మనీ ప్లాంట్ పెంచుతున్నారా? ఈ 5 తప్పులు చేస్తే ఐశ్వర్యం కాస్తా దరిద్రంగా మారుతుంది జాగ్రత్త!
వాస్తు చిట్కాలు: మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే సిరి సంపదలు వెల్లివిరుస్తాయని అందరి నమ్మకం. అయితే, వాస్తు నియమాలు పాటించకుండా ఈ మొక్కను పెంచితే ఆర్థిక కష్టాలు, మానసిక ఒత్తిడి తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనీ ప్లాంట్ విషయంలో అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవి.
చాలా మంది ఇళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడానికి మనీ ప్లాంట్ను పెంచుతుంటారు. హిందూ ధర్మశాస్త్రం, వాస్తు ప్రకారం ఈ మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే దీనికి 'మనీ ప్లాంట్' అనే పేరు వచ్చింది. అయితే, కొందరి ఇళ్లలో ఈ మొక్క ఉన్నా కూడా ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు వేధిస్తూనే ఉంటాయి. దీనికి ప్రధాన కారణం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. వాస్తు దోషం ఏర్పడితే అది ప్రతికూల శక్తిని (Negative Energy) పెంచుతుంది. మనీ ప్లాంట్ విషయంలో అస్సలు చేయకూడని ఆ 5 తప్పులేంటో ఇప్పుడు చూద్దాం.

మనీ ప్లాంట్ విషయంలో అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవి
1. ఈశాన్య దిశలో అస్సలు పెట్టకండి
వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశ (North-East) అత్యంత పవిత్రమైనది, దీనిని దేవతల దిశగా పరిగణిస్తారు. కానీ, మనీ ప్లాంట్ను ఈ దిశలో ఉంచడం అశుభమని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఇంట్లో ప్రతికూలత పెరిగి, డబ్బు రాక ఆగిపోతుంది. మనీ ప్లాంట్ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో (South-East) ఉంచాలి. ఈ దిశకు అధిపతి గణపతి, గ్రహం శుక్రుడు. ఇక్కడ మొక్కను ఉంచితేనే సానుకూల శక్తి, ఐశ్వర్యం సిద్ధిస్తాయి.
2. తీగలు నేలను తాకకూడదు
మనీ ప్లాంట్ తీగలు ఎంత పైకి పాకితే, మీ ఆర్థిక స్థితి కూడా అంతలా ఎదుగుతుందని అర్థం. చాలా ఇళ్లలో మొక్క తీగలు కింద నేలకు అంటుకుపోతుంటాయి. ఇది తీవ్రమైన వాస్తు దోషం. తీగలు కిందకు ఉంటే అది ఆర్థిక పతనానికి, వ్యాపారంలో నష్టాలకు సంకేతం. అందుకే ఎప్పుడూ ఒక కర్ర లేదా తాడు సహాయంతో తీగలు పైకి వెళ్లేలా జాగ్రత్త పడాలి.
3. ఎండిన ఆకులను వెంటనే తొలగించాలి
మొక్కలోని ఆకులు పసుపు రంగులోకి మారినా లేదా ఎండిపోయినా వాటిని వెంటనే కత్తిరించాలి. ఎండిన ఆకులు ఇంట్లోకి దురదృష్టాన్ని మోసుకొస్తాయి. ఇది కేవలం వాస్తు మాత్రమే కాదు, మొక్క ఆరోగ్యం దృష్ట్యా కూడా మంచిది కాదు. ఎండిన భాగాలను తొలగిస్తేనే కొత్త చిగుళ్లు వచ్చి మొక్క కళకళలాడుతుంది. మొక్క ఎంత పచ్చగా ఉంటే, మీ ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటుంది.
4. ప్లాస్టిక్ డబ్బాలు వద్దు
ఈ రోజుల్లో చాలా మంది ప్లాస్టిక్ డబ్బాల్లో మనీ ప్లాంట్ను పెంచుతున్నారు. ప్లాస్టిక్ అనేది ప్రకృతి విరుద్ధమైనది కాబట్టి అది సానుకూల శక్తిని గ్రహించలేదు. మనీ ప్లాంట్ను మట్టి కుండీలో లేదా నీలిరంగు గాజు సీసాలో పెంచడం అత్యంత ఉత్తమం. నీలిరంగు శాంతికి, సంపదకు చిహ్నం. ఇది మొక్కలోని శక్తిని సమతుల్యం చేస్తుంది. మురికిగా ఉన్న కంటైనర్లలో మొక్కను పెంచడం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
5. మీ ఇంటి మొక్కను వేరే వారికి ఇవ్వకండి
చాలా మంది తమ ఇంట్లోని మనీ ప్లాంట్ కొమ్మను ఇరుగుపొరుగు వారికి లేదా స్నేహితులకు ఇస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది పెద్ద తప్పు. మీ ఇంటి సంపదను, అదృష్టాన్ని వేరే వారికి ఇవ్వకండి. ఒకవేళ ఎవరైనా అడిగితే కొత్త మొక్కను కొని ఇవ్వండి కానీ, మీ ఇంట్లో పెరుగుతున్న మొక్కను మాత్రం తుంచి ఇవ్వకండి. మనీ ప్లాంట్ ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులు రావాలంటే ఈ చిన్నపాటి వాస్తు జాగ్రత్తలు పాటించండి. సరిగ్గా సంరక్షిస్తే ఈ మొక్క మీ ఇంట్లో సిరిసంపదల పంట పండిస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


