Telangana : స్వీపర్ నెల జీతం 2 లక్షలు, ఇంజినీర్ జీతం 7 లక్షలు..! ఇలా మన రాష్ట్రంలోనే

ప్రతి నెలా ఉద్యోగుల జీతాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే తాజాగా సీఎస్ నిర్వహించిన సమీక్షలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. విద్యుత్ శాఖలో పనిచేస్తోన్న సీనియర్ స్వీపర్ జీతం రూ.2 లక్షల వరకూ ఉందని చెప్పారు. అంతేకాదు పలువురు ఇంజినీర్ల జీతం రూ. 7 లక్షల వరకు ఉంది.

Published on: Feb 26, 2026, 22:11:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విద్యుత్ శాఖలో ఓ స్వీపర్ జీతం నెలకు రూ. 2 లక్షలు..! అదే శాఖలో పని చేసే ఓ ఇంజినీర్ జీతం రూ. 7 లక్షలు…! మీరు విన్నది నిజమే…! ఈ లెక్కల ప్రకారం… స్వీపర్ జీతం జిల్లా కలెక్టర్ శాలరీ కంటే ఎక్కువ. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సీనియర్ ఐఏఎస్‌ల జీతమే రూ.1.5 లక్షల వరకు ఉంటే.. సీనియర్ స్వీపర్ జీతం మాత్రం రూ.2 లక్షలకు దగ్గరగా ఉంది. ఈ తరహా జీతాలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి.

భారీగా జీతాలు...! (HT Photo/Representational image)
భారీగా జీతాలు...! (HT Photo/Representational image)

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణారావు సమీక్షించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గడిచిన పదేళ్లలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల బిల్లు నాలుగు రెట్లు పెరిగి నెలకు సుమారు రూ.6,000 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు.

2014లో రాష్ట్ర విభజన సమయంలో నెలవారీ జీతాలు, పెన్షన్లపై వ్యయం దాదాపు రూ.1,500 కోట్లుగా ఉండేది. తరువాత వరుస వేతన సవరణలు, ఫిట్‌మెంట్ పెంచటం వంటి నిర్ణయాలతో ఈ ఖర్చు సుమారు 300 శాతం పెరిగింది. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌లో గణనీయ భాగం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకే వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది.

స్వీపర్ జీతం రూ. 2 లక్షలు…!

ప్రభుత్వ లెక్కల ప్రకారం విద్యుత్ శాఖలో ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లించబడుతున్నాయి. పవర్ యుటిలిటీల ఇంజినీర్ల జీతం నెలకు రూ.7 లక్షలు, స్వీపర్లతో సహా 4వ తరగతి ఉద్యోగులు సుమారు నెలకు రూ. 2 లక్షల జీతం జమ చేయబడుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ శాఖలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే వేతన సవరణల వల్లే జీతాలు ఈ స్థాయిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

30 ఏళ్ల సర్వీసు ఉన్న సీనియర్ క్లాస్-4 ఉద్యోగులు నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు జీతం చెల్లించాల్సి వస్తుంది. మున్సిపాలిటీల్లో కొత్తగా చేరిన వారికి రూ.28 వేలు జీతం వస్తుండగా.. 30 ఏళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు రూ.లక్షకు పైగా జీతం పొందుతున్నారు.

విద్యుత్ శాఖలోనే ఎందుకీలా…?

విద్యుత్ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలే ఈ స్థాయి జీతాలకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు శాఖను రాష్ట్ర విద్యుత్ బోర్డుగా పిలిచేవారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా…. విద్యుత్ బోర్డు స్థానంలో 'కంపెనీ'లు వచ్చాయి. అలా విద్యుత్తు ఉత్పత్తికి జెన్‌కో, విద్యుత్ సరఫరాకు ట్రాన్స్‌కోలు ఏర్పడ్డాయి. ట్రాన్స్‌కోలోనూ మళ్లీ ప్రాంతాల వారీగా డిస్కమ్‌లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ఈ సంస్కరణలపై సంబంధిత ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వారికి భరోసా కల్పించేందుకు అప్పటి ప్రభుత్వం జీతాలు భారీగా పెంచింది. ఇంక్రిమెంట్లు కూడా అదే స్థాయిలో నిర్ణయించింది. ఫలితంగా ఆ శాఖలో పని చేస్తున్న సీనియర్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగిపోయాయి.

ఇక స్వీపర్లు, ఇంజినీర్లు జీతాలు ఈస్థాయిలో ఉండటంతో పలువురు నెటిజన్లు ఆసక్తికరమైన పోస్టులు చేస్తున్నారు. వామ్మో… స్వీపర్ జీతం రూ. 2 లక్షలు ఎంట్రీ బాబు అంటూ రాసుకొస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More