Chaitra Amavasya: రేపే చైత్ర అమావాస్య.. ఆ సమయంలో ఈ తప్పులు చేశారో కష్టాలు తప్పవు! పుణ్యకాలం, పరిహారాలివే..
హిందూ సంప్రదాయంలో చైత్ర మాసానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ నెలలో వచ్చే అమావాస్య పితృ దేవతల ఆశీస్సులు పొందడానికి, దానధర్మాలు చేయడానికి అత్యంత ప్రశస్తమైనది. ఈ ఏడాది చైత్ర అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆ రోజు పొరపాటున కూడా చేయకూడని పనులేంటో తెలుసుకుందాం.
చైత్ర అమావాస్య విశిష్టత: తెలుగు కాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి నెల. ఈ మాసంలో చేసే స్నాన, దానాలకు మంచి ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం ఆచరించి, పితృ దేవతలకు తర్పణాలు వదలడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు.

అమావాస్య తిథి, ముహూర్తం వివరాలు
ఈ ఏడాది చైత్ర అమావాస్య ఏప్రిల్ 17న వచ్చింది. అయితే తిథి విషయానికొస్తే.. ఏప్రిల్ 16వ తేదీ రాత్రి 8 గంటల 11 నిమిషాలకు అమావాస్య ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల 21 నిమిషాలకు అమావాస్య పూర్తవుతుంది. పుణ్యస్నానాలు, దానధర్మాలు చేసేవారు ఏప్రిల్ 17వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం లోపు పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా అభిజిత్ ముహూర్తంలో (ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:32 వరకు) ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది.
పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
అమావాస్య రోజున ప్రతికూల శక్తులు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని తప్పులు చేస్తే పుణ్యం మాట దేవుడెరుగు.. లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది.
కోపతాపాలకు దూరం: ఈ రోజు అనవసరంగా ఎవరిపై కోప్పడకూడదు. ఇంట్లో పెద్దలతో కానీ, బయట వ్యక్తులతో కానీ గొడవలకు దిగడం వల్ల ఇంట్లోని ప్రశాంతత దెబ్బతింటుంది.
మనసు నొప్పించొద్దు: ఎదుటివారిని హేళన చేయడం లేదా మనసు నొప్పించేలా మాట్లాడటం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి.
పరిశుభ్రత ముఖ్యం: అమావాస్య నాడు ఇల్లు, ఒళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. బద్ధకాన్ని వీడి ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించాలి.
నిరాశ్రయులను వెనక్కి పంపకండి: ఇంటి ముందుకు ఎవరైనా ఆకలితో వస్తే, ఏమీ ఇవ్వకుండా పంపడం మహా పాపంగా భావిస్తారు. వీలైనంతలో తోచిన సహాయం చేయాలి.
అదృష్టాన్ని తెచ్చే చిన్న పరిహారం
ఈ అమావాస్య నాడు పితృ దోషాల నుంచి విముక్తి పొందడానికి ఒక చిన్న పరిహారం పాటించవచ్చు. అమావాస్య రోజు సాయంత్రం వేళ ఇంటి సమీపంలోని రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత మీ పితృ దేవతలను మనసులో తలచుకుని, వారి ఆశీస్సులు కోరుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి, ఐశ్వర్యం కలుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


