...
...
Next Story

Visa layoffs : వీసా లేఆఫ్స్.. 2600 మందిపై వేటు​! కోట్లల్లో జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా ఔట్..

Visa layoffs 2026 : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణతో పేమెంట్స్ దిగ్గజం 'వీసా' దాదాపు 2,600 మంది ఉద్యోగులను తొలగించింది. సీనియర్ డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు కూడా ఈ వేటుకు గురయ్యారు. భారత్‌లోని టెక్ హబ్‌పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది?

Published on: Aug 5, 2026, 16:58:51 IST
Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తెస్తున్న మార్పులు ఐటీ, కార్పొరేట్ రంగాలను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. కేవలం జూనియర్, మిడ్-లెవెల్ ఉద్యోగులే కాకుండా, ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఇప్పుడు ఏఐ విప్లవం ధాటికి ఉద్యోగాలు కోల్పోతున్నారు. గ్లోబల్ పేమెంట్స్ దిగ్గజం 'వీసా' తాజాగా చేపట్టిన పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఏకంగా 2,600 మంది సిబ్బందిపై లేఆఫ్ వేటు వేసింది. జులై 29న వేకువజామునే పలువురు సీనియర్ ఉద్యోగులకు హ్యూమన్ రిసోర్స్ (హెచ్​ఆర) విభాగం నుంచి తొలగింపు ఈ-మెయిళ్లు రావడం కంపెనీలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

2వేలకుపైగా మంది ఉద్యోగాలపై వీసా వేటు.. (REUTERS)
2వేలకుపైగా మంది ఉద్యోగాలపై వీసా వేటు.. (REUTERS)

కంపెనీ వ్యూహాత్మక మార్పులు, ఏఐ సాంకేతికతకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.

సీనియర్ లీడర్‌షిప్‌కూ తప్పని లేఆఫ్స్!

క్యాలిఫోర్నియాలోని ఫోస్టర్ సిటీలోని వీసా గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌లో సేకరించిన 'వార్న్' నోటీసు సమాచారం ప్రకారం.. ఈ ఉద్యోగాల కోత ఏ ఒక్క విభాగానికి మాత్రమే పరిమితం కాలేదు. కంపెనీలోని వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ డైరెక్టర్లు, టెక్నికల్ నిపుణులు కూడా బాధితుల జాబితాలో ఉన్నారు.

జులై 31న దాఖలైన అధికారిక సమాచారం ప్రకారం, క్యాలిఫోర్నియా కార్యాలయం నుంచే 320 మంది సిబ్బందిని తొలగించారు. వీరిలో ఆరుగురు వైస్ ప్రెసిడెంట్లు, 37 మంది సీనియర్ డైరెక్టర్లు, 16 మంది చీఫ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్ట్ హోదాలో ఉన్న ఉన్నతాధికారులు ఉన్నారు. వీరితో పాటు పలువురు సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, రీసెర్చర్లు, అనుభవజ్ఞులైన టెక్నికల్ నిపుణులకు వీసా గేట్ పాస్ ఇచ్చింది. అంటే, ఈసారి లేఆఫ్‌లు కేవలం సాధారణ సిబ్బందినే కాకుండా, నాయకత్వ హోదాలో ఉన్నవారిని, సాంకేతిక బృందాలను సమంగా ప్రభావితం చేశాయి.

గత మూడు నెలల కిందటి వరకు ఫోస్టర్ సిటీ ఆఫీసులో వైస్ ప్రెసిడెంట్ హోదా ఉద్యోగాలకు సంవత్సరానికి 2,35,700 డాలర్ల నుంచి 4,58,000 డాలర్ల వరకు (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.2.24 కోట్ల నుంచి రూ.4.36 కోట్లు) భారీ వేతనాలు ఆఫర్ చేసినట్లు ఎస్‌ఎఫ్‌గేట్ కథనం వెల్లడించింది. అంతటి భారీ జీతాలు తీసుకునే స్థానాలను కూడా ఏఐ కారణంగా కంపెనీ తొలగించడం గమనార్హం.

సమర్థతను, పనితీరును పెంచుకోవడానికే ఈ తొలగింపులు అని వీసా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రియాన్ మెక్‌ఇనర్నీ ఉద్యోగ బృందానికి వివరించారు. జులై 28న జరిగిన ఎర్నింగ్స్ కాల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ రాకతో కార్యాలయాల్లో పనిచేసే విధానం రూపురేఖలే మారిపోతున్నాయని చెప్పారు.

"కంపెనీ భవిష్యత్తు వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, మా టెక్నాలజీ, ప్రాడక్ట్ విభాగాల్లో ప్రాధాన్యతలను మారుస్తున్నాం. ఇందులో భాగంగానే పలు ఉద్యోగ పాత్రలను తొలగించాల్సి వచ్చింది. ప్రసుతం మనం 'ఏజెంటిక్ ఏఐ' యుగంలోకి అడుగుపెడుతున్నాం. ఇకపై ఏఐ కేవలం మనుషులకు సహాయకారిగా ఉండటమే కాకుండా.. మన పర్యవేక్షణలోనే సంక్లిష్టమైన పనులను, ప్రాసెస్లను స్వయంచాలకంగా పూర్తి చేసే స్థాయికి ఎదిగింది," అని రియాన్ మెక్‌ఇనర్నీ అన్నారు.

ఏంటీ ఈ 'ఏజెంటిక్ కామర్స్'?

వినియోగదారుల తరఫున ఏఐ ఏజెంట్లే నేరుగా ఆన్‌లైన్ రీసెర్చ్ చేయడం, ధరలను పోల్చి చూడడం, వ్యాపారులతో బేరసారాలు ఆడడం, కొనుగోళ్లు పూర్తి చేయడం వంటి పనులను స్వయంచాలకంగా పూర్తి చేసే విధానాన్నే ‘ఏజెంటిక్ కామర్స్’ గా పేర్కొంది వీసా. ఈ కొత్త సాంకేతికత కంపెనీ మార్కెట్‌ను విస్తరించి, భవిష్యత్తులో ఆదాయ మార్గాలను పెంచుతుందని వీసా ధీమా వ్యక్తం చేసింది.

భారతదేశంలోని టెక్ హబ్‌పై ప్రభావం ఎంత?

అమెరికా వెలుపల వీసాకు ఉన్న అతిపెద్ద టెక్నాలజీ హబ్ భారతదేశమే! అయితే, తాజాగా ప్రకటించిన లేఆఫ్‌లలో ఎంతమంది భారతీయ ఉద్యోగులు బాధితులుగా ఉన్నారనే విషయాన్ని కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు.

2025 ఆర్థిక సంవత్సరంలో వీసా గ్లోబల్ సిబ్బంది సంఖ్య 8 శాతం పెరిగి మొత్తం 34,100కి చేరింది. భారతదేశంలో తమ వద్ద 3,500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారని కంపెనీ 2024లో వెల్లడించింది.

భారతీయ టెక్ విభాగంలో ఈ మార్పులు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe