...
...
Next Story

Petrol diesel prices : కొంప ముంచిన అమెరికా.. దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు మళ్లీ పెరుగుతాయా?

అమెరికా తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం భారతదేశ ఇంధన సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఉన్న ‘ఆంక్షల మినహాయింపు గడువు’ను పొడిగించడానికి ట్రంప్ ప్రభుత్వం నిరాకరించింది. ఈ వార్త నేపథ్యంలో దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు మళ్లీ పెరుగుతాయా? అన్న భయాలు మొదలయ్యాయి.

Published on: May 18, 2026, 10:50:09 IST
Advertisement

India Russia oil : గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తాండవిస్తున్నప్పటికీ.. వాషింగ్టన్ ఇచ్చిన చిన్న మినహాయింపు ద్వారా భారతదేశం ఎలాగోలా నెట్టుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆ కిటికీ కాస్తా శాశ్వతంగా మూతబడటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం (మే 17) నాటితో రష్యా సముద్ర ముడి చమురుపై ఉన్న ఆంక్షల మినహాయింపు గడువును ముగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగితంపై ఇది కేవలం ఒక సాంకేతిక నిర్ణయంలా కనిపించవచ్చు, కానీ ముడి చమురు కోసం ఇరత దేశాలపై ఆధారపడే భారత్ లాంటి దేశాలకు ఇది పెను ఇంధన భారంగా మారనుంది. ఈ వార్తల మధ్య దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు మళ్లీ పెరుగుతాయా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

టైమింగ్ చాలా ఘోరం..

పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగుతాయా? (Hindustan Times)
పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగుతాయా? (Hindustan Times)

అమెరికా ఈ నిర్ణయం తీసుకున్న సమయం భారతదేశానికి అత్యంత ప్రతికూలంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం ‘స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్’ ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా పూర్తిగా అస్తవ్యస్తమైంది. చమురు ట్యాంకర్ల కదలికలు మందగించాయి, ఇన్సూరెన్స్ ఖర్చులు అమాంతం పెరిగాయి. యుద్ధానికి ముందు బ్యారెల్‌కు 72 డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ ముడి చమురు ధరలు.. ప్రస్తుతం 110 డాలర్ల మార్కును దాటి దూసుకుపోతున్నాయి. ఇటు మిడిల్ ఈస్ట్ నుంచి చమురు సరఫరా నమ్మకంగా లేదు.. అటు తక్కువ ధరకు వచ్చే రష్యా చమురుపై మళ్లీ ఆంక్షల భయం మొదలైంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 3 పెరిగిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

రష్యా చమురుపై భారత్ ఎంతగా ఆధారపడింది?

గత రెండేళ్లుగా రష్యా నుంచి లభించిన రాయితీ (డిస్కౌంట్) ముడి చమురు భారతదేశానికి ద్రవ్యోల్బణం పెరగకుండా ఒక పెద్ద రక్షణ కవచంలా నిలిచింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాను దూరం పెడితే.. భారత్ మాత్రం భారీగా రష్యా ఆయిల్ కొనుగోళ్లను పెంచింది. ఎందుకంటే ఆ ధరలు భారత్‌కు ఎంతో లాభదాయకంగా ఉన్నాయి. కాలక్రమేణా రష్యా.. భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది.

కేప్లర్ డేటా ప్రకారం.. మే నెలలో రష్యా నుంచి భారత్ చేసిన చమురు దిగుమతులు రోజుకు రికార్డు స్థాయిలో 23 లక్షల బారెళ్లకు చేరాయి. భారత్ మొత్తం దిగుమతుల్లో సగం రష్యా చమురుదే కావడం విశేషం. ఇప్పుడు ఆంక్షల భయంతో రష్యా నుంచి కొనుగోళ్లు ఆపేస్తే.. భారత్ మళ్లీ అస్థిరంగా ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాల వైపే చూడాల్సి వస్తుంది.

ప్రభుత్వం ముందున్న ఆప్షన్లు ఏంటి?

తన చమురు అవసరాలలో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడే భారతదేశంపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ముడి చమురు ధరలు పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ ధరలు, విమాన ప్రయాణ ఛార్జీలు, రవాణా ఖర్చులు, నిత్యావసరాల ధరలు అన్నీ ఒకేసారి పెరుగుతాయి.

ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు మూడు మార్గాలు ఉన్నాయి:

పన్నులు తగ్గించడం లేదా సబ్సిడీలు ఇవ్వడం: దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడుతుంది.

ప్రభుత్వ చమురు సంస్థలను నష్టాలు భరించమనడం: ఇప్పటికే ఈ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి, మరింత ఒత్తిడి చేస్తే వాటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది.

పెట్రోల్​, డీజిల్ ధరలను మళ్లీ పెంచడం: ఇది రాజకీయంగా, ప్రజల పరంగా ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే.. గతంలో చమురు సంక్షోభాలు వచ్చినప్పుడు తీసుకున్నట్లుగా.. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం, ఆఫీసు టైమింగ్స్ మార్చడం, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం వంటి కఠిన నిర్ణయాలను ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చినా ఆశ్చర్యం లేదని ఎనర్జీ ఎకనామిస్టులు చెబుతున్నారు.

పరిశ్రమలపై ప్రభావం - నిపుణుల మాట..

ఇంధన ధరల పెరుగుదల ప్రభావంపై పెట్రోస్ స్టోన్ ఎల్‌ఎల్‌పీ ఇంటర్నేషనల్ బిజినెస్ డైరెక్టర్ రిషభ్ జైన్ మాట్లాడుతూ.. "లీటరుకు రూ. 3 కంటే ఎక్కువ పెరిగిన ఇంధన ధరల వల్ల దేశీయ లాజిస్టిక్స్, అంతర్జాతీయ ఫ్రైట్ (రవాణా) ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం ఎగుమతిదారులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ఈ రవాణా భారాల ముందు అది చాలా తక్కువ. ప్రస్తుతం పరిశ్రమలు మనుగడ కోసం పోరాడుతున్నాయి. అనేక రకాల తయారీ సంస్థలు ప్రొడక్షన్‌ను నెమ్మదింపజేసి, పాత స్టాక్‌ను క్లియర్ చేయడం ద్వారా వర్కింగ్ క్యాపిటల్‌ను మేనేజ్ చేసుకుంటున్నాయి. పోటీని తట్టుకోలేని చిన్న సంస్థలు మూతపడే పరిస్థితి వస్తోంది," అని విశ్లేషించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe