Tata Motors : కస్టమర్స్కి షాకిచ్చిన టాటా మోటార్స్! వాహనాల ధరల పెంపు..
Tata Motors price hike : పెరుగుతున్న ముడిసరుకు ఖర్చుల నేపథ్యంలో టాటా మోటార్స్ తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1, 2026 నుంచి ప్యాసింజర్ కార్లతో పాటు కమర్షియల్ వాహనాల ధరలు కూడా పెరగనున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనదారులకు మాత్రం కంపెనీ ఊరటనిచ్చింది.
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరల సవరణ ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ పెంపు కేవలం ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) అంటే పెట్రోల్, డీజిల్ మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) ఈ ధరల పెంపు నుంచి కంపెనీ మినహాయించింది.

కార్ల ధరలు ఎంత పెరుగుతాయి?
ప్యాసింజర్ కార్ల ధరలు సగటున 0.5 శాతం మేర పెరుగుతాయని కంపెనీ తెలిపింది. ఏ మోడల్ లేదా వేరియంట్పై ఎంత ధర పెరుగుతుందనే పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. పెరుగుతున్న ఇన్పుట్ కాస్ట్ (తయారీ ఖర్చుల) భారాన్ని కొంతమేర తగ్గించుకోవడానికే ఈ ధరల పెంపును చేపట్టినట్లు కంపెనీ వివరించింది.
టాటా పంచ్, టాటా ఆల్ట్రోజ్, టాటా టియాగో, టాటా టిగోర్, టాటా సియెర్రా, టాటా నెక్సాన్, టాటా సఫారీ, టాటా హారియర్ వంటి మోడల్స్ ప్రస్తుతం టాటా మోటార్స్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి.
కేవలం టాటా మోటార్స్ మాత్రమే కాకుండా, మెర్సిడెస్-బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్ల సంస్థలు కూడా అదే తేదీ నుంచి ధరల పెంపును ఇప్పటికే ధృవీకరించాయి.
కమర్షియల్ వాహనాలపై ధరల భారం..
మరోవైపు, టాటా మోటార్స్ తన కమర్షియల్ వాహనాల (సీవీ) శ్రేణిపై కూడా ఏప్రిల్ 1 నుంచి గరిష్టంగా 1.5 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటనలో తెలిపింది. కమొడిటీ ధరలు, పెరిగిన ఇన్పుట్ ఖర్చులను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వాహన మోడల్, వేరియంట్ను బట్టి ఈ ధరల సవరణ మారుతూ ఉంటుంది.
ధరల పెంపు నిర్ణయం తీసుకున్నప్పటికీ, టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల వ్యాపారం అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. పటిష్టమైన ఆర్థిక పనితీరు, అమ్మకాల పరంగా సంస్థ దూసుకుపోతోంది.
అమ్మకాల్లో జోరు.. రికార్డు వృద్ధి
2026 ప్రారంభంలో టాటా మోటార్స్ అటు దేశీయంగా, ఇటు అంతర్జాతీయంగా బలమైన అమ్మకాలను నమోదు చేసింది.
జనవరి గణాంకాలు: జనవరిలో దేశీయ కమర్షియల్ వాహనాల అమ్మకాలు 38,844 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 29.1 శాతం వృద్ధి. మొత్తం విక్రయాలు 41,549 యూనిట్లకు చేరుకున్నాయి. హెవీ కమర్షియల్ వెహికల్ విభాగంలో 41.2 శాతం వృద్ధి కనిపించగా, అంతర్జాతీయ మార్కెట్లలో 42 శాతం వృద్ధి (2,705 యూనిట్లు) నమోదైంది.
ఫిబ్రవరి గణాంకాలు: ఫిబ్రవరిలోనూ అదే ఊపు కొనసాగింది. మొత్తం కమర్షియల్ వాహనాల అమ్మకాలు 32 శాతం పెరిగి 42,940 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ విక్రయాలు 32.8 శాతం వృద్ధితో 40,893 యూనిట్లుగా ఉండగా, అంతర్జాతీయ వ్యాపారం 17.9 శాతం వృద్ధిని నమోదు చేసింది.
5,000 బస్సుల భారీ ఆర్డర్..
ఆర్థికంగా పటిష్టంగా ఉండటంతో పాటు టాటా మోటార్స్ ఇటీవల భారీ కాంట్రాక్టులను కూడా దక్కించుకుంటోంది. భారతదేశంలోని వివిధ రాష్ట్ర రవాణా సంస్థల నుంచి 5,000 కంటే ఎక్కువ బస్సులు, బస్సు ఛాసిస్ల కోసం ఆర్డర్లు పొందింది. ఈ జాబితాలో తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, రాజస్థాన్, కేరళ, హరియాణా రాష్ట్రాలతో పాటు నార్త్ వెస్ట్రన్ కర్ణాటక, చండీగఢ్ రవాణా సంస్థలు ఉన్నాయి.
ఈ ఆర్డర్లలో భాగంగా మాగ్నా, సిటీరైడ్, స్టార్బస్, స్టార్బస్ ప్రైమ్ వంటి వివిధ రకాల ప్యాసింజర్ మొబిలిటీ వాహనాలను సరఫరా చేయనున్నారు. ఇవి నగరాల మధ్య, నగరాల లోపల, సుదీర్ఘ ప్రయాణాల కోసం అందుబాటులోకి వస్తాయి. ఇవి మెరుగైన విశ్వసనీయత, ప్రయాణికుల సౌకర్యం, సమర్థవంతమైన నిర్వహణ వ్యయాన్ని అందిస్తాయి.
పెరుగుతున్న డిమాండ్, మెరుగైన ఆర్థిక ఫలితాలు, పెరుగుతున్న ఆర్డర్ బుక్తో, ధరల సవరణ జరిగినప్పటికీ టాటా మోటార్స్ తన వృద్ధి బాటను కొనసాగించే అవకాశం ఉంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరుగుతాయా?
లేదు, టాటా మోటార్స్ స్పష్టంగా ప్రకటించిన ప్రకారం ఈ ధరల పెంపు కేవలం పెట్రోల్, డీజిల్ (ఐసీఈ) మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలలో ఎలాంటి మార్పు ఉండదు, కాబట్టి ఈవీలు కొనాలనుకునే వారికి ఇది ఊరటనిచ్చే విషయమే.
2. ఈ ధరల పెంపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఎంత భారం పడుతుంది?
ఈ ధరల సవరణ ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. ప్యాసింజర్ కార్లపై సగటున 0.5% మేర, మరియు కమర్షియల్ వాహనాలపై (ట్రక్కులు, బస్సులు వంటివి) 1.5% వరకు ధరలు పెరగనున్నాయి. మోడల్, వేరియంట్ను బట్టి ఈ పెంపు మారుతూ ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


