OTT: ఓటీటీలోకి ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తెలుగు, తమిళ సిరీస్- చిరంజీవి కూతురు నిర్మాత- 240కిపైగా దేశాల్లో స్ట్రీమింగ్!
Jagamae Sangeetham OTT Release Date Announced: ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కాంబోలో తెరకెక్కిన ఓటీటీ తెలుగు సిరీస్ జగమే సంగీతం. చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మాతగా రూపొందింన జగమే సంగీతం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను తాజాగా ప్రకటించారు. 2 భాషల్లో 240కిపైగా దేశాల్లో జగమే సంగీతం ఓటీటీ రిలీజ్ కానుంది.
Jagamae Sangeetham OTT Streaming Date Announced: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రైమ్ వీడియో మరో పవర్ఫుల్ తెలుగు ఒరిజినల్ సిరీస్తో వీక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రకాష్ రాజ్, మేకా శ్రీకాంత్, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్టాత్మక మ్యూజికల్ డ్రామా జగమే సంగీతం ఓటీటీ రిలీజ్ డేట్ను తాజాగా అధికారికంగా ప్రకటించారు.

తాత సంగీత వారసత్వం.. మనవడి అంతర్మథనం!
కర్ణాటక సంగీత నేపథ్యంతో తీర్చిదిద్దిన ఈ కథ.. శాస్త్రి (ప్రకాష్ రాజ్) అనే సంగీత దిగ్గజం, ఆయన వారసత్వాన్ని మోస్తున్న మనవడు బాలు చుట్టూ తిరుగుతుంది. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ బంధాలు, కుటుంబంలోని అంతర్గత విభేదాలు, గతంలో కప్పిపుచ్చిన రహస్యాల మధ్య బాలు ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యాడనేది ఈ తెలుగు, తమిళ ఓటీటీ సిరీస్ ప్రధాన ఇతివృత్తం.
సంగీతమే ప్రాణంగా బతికే ఒక కుటుంబంలో మాటలకంటే స్వరాలే భావోద్వేగాలను పంచుకునే భాషగా ఎలా మారాయో దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ అద్భుతంగా ఆవిష్కరించారు. సంప్రదాయ సంగీతాన్ని నేటితరం ట్రెండ్కు అనుగుణంగా మేళవిస్తూ విశాల్ చంద్రశేఖర్ అందించిన స్వరాలు ఈ ఓటీటీ సిరీస్కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాతగా!
హిందీలో ఘనవిజయం సాధించిన 'బండిష్ బ్యాండిట్స్' స్పూర్తితో తెరకెక్కిన ఈ సిరీస్ను మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల గోల్డ్బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు' వంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత గోల్డ్బాక్స్ సంస్థ నుంచి వస్తున్న తదుపరి భారీ ప్రాజెక్ట్ ఇది కావడం విశేషం.
"కుటుంబంలో మాటల్లో చెప్పలేని ప్రేమ, అసంతృప్తి, ఆరాటం, నిరీక్షణ లాంటి భావాలను వ్యక్తపరిచే ఒక సజీవ భాషగా ఇందులో సంగీతం కనిపిస్తుంది. విశ్వవ్యాప్త భావోద్వేగాలు ఉన్న ఈ కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మనసులను తప్పక గెలుచుకుంటుంది" అని నిర్మాత సుష్మిత కొణిదెల విశ్వాసం వ్యక్తం చేశారు.
భారీ తారాగణం.. అద్భుత సాంకేతిక బృందం!
ఈ సిరీస్లో అక్షయ్ లగుసాని, సుష్మితా శెట్టితో పాటు సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘుబాబు, రాకెట్ రాఘవ, జబర్దస్త్ నాగి, మిర్చి కిరణ్, పవిత్ర నాల్కరి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వంగల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ ఈ సిరీస్కు కథా సహకారం అందించారు.
ఇక అమెజాన్ ప్రైమ్లో సెప్టెంబర్ 4 నుంచి జగమే సంగీతం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో తెలుగుతో పాటు తమిళంలోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జగమే సంగీతం ఓటీటీ రిలీజ్ అవనుంది.
జగమే సంగీతం ఓటీటీ స్ట్రీమింగ్
జగమే సంగీతం ఓటీటీ విడుదల సందర్భంగా ప్రైమ్ వీడియో ఇండియా ఎస్వోడీ ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మాధోక్ మాట్లాడుతూ.. సాంప్రదాయం, ఆశయాల మధ్య జరిగే ఘర్షణను అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించిన కథగా 'జగమే సంగీతం' నిలుస్తుందన్నారు.
ఇలా సంగీతానికి, సెంటిమెంట్కు ప్రాధాన్యమిచ్చే తెలుగు వీక్షకులకు ఈ సెప్టెంబర్ 4న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఒక అద్భుతమైన విందు దొరకడం ఖాయం అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకొన్ని రోజుల్లో ఓటీటీలోకి వస్తున్న జగమే సంగీతం సిరీస్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


