SBI Youth for India Fellowship : యువతకు గోల్డెన్ ఛాన్స్! ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ గడువు పెంపు..

యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ గడువును స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఎక్స్​టెండ్​ చేసింది. గ్రామీణ భారతంలో సేవలు అందించాలని భావించే యువతకు, నిరుద్యోగులకు ఇది చక్కటి అవకాశం. ఈ నేపథ్యంలో ఈ ఎస్బీఐ ఫెలోషిప్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 10, 2026, 05:43:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సామాజిక సేవా విభాగమైన 'ఎస్బీఐ ఫౌండేషన్' ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2026' దరఖాస్తు గడువును పొడిగించారు. గ్రామీణ భారతంలో మార్పు కోసం పని చేయాలని భావిస్తున్న యువతకు ఇదొక అద్భుత అవకాశం.

ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ వివిరాలు.. (File)
ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ వివిరాలు.. (File)

ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుకు అవకాశం..

దేశాభివృద్ధిలో యువతను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ఫెలోషిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 30, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం భారతీయ పౌరులే కాకుండా, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), నేపాల్, భూటాన్ పౌరులు కూడా ఈ కార్యక్రమానికి అర్హులు. ఎస్బీఐలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఇందులో ప్రత్యేక అవకాశం కల్పించారు.

ఏంటీ ఈ ఫెలోషిప్? ఎందుకు చేరాలి?

ఈ ఫెలోషిప్ కేవలం ఒక శిక్షణ కార్యక్రమం మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చే ఒక గొప్ప వేదిక. ఎంచుకున్న అభ్యర్థులు 13 నెలల పాటు క్షేత్రస్థాయిలో ఉండి గ్రామీణ ప్రజలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. కేవలం సేవా దృక్పథం మాత్రమే కాకుండా, ఒక నాయకుడిగా ఎదిగేందుకు, సామాజిక సమస్యలపై లోతైన అవగాహన పెంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది.

"చారిటీ (దానం) చేయడం కంటే, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు వెతకడమే మా లక్ష్యం. వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా మార్పును కోరుకునే యువతను మేము ప్రోత్సహిస్తున్నాం," అని ఎస్బీఐ ఫౌండేషన్ ఎండీ అండ్ సీఈఓ స్వపన్ ధర్ పేర్కొన్నారు.

12 కీలక రంగాల్లో పని చేసే అవకాశం..

ఈ 13 నెలల కాలంలో అభ్యర్థులు తమకు నచ్చిన రంగంలో ప్రాజెక్టులు చేపట్టవచ్చు. ప్రధానంగా:

విద్య, ఆరోగ్యం, గ్రామీణ జీవనోపాధి.

మహిళా సాధికారత, స్వయం పాలన.

పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన నీరు.

సాంకేతికత, ఆహార భద్రత, సాంప్రదాయ కళలు.

సామాజిక వ్యవస్థాపకత.

అర్హతలు, ఇతర వివరాలు..

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎస్‌బీఐ ఉద్యోగులకు: బ్యాంకులో స్కేల్-1 లేదా స్కేల్-2 స్థాయిలో కన్ఫర్మ్డ్ ఆఫీసర్లుగా ఉండాలి.

ఉజ్వల భవిష్యత్తుకు బాట..

గత గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఫెలోషిప్ పూర్తి చేసిన వారిలో దాదాపు 70 శాతం మంది సామాజిక రంగంలోనే స్థిరపడ్డారు. నీతి ఆయోగ్, యూఎన్ ఉమెన్, ఐఎల్ఓ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం వీరికి దక్కుతోంది. ఇప్పటివరకు ఈ ఫెలోస్ దాదాపు 50కి పైగా సామాజిక స్టార్టప్‌లను ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

దేశం కోసం ఏదైనా చేయాలనే తపన, గ్రామీణ సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం కావాలనే ఆసక్తి ఉన్న యువతకు ఈ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ఒక సరైన వేదిక. ఏప్రిల్ 30 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని మీ ప్రయాణాన్ని ప్రారంభించండి.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కాలపరిమితి ఎంత?

ఈ ఫెలోషిప్ మొత్తం 13 నెలల పాటు కొనసాగుతుంది. ఇందులో శిక్షణతో పాటు క్షేత్రస్థాయిలో పని చేయడం కూడా ఉంటుంది.

2. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని ఏప్రిల్ 30, 2026 వరకు పొడిగించారు.

3. ఈ ఫెలోషిప్ వల్ల కెరీర్ పరంగా వచ్చే ప్రయోజనాలేంటి?

ఇది పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు పబ్లిక్ పాలసీ, గ్రామీణాభివృద్ధి, సామాజిక వ్యవస్థాపకత వంటి రంగాల్లో స్థిరపడవచ్చు. ప్రధానంగా సామాజిక సేవా రంగంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టే నైపుణ్యం లభిస్తుంది.

4. ఎస్బీఐ ఉద్యోగులు దీనికి అర్హులేనా?

అవును, ఎస్బీఐలో స్కేల్-1 లేదా స్కేల్-2 అధికారుల హోదాలో ఉన్నవారు కూడా ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More