గురువారం ఈ 5 వస్తువులు దానం చేస్తే ఆర్థిక కష్టాలు దూరం... ఈ చిన్న దానాలు జీవితాన్ని మార్చగలవా?
గురువారం పూజలతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలో గురు దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు దూరం కావడానికి, సంపద పెరగడానికి ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఇప్పుడు చూద్దాం.
హిందూ సంప్రదాయంలో గురువారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజును లక్ష్మీనారాయణుల పూజకు, దేవగురువు బృహస్పతి ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. జాతకంలో గురు గ్రహం అనుకూలంగా ఉంటే సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు, సంపద, వైభవం వాటంతట అవే వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా, పెళ్లి పనులు వాయిదా పడుతున్నా గురువారం నాడు చేసే కొన్ని దానాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి.

"గురువారం నాడు చేసే చిన్న చిన్న పరిహారాలు, దానాలు జీవితంలో ఆర్థిక కష్టాలను దూరం చేస్తాయి," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. ఈ రోజున ఏయే వస్తువులను దానం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1.పసుపు రంగు వస్త్రాలు
గురువారం నాడు అవసరంలో ఉన్న వారికి లేదా బ్రాహ్మణులకు పసుపు రంగు బట్టలను దానం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల అప్పుల బాధల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం క్రమంగా పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
2.శనగపప్పు, పసుపు కొమ్ములు
గురువారం పూజ ముగిసిన తర్వాత గుడిలో లేదా పేదవారికి శనగపప్పు, పసుపు కొమ్ములు దానం ఇవ్వాలి. ఈ చిన్న పరిహారం వల్ల శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. దీనివల్ల అదృష్టం కలిసిరావడమే కాకుండా ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి.
3.పసుపు రంగు పండ్లు, మిఠాయిలు
శ్రీహరికి పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ రోజున స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత అరటిపండ్లు, మామిడిపండ్లు లేదా పసుపు రంగులో ఉండే స్వీట్లను ఇతరులకు పంచాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో గురు బలం పెరిగి, అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.
4.చందనం
మహావిష్ణువు ఆరాధనలో చందనానికి ప్రత్యేక స్థానం ఉంది. గురువారం నాడు చందనాన్ని దానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబంలో కలహాలు సర్దుమణిగి సంతోషం వెల్లివిరుస్తుంది. జాతకంలో బృహస్పతి అనుకూలత పెరిగి సిరిసంపదలు చేకూరుతాయి.
5.కుంకుమపువ్వు, ఆధ్యాత్మిక గ్రంథాలు
ఆర్థిక కష్టాలు శాశ్వతంగా దూరం కావాలంటే గురువారం నాడు కుంకుమపువ్వును దానం చేయవచ్చు. దీంతో పాటు రామాయణం, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలను కానుకగా ఇవ్వడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి నశిస్తుంది. బుద్ధి బలం, ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందుతాయి.
ఈ మంత్రాన్ని జపిస్తే మరిన్ని లాభాలు
గురువారం నాడు దాన ధర్మాలతో పాటు జపానికి కూడా విశేష ఫలితాలు ఉంటాయి. ఈ రోజున 108 సార్లు 'ఓం బృం బృహస్పతయే నమః' లేదా 'ఓం ఐం శ్రీం బృహస్పతయే నమః' అనే మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మనసులోని కోరికలు త్వరగా నేరవేరుతాయి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, వివిధ గ్రంథాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనిని నమ్మడం అనేది మీ వ్యక్తిగత విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఖచ్చితమైన వివరాల కోసం నిపుణులను సంప్రదించగలరు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


