OTT Telugu: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరణ్- ఇస్రో సైంటిస్ట్‌గా- సౌత్ హీరోయిన్ అని పిలవడంపై కామెంట్స్

బ్యూటిపుల్ హీరోయిన్ శ్రియా శరణ్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనను సౌత్ ఇండియన్ హీరోయిన్ అని పిలవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హరిద్వార్‌లో పుట్టి పెరిగిన శ్రియా శరణ్ దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఎదిగిన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

Published on: Jan 30, 2026 10:25 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హరిద్వార్‌ వంటి ఒక చిన్న పట్టణంలో, హిందీ మాట్లాడే కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. దక్షిణ భారత సినీ రంగంలో రెండు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలుగుతుందని ఎవరూ ఊహించలేదు. భాష తెలియదు, సంస్కృతి కొత్త.. అయినా సరే, శ్రియా శరణ్ సౌత్ స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తనపై ఉన్న ‘సౌత్ హీరోయిన్’ అనే ముద్ర గురించి శ్రీయా శరణ్ తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరణ్- ఇస్రో సైంటిస్ట్‌గా- సౌత్ హీరోయిన్ అని పిలవడంపై కామెంట్స్
ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరణ్- ఇస్రో సైంటిస్ట్‌గా- సౌత్ హీరోయిన్ అని పిలవడంపై కామెంట్స్

ఒక ఇంజనీర్ కూతురు.. నటిగా మారడం ఒక సంచలనం!

హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "నేను హరిద్వార్‌లో పుట్టాను. 17 ఏళ్ల వయసు వరకు అక్కడే ఉన్నాను. కథక్ నేర్చుకోవడం కోసం ఢిల్లీకి మారడం నా జీవితంలో మొదటి పెద్ద మలుపు" అని శ్రియా శరణ్ అన్నారు.

"మా నాన్న ఇంజనీర్, అమ్మ టీచర్.. అలాంటి క్రమశిక్షణ గల కుటుంబం నుంచి వచ్చి నేను నటిని అవుతానంటే అందరూ షాక్ అయ్యారు" అని శ్రియా శరణ్ వివరించారు. ఢిల్లీ వంటి మెట్రో నగరానికి మారడం, అక్కడ లేడీ శ్రీరామ్ (LSR) కాలేజీలో చదువుకోవడం తనను నేటి ప్రపంచానికి సిద్ధం చేశాయని ఆమె పేర్కొన్నారు.

నా గుండె చప్పుడు సౌత్ ఇండియా!

2001లో ‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రియా శరణ్ ఛత్రపతి, శివాజీ, మనం వంటి ఎన్నో బ్లాక్‌ బస్టర్ చిత్రాల్లో నటించారు. హిందీలో ‘దృశ్యం’ వంటి హిట్స్ ఉన్నప్పటికీ, మీడియా తనను ఎప్పుడూ ‘సౌత్ హీరోయిన్’ అని పిలుస్తుంటుంది.

దీనిపై శ్రియా శరణ్ స్పందిస్తూ.. "నన్ను అలా పిలవడం నాకు ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు. నిజానికి దక్షిణాది ప్రేక్షకులు నాపై కురిపించిన ప్రేమ వెలకట్టలేనిది. ఇప్పుడు నా మనసు పూర్తిగా ‘సౌత్ ఇండియన్’ అయిపోయింది" అని చెప్పుకొచ్చారు.

లేబుల్స్ గురించి శ్రియా ఫిలాసఫీ

మనుషులు మనల్ని ఏదో ఒక గాడిలో పెట్టాలని చూస్తుంటారని, కానీ మనం దాన్ని ఎలా స్వీకరిస్తామనేదే ముఖ్యమని శ్రియా తెలిపారు. "జనాలు మిమ్మల్ని గుర్తిస్తున్నారంటేనే మీకో లేబుల్ వేస్తారు. ఆ చట్రంలో మనం ఉండిపోకూడదు (అక్కడితో ఆగిపోకూడదు అర్థంలో). నేర్చుకుంటూ ముందుకు సాగితే ఆ లేబుల్సే మనకు ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్‌ను ఇస్తాయి" అని శ్రియా శరణ్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

2026లో శ్రియా సందడి: ఇస్రో సైంటిస్ట్‌గా సరికొత్త అవతారం

ఇటీవలే శ్రియా శరణ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నేపథ్యంలో తెరకెక్కిన స్పేస్ జెన్: చంద్రయాన్ ఓటీటీ వెబ్ సిరీస్‌లో శ్రియా శరణ్ ఒక శాస్త్రవేత్త పాత్రను పోషిస్తున్నారు.

నకుల్ మెహతా కీలక పాత్రలో నటించిన ఈ ఓటీటీ సిరీస్ ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 23న తెలుగులో కూడా స్పేస్ జెన్: చంద్రయాన్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇది మాత్రమే కాకుండా, ఈ ఏడాది చివర్లో రానున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘దృశ్యం 3’లో కూడా శ్రియా శరణ్ కనిపించనున్నారు.