...
...
Next Story

'జాతికి గర్వకారణం'- ప్రపంచకప్​ గెలిచిన భారత మహిళల జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం..

2025 వన్డే ప్రపంచకప్​ గెలిచిన భారత మహిళల జట్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. జాతికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

Published on: Nov 3, 2025, 05:55:47 IST
Advertisement

2025 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన 'అద్భుత విజయాన్ని' ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ప్రపంచకప్​ గెలిచిన భారత మహిళల జట్టు.. (Surjeet Yadav)
ప్రపంచకప్​ గెలిచిన భారత మహిళల జట్టు.. (Surjeet Yadav)

"ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్‌లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఫైనల్‌లో వారి ప్రదర్శన గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసంతో కూడుకున్నది. టోర్నమెంట్ అంతటా జట్టు అసాధారణమైన సమన్వయాన్ని, పట్టుదలను కనబరిచింది. మన క్రీడాకారులకు అభినందనలు. ఈ చారిత్రక విజయం భవిష్యత్తులో ఛాంపియన్లుగా ఎదగాలనుకునే యువతకు క్రీడలను స్వీకరించడానికి ప్రేరణనిస్తుంది," అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు..

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. ఈ చారిత్రక విజయాన్ని దక్కించుకోవడంలో వారు చూపిన ధైర్యం, నైపుణ్యం, పట్టుదలను ఆయన కొనియాడారు.

“ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియాకు అభినందనలు! ఎంత గొప్ప ధైర్యం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. మీరు కేవలం ట్రోఫీని గెలవడమే కాదు, దేశవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్నారు. ప్రతి భారతీయుడు మిమ్మల్ని చూసి గర్విస్తున్నాడు! సారే జహాసే అచ్ఛా హిందుస్తాన్ హుమారా! భారత క్రికెట్‌కు, క్రీడల్లో మహిళలకు ఇదొక సువర్ణ ఘట్టం!” అని ఓం బిర్లా పేర్కొన్నారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్..

ముఖ్యమంత్రి 'ఎక్స్' వేదికగా జట్టు విజయాన్ని ప్రశంసిస్తూ, వారి గెలుపు మొత్తం దేశానికి గర్వకారణమని అన్నారు. "చారిత్రక విజయం! ప్రపంచ ఛాంపియన్ భారత మహిళా క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు! దేశ ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు! మీరంతా దేశానికి గర్వకారణం. భారత్ మాతా కీ జై!" అని ఆదిత్యనాథ్ హిందీలో రాశారు.

తొలిసారిగా మహిళల ప్రపంచకప్ టైటిల్..

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్, టీమ్​ చరిత్రలో మొదటి ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 78 బంతుల్లో 87 పరుగులతో కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడింది. ఆమె దూకుడైన ఆటతోనే భారత్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది పడింది. మిడిల్ ఆర్డర్ క్రీడాకారుల స్థిరమైన భాగస్వామ్యాలు స్కోరు బోర్డును ముందుకు నడిపించాయి.

299 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ 98 బంతుల్లో 101 పరుగులతో అద్భుతంగా పోరాడింది. అయితే, ఆమె అవుటైన తర్వాత మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మళ్లింది. చివరకు ప్రొటీస్ జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ అద్భుతంగా రాణించి 39 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి ఈ చారిత్రక విజయాన్ని ఖాయం చేసింది.

గతంలో 2005, 2017లో రన్నరప్‌గా నిలిచిన భారత్.. మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. ఈ విజయంతో దశాబ్దాల నిరీక్షణకు తెరపడి, దేశం తొలి టైటిల్‌ను అందుకుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe