డబ్బు కాదు.. జీవితాన్ని కాపాడేది ఈ 4 మిత్రులే: చాణక్య నీతి
ఆచార్య చాణక్యుడి ప్రకారం, జీవితంలో ప్రతి పరిస్థితిలో మనకు అండగా నిలిచే నలుగురు నిజమైన మిత్రులు ఉంటారు. ప్రయాణాల్లో జ్ఞానం, కుటుంబ జీవితంలో జీవిత భాగస్వామి, అనారోగ్య సమయంలో ఔషధం, మరణం తర్వాత కూడా మన పేరు నిలబెట్టేది ధర్మం.
మనం చేసే ప్రతి మంచి చెడుకూ తగిన ఫలితాన్ని అనుభవించాల్సిందే. జీవిత ప్రయాణంలో మనిషి ఎడుగుతున్న కొద్దీ ఎంతోమంది పరిచయం అవుతారు. అనేకమందిని మిత్రులుగా చేసుకుంటాం. కానీ అందరూ ఆఖరి వరకు తోడుగా ఉంటారనే గ్యారెంటీ లేదు. ప్రాణం పోయే సమయమైనా సరే వెన్నంటి ఉండే నిజమైన స్నేహితులు కొందరే ఉంటారని ఆచార్య చాణక్యుడు స్పష్టం చేశారు. జీవితంలోని క్లిష్ట పరిస్థితుల్లోనూ మనిషికి అసలైన రక్షణగా నిలిచే ఆ నాలుగు ముఖ్యమైన మిత్రుల గురించి చాణక్య నీతిలో వివరంగా చెప్పబడింది.

మానవ జీవితంలో ఎదురయ్యే రకరకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆచార్య చాణక్యుడు అందించిన ఈ మార్గదర్శకాలు నేటి ఆధునిక కాలానికి కూడా వంద శాతం సరిగ్గా సరిపోతాయి. మనిషి ప్రయాణించే తీరును బట్టి, ఎదుర్కొనే సమస్యలను బట్టి అసలైన బలం ఏమిటో ఈ సూత్రాలు వివరిస్తాయి.
ప్రయాణంలో జ్ఞానమే నిజమైన నేస్తం
చాణక్యుడు జీవిత సత్యాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. మనం స్వస్థలం వదిలి దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు లేదా విదేశ ప్రయాణాలు చేసినప్పుడు మన వెంట ఎవరుంటారు? అక్కడి పరిస్థితులు తెలియక ఇబ్బంది పడే సమయంలో మన దగ్గర ఉన్న విజ్ఞానమే మనకు కొండంత అండగా నిలుస్తుంది.
ఏకాంతంగా ఉన్నప్పుడు లేదా అనుకోని ప్రమాదాలు ముంచుకొచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని జ్ఞానం ఇస్తుంది. విదేశాల్లో లేదా కొత్త ప్రదేశాల్లో మనల్ని సురక్షితంగా ఉంచే మొదటి మిత్రుడు విద్యా విజ్ఞానమే.
భార్య పాత్ర
ఇంటి వద్ద ఉన్నప్పుడు అన్ని వేళలా తోడుగా ఉండేది ఇల్లాలే. ఇంటిని చక్కదిద్దడంలో, కుటుంబ బాధ్యతలను మోయడంలో అర్ధాంగిదే కీలక పాత్ర. వివాహిత జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత, పరస్పర గౌరవం జీవితాన్ని సులువు చేస్తాయి. మంచి లక్షణాలు, సత్ప్రవర్తన కలిగిన సహచరి ఉంటే ఎంతటి పెద్ద కష్టమైనా ఇటివలి కాలంలో చిటికెలో తొలగిపోతుంది. మనిషికి ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగా తన జీవిత భాగస్వామి గురించే ఆలోచిస్తాడు. కుటుంబంలో సానుకూల వాతావరణం నింపడంలో భార్య నిజమైన భాగస్వామిగా నిలుస్తుంది.
అనారోగ్య వేళ అమృతమైన ఔషధం
మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామని అనుకున్నా, ఏదో ఒక సమయంలో అనారోగ్యం బారిన పడక తప్పదు. శరీరంలో శక్తి సన్నగిల్లినప్పుడు, భయంకరమైన రోగాలు చుట్టుముట్టినప్పుడు మనిషిని రక్షించేది మందే. సరైన సమయంలో అందించే చికిత్స, తగిన ఔషధం లేకపోతే మనిషి త్వరగా కోలుకోలేడు. చాణక్యుడి ప్రకారం, రోగంతో పోరాడుతున్న వ్యక్తికి ఔషధమే అత్యంత నమ్మకమైన మిత్రుడు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేయడంలో మందులు పోషించే పాత్ర అమూల్యమైనది.
మరణం తర్వాత కూడా మిగిలే ధర్మం
జీవితం నశించినా, మనిషి భౌతికంగా దూరమైనా మిగిలిపోయేది అతని సత్ప్రవర్తనే. ఆచార్యుల ప్రకారం ధర్మం లేదా సదాచారమే మనిషికి అంతిమ మిత్రుడు. కేవలం ధన సంపాదన వెంటే పరుగులు పెట్టకుండా ధర్మబద్ధమైన జీవితం గడపడం ముఖ్యం. ఏ మనిషైతే ధర్మ మార్గంలో నడుస్తాడో, ఇతరులకు మంచి చేస్తాడో, ఆ వ్యక్తి మరణం తర్వాత కూడా సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. మనిషి మంచి పనులే అతనికి శాశ్వతమైన కీర్తిని తెచ్చిపెడతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


