Telangana : స్వీపర్ నెల జీతం 2 లక్షలు, ఇంజినీర్ జీతం 7 లక్షలు..! ఇలా మన రాష్ట్రంలోనే
ప్రతి నెలా ఉద్యోగుల జీతాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే తాజాగా సీఎస్ నిర్వహించిన సమీక్షలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. విద్యుత్ శాఖలో పనిచేస్తోన్న సీనియర్ స్వీపర్ జీతం రూ.2 లక్షల వరకూ ఉందని చెప్పారు. అంతేకాదు పలువురు ఇంజినీర్ల జీతం రూ. 7 లక్షల వరకు ఉంది.
విద్యుత్ శాఖలో ఓ స్వీపర్ జీతం నెలకు రూ. 2 లక్షలు..! అదే శాఖలో పని చేసే ఓ ఇంజినీర్ జీతం రూ. 7 లక్షలు…! మీరు విన్నది నిజమే…! ఈ లెక్కల ప్రకారం… స్వీపర్ జీతం జిల్లా కలెక్టర్ శాలరీ కంటే ఎక్కువ. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సీనియర్ ఐఏఎస్ల జీతమే రూ.1.5 లక్షల వరకు ఉంటే.. సీనియర్ స్వీపర్ జీతం మాత్రం రూ.2 లక్షలకు దగ్గరగా ఉంది. ఈ తరహా జీతాలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణారావు సమీక్షించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గడిచిన పదేళ్లలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల బిల్లు నాలుగు రెట్లు పెరిగి నెలకు సుమారు రూ.6,000 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు.
2014లో రాష్ట్ర విభజన సమయంలో నెలవారీ జీతాలు, పెన్షన్లపై వ్యయం దాదాపు రూ.1,500 కోట్లుగా ఉండేది. తరువాత వరుస వేతన సవరణలు, ఫిట్మెంట్ పెంచటం వంటి నిర్ణయాలతో ఈ ఖర్చు సుమారు 300 శాతం పెరిగింది. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్లో గణనీయ భాగం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకే వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది.
స్వీపర్ జీతం రూ. 2 లక్షలు…!
ప్రభుత్వ లెక్కల ప్రకారం విద్యుత్ శాఖలో ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లించబడుతున్నాయి. పవర్ యుటిలిటీల ఇంజినీర్ల జీతం నెలకు రూ.7 లక్షలు, స్వీపర్లతో సహా 4వ తరగతి ఉద్యోగులు సుమారు నెలకు రూ. 2 లక్షల జీతం జమ చేయబడుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ శాఖలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే వేతన సవరణల వల్లే జీతాలు ఈ స్థాయిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
30 ఏళ్ల సర్వీసు ఉన్న సీనియర్ క్లాస్-4 ఉద్యోగులు నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు జీతం చెల్లించాల్సి వస్తుంది. మున్సిపాలిటీల్లో కొత్తగా చేరిన వారికి రూ.28 వేలు జీతం వస్తుండగా.. 30 ఏళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు రూ.లక్షకు పైగా జీతం పొందుతున్నారు.
విద్యుత్ శాఖలోనే ఎందుకీలా…?
విద్యుత్ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలే ఈ స్థాయి జీతాలకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు శాఖను రాష్ట్ర విద్యుత్ బోర్డుగా పిలిచేవారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా…. విద్యుత్ బోర్డు స్థానంలో 'కంపెనీ'లు వచ్చాయి. అలా విద్యుత్తు ఉత్పత్తికి జెన్కో, విద్యుత్ సరఫరాకు ట్రాన్స్కోలు ఏర్పడ్డాయి. ట్రాన్స్కోలోనూ మళ్లీ ప్రాంతాల వారీగా డిస్కమ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ఈ సంస్కరణలపై సంబంధిత ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వారికి భరోసా కల్పించేందుకు అప్పటి ప్రభుత్వం జీతాలు భారీగా పెంచింది. ఇంక్రిమెంట్లు కూడా అదే స్థాయిలో నిర్ణయించింది. ఫలితంగా ఆ శాఖలో పని చేస్తున్న సీనియర్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగిపోయాయి.
ఇక స్వీపర్లు, ఇంజినీర్లు జీతాలు ఈస్థాయిలో ఉండటంతో పలువురు నెటిజన్లు ఆసక్తికరమైన పోస్టులు చేస్తున్నారు. వామ్మో… స్వీపర్ జీతం రూ. 2 లక్షలు ఎంట్రీ బాబు అంటూ రాసుకొస్తున్నారు.

E-Paper












