న యూపీ లాంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్‌సభ సమరానికి కూడా మోదీయే కేంద్ర బిందువుగా వ్యవహరించనున్నారని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks