Bandi Bhagirath POCSO Case : బండి భగీరథ్కు తాత్కాలిక బెయిల్ మంజూరు
Bandi Bhagirath POCSO Case : పోక్సో కేసులో బండి భగీరథ్ కు తాత్కాలిక ఉపశమనం దొరికింది. హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రత్యేక కోర్టు 7 రోజుల పాటు ముందస్తు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
Bandi Bhagirath POCSO Case : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్కు న్యాయస్థానంలో తాత్కాలిక ఉపశమనం లభించింది. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని పోక్సో ప్రత్యేక కోర్టు ఆయనకు ఏడు రోజుల పాటు తాత్కాలిక (ఇంటరిమ్) బెయిల్ మంజూరు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో భగీరథ్ ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బండి సాయి భగీరథ్ తన చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉన్నందున…. పరీక్షలు రాసుకునేందుకు వీలుగా కోర్టు ఈ తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిందని సమాచారం. కేవలం ఏడు రోజుల కాలపరిమితికి మాత్రమే పరిమితమైన ఈ బెయిల్ కోసం న్యాయస్థానం పలు కఠినమైన షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది.
దాదాపు నెలరోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉన్న భగీరథ్ ఇవాళ మధ్యాహ్నం విడుదలయ్యారు. ఈనెల 28 వరకు (వారంపాటు) బెయిల్ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.
కేసు ఏంటి..?
17 ఏళ్ల బాలికను మభ్యపెట్టి, ఫామ్హౌస్లలో లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఫిర్యాదుతో మే 8న ఈ కేసు నమోదైంది. మరోవైపు భగీరథ్ తరపున ఇది 'హనీ ట్రాప్' అని, తనను బ్లాక్ మెయిల్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని కరీంనగర్లో ఫిర్యాదు కూడా చేశాడు. రెండు పిటిషన్లపై పోలీసులు విచారణ జరిపారు.
పోక్సో కేసును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం… ప్రత్యేకంగా సిట్ కూడా ఏర్పాటు చేసింది. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు…. భగీరథ్ ను అదుపులో తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు కాగా… ఉన్నత న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో న్యాయవాదుల సమక్షంలో భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత మేడ్చల్ కోర్టులో హాజరుపర్చగా…. రిమాండ్ విధించింది.
అప్పట్నుంచి భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎగ్జామ్స్ ఉన్న కారణంగా…. తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపినట్లు సమాచారం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

