రామ్ చరణ్, ఉపాసన కోసం జపాన్ చెఫ్ స్పెషల్ బిర్యానీ- టోక్యో నుంచి వచ్చి మరీ విందు- అతని స్పెషాలిటీ ఇదే!
గ్లోబల్ స్టార్బిర్యానీ రామ్ చరణ్ నివాసంలో జపాన్ ప్రఖ్యాత చెఫ్ తకమాసా ఒసావా సందడి చేశారు. రామ్ చరణ్తోపాటు గర్భిణిగా ఉన్న ఉపాసన కోసం ఆయన స్వయంగా ఘుమఘుమలాడే దేశీ బిర్యానీని వండారు. ఆ ఫోటోలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మన దేశీ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఒక జపాన్ చెఫ్ మన బిర్యానీ రుచికి ముగ్ధుడై, దాని తయారీలో ప్రావీణ్యం సంపాదించి, ఏకంగా మన ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ ఇంట్లోనే వంట చేస్తే.. ఆ మజానే వేరు.

చరణ్ ఇంట్లో ఘుమఘుమలు
జపాన్లోని టోక్యోకు చెందిన ప్రముఖ చెఫ్ తకమాసా ఒసావా తాజాగా హైదరాబాద్లోని రామ్ చరణ్ నివాసానికి వచ్చి మెగా కుటుంబానికి బిర్యానీ విందు ఇచ్చారు. రామ్ చరణ్ జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక విందులో చెర్రీతోపాటు ఉపాసనకు ఈ స్పెషల్ బిర్యానీ వండాడు చెఫ్ తకమాసా ఒసావా. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఒసావా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
"ఈ రోజు ఒక ప్రైవేట్ నివాసంలో బిర్యానీ వండాను. నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. అసలైన బిర్యానీ అంటే ఏంటో ఈ నగరం నాకు నేర్పిస్తూనే ఉంది" అని జపాన్ చెఫ్ తకసామా ఒసామా రాసుకొచ్చారు. రామ్ చరణ్ పెట్ డాగ్ 'రైమ్', ఇంట్లోని విదేశీ పక్షులు, కోయి ఫిష్లను చూస్తూ గడిపిన క్షణాలను 'ప్రశాంతమైన స్వాగతం'గా ఆయన అభివర్ణించారు.
ముగ్ధుడైన మెగాస్టార్ తనయుడు
సాంప్రదాయ పద్ధతిలో ఆరుబయట కట్టెల పొయ్యిపై వండిన బిర్యానీని లోపలికి తీసుకురాగానే రామ్ చరణ్ కుటుంబ సభ్యులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. వంట పాత్రపై మూత తీయగానే వచ్చిన సువాసనకు రామ్ చరణ్ ముఖంలో చిరునవ్వు విరిసింది.
బిర్యానీ ఎంతో రుచిగా ఉందంటూ చరణ్ చెఫ్ను అభినందించడమే కాకుండా, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. రామ్ చరణ్ తల్లి సురేఖమ్మ, సతీమణి ఉపాసన కొణిదెల కూడా ఈ విందులో పాల్గొన్నారు. ఇది తాను ఎప్పటికీ మర్చిపోలేని రోజని ఒసావా ఆనందం వ్యక్తం చేశారు.
ఎవరీ తకమాసా ఒసావా?
సోషల్ మీడియాలో 'బిర్యానీ ఒసావా'గా పేరుగాంచిన ఆయన ఒక మిచెలిన్ బిబ్ గౌర్మాండ్ గ్రహీత. కేవలం బిర్యానీ నేర్చుకోవడం కోసమే ఆయన గత 15 ఏళ్లుగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల మధ్య తిరుగుతున్నారు.
టోక్యోలో కేవలం 10 సీట్లు మాత్రమే ఉండే ఒక చిన్న బిర్యానీ రెస్టారెంట్ను ఆయన నడుపుతున్నారు. ఒకసారి తమిళనాడుకు రావడంతో తన జీవితం మారిపోయిందని ఒసావా చెబుతుంటారు.
మెగా ఫ్యామిలీలో డబుల్ ధమాకా
మరోవైపు మెగా అభిమానులకు ఇది రెట్టింపు సంతోషాన్నిచ్చే సమయం. రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం కవల పిల్లలతో గర్భవతిగా ఉన్నారు. 2023లో క్లిన్ కారా పుట్టిన తర్వాత, మళ్లీ మెగా ఇంట్లో చిన్నారి కేరింతలు వినిపించబోతున్నాయి.

ఇదిలా ఉంటే, రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో 'పెద్ది' (Peddi) షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా చేయగా.. ఇటీవల విడుదలైన చికిరీ సాంగ్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.














