ఇరిగేషన్ పై బేసిక్ నాలెడ్జ్ లేదని రుజువైంది - సీఎం రేవంత్ పై హరీశ్ రావ్ ఫైర్
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.రేవంత్ భాషను సభ్య సమాజం క్షమించదన్నారు. బీఆర్ఎస్ చేసిన న్యాయపోరాటం ఫలితంగానే రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ పై ఎన్జీటీ స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. నీళ్ల విషయంపై రేవంత్ రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ లేదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అత్యంత జుగుత్సాకరమైన, అసభ్యకరమైన భాషలో సీఎం రేవంత్ అబద్దాల వరద పారించారని విమర్శించారు. అసెంబ్లీలో అబద్దాలకు ఆస్కారం లేదంటూనే ఆసాంతం అబద్దాలనే ప్రయోగించారని దుయ్యబట్టారు.

సభ్య సమాజం క్షమించదు - హరీశ్ రావు
“ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ వేదికగా ‘భడివె’ వంటి పరమ బూతు పదాన్ని ప్రయోగించిన రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈ రకమైన రేవంతు భాషను సభ్య సమాజం క్షమించదు. నాలుక కోస్తానంటూ హింసాత్మకమైన, నేర ప్రవృత్తితో అసెంబ్లీలో మాట్లాడటం రేవంతు రాజకీయ నీచత్వానికి పరాకాష్ట. ముఖ్యమంత్రి ఈ విధంగా అతి వికృతంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా యదేచ్చగా బూతులు ప్రయోగిస్తుంటే స్పీకర్ గారు వారించకపోవడం అత్యంత దురదృష్టకరం” అని హరీశ్ రావు పేర్కొన్నారు.
“బిఆర్ఎస్ చేసిన న్యాయపోరాటం ఫలితంగా రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ పై ఎన్జీటీ స్టే ఇస్తే, అది తన ఘనకార్యంగా రేవంతు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెసే తెచ్చిందనడం రేవంత్ పిచ్చిప్రేలాపన తప్ప మరొకటి కాదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 2009 సాధారణ ఎన్నికల సమయంలో సీఎంవో నోట్ ఇస్తే, 2014 ఎన్నికల సమయంలో డీపీఆర్ కోసం జీవో జారీ చేసిన చరిత్ర నాటి కాంగ్రెస్ ప్రభుత్వానిది. డీపీఆర్ తయారీ కోసం జీవో ఇవ్వడానికే 5ఏళ్లు చేసిన మీరా మా గురించి అవాకులు చెవాకులు పేలేది” అని హరీశ్ రావు ప్రశ్నించారు.
“పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45టిఎంసీలకు తగ్గించిన మాట నిజమే అని, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి చెప్పక తప్పలేదు. నాడు నల్లగొండలో కేసీఆర్ గారు గర్జిస్తే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించం అంటూ తీర్మానం చేశారు. నేడు బీఆర్ఎస్ నిలదీస్తేనే పోలవరం నల్లమల్ల సాగర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని తీర్మానం చేసారు. ఈ తీర్మానాలు బిఆర్ఎస్ పోరాట ఫలితాలు” అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
ఇరిగేషన్ విషయాల్లో రేవంత్ రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ లేదనే విషయం అసెంబ్లీ వేదికగా మరో సారి రుజువైందని హరీశ్ రావు విమర్శించారు. బిఆర్ఎస్ వరద జలాలపై స్టాండ్ తీసుకోవాల్సి ఉండే అని రేవంత్ రెడ్డి వాఖ్యానించడం పరమ అజ్ఞానం, అవివేకమని దుయ్యబట్టారు.
“వరద జలాలపై స్టాండ్ తీసుకొని డీపీఆర్ ఇస్తే సీడబ్లుసి పరిశీలన కాదు కదా కనీసం స్వీకరించదు అనే ప్రాథమిక విషయం కూడా ముఖ్యమంత్రికి తెలియక పోవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎజెండాలోని అంశాలను సగం సగం చదువుతూ, వాక్యాలను వక్రీకరిస్తూ, సభను తప్పుదోవ పట్టించిన సీఎం చవకబారు ఎత్తుగడకు తగిన సమాధానాన్ని తెలంగాణ భవన్ వేదికగా(జనవరి 4) నేను ఇవ్వబోయే పీపీటీలో వివరిస్తాను. ముఖ్యమంత్రి రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తం చేసిన ఆరోపణలకు, చెప్పిన అబద్దాలకు తగిన సమాధానం పూర్తి సాక్ష్యాధారాలతో వివరిస్తాను. ముఖ్యమంత్రి పిట్ట కథలను, ఉత్తం కట్టు కథలను మీడియా సాక్షిగా తిప్పికొడుతాం” అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

