vitamin D supplements : విటమిన్ డీ సప్లిమెంట్లు వాడేటప్పుడు ఈ 5 తప్పులు చేయకండి!
vitamin D supplements : విటమిన్-డీ సప్లిమెంట్లు వాడుతున్నా మీలో నీరసం తగ్గట్లేదా? ఎముకల నొప్పులు అలాగే ఉన్నాయా? అయితే మీరు విటమిన్-డీ తీసుకునే పద్ధతిలో లోపం ఉండవచ్చు. ఈ విటమిన్ సరిగ్గా అందాలంటే పాటించాల్సిన సూత్రాలు ఇక్కడ చూసేయండి..
Vitamin D tablets : మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఎముకలు ఉక్కులా మారాలన్నా, మనసు ఉల్లాసంగా ఉండాలన్నా విటమిన్-డీ చాలా అవసరం. దీనినే మనం 'సన్షైన్ విటమిన్' అని కూడా పిలుస్తాం. అయితే, చాలా మంది విటమిన్-డీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా, వారి రక్త పరీక్షల్లో ఫలితాలు మాత్రం ఆశాజనకంగా ఉండటం లేదు. విటమిన్-డీ మన ఒంటికి పట్టకపోవడానికి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే కారణమని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ షబానా పర్వీన్ వివరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విటమిన్-డీ మీ శరీరానికి సరిగ్గా అందాలంటే పాటించాల్సిన కొన్ని టిప్స్ని ఇక్కడ తెలుసుకోండి..
1. మెగ్నీషియం లేకపోతే అది వృథానే!
చాలా మంది విటమిన్-డీ సప్లిమెంట్లపైనే దృష్టి పెడతారు కానీ, మెగ్నీషియం గురించి పట్టించుకోరు. శరీరంలో మెగ్నీషియం తగినంత లేకపోతే, మీరు ఎంత విటమిన్-డీ తీసుకున్నా ఉపయోగడం ఉండదు. అమెరికా వంటి దేశాల్లో దాదాపు 50 శాతం మందిలో విటమిన్-డీ లోపానికి మెగ్నీషియం కొరతే ప్రధాన కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. మన దేశంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఏం చేయాలి?: మీ డైట్లో పాలకూర, బాదం పప్పులు, డార్క్ చాక్లెట్, గుమ్మడి గింజలు ఉండేలా చూసుకోండి. అవసరమైతే డాక్టర్ సలహాతో మెగ్నీషియం సప్లిమెంట్లు వాడండి.
2. విటమిన్ కే2, కాల్షియం కలయిక
విటమిన్-డీ అనేది కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది. కానీ, శరీరంలో విటమిన్ కే2 తగినంత లేకపోతే, ఆ కాల్షియం ఎముకల్లోకి చేరడానికి బదులు రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీనివల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
నిపుణుల సూచన: "విటమిన్-డీ, కేే2లను కలిపి తీసుకోవడం వల్ల కాల్షియం నేరుగా ఎముకలకు చేరుతుంది. తద్వారా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రావు," అని షబానా పర్వీన్ పేర్కొన్నారు. చీజ్, కోడిగుడ్డు సొన వంటి వాటిలో కే2 లభిస్తుంది.
3. ఖాళీ కడుపుతో అస్సలు వద్దు!
విటమిన్-డీ అనేది 'ఫ్యాట్ సొల్యూబుల్' (కొవ్వులో కరిగే) విటమిన్. అంటే, ఇది మన శరీరంలోకి చేరాలంటే మనం తినే ఆహారంలో కొంచెం కొవ్వు ఉండాలి.
సరైన పద్ధతి: ట్యాబ్లెట్లను ఖాళీ కడుపుతో వేసుకోవడం వల్ల వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే పెరుగు, గుడ్లు లేదా కొన్ని డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాతే విటమిన్-డీ తీసుకోవాలి. లో-ఫ్యాట్ లేదా కొవ్వు లేని ఆహారంతో దీనిని తీసుకుంటే ఆశించిన ఫలితం ఉండదు.
4. ఎండతో స్నేహం.. ఏడాది పొడవునా!
కేవలం ఎండాకాలంలో ఎండలో తిరిగితే విటమిన్-డీ సరిపోతుందనేది ఒక అపోహ. మన చర్మంపై నేరుగా సూర్యరశ్మి పడటం చాలా ముఖ్యం.
సమయం: రోజుకు కనీసం 10 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో ఉండటం వల్ల శరీరం విటమిన్-డీని సహజంగా ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే, చర్మం కమిలిపోకుండా జాగ్రత్త వహించాలి. ఆఫీసుల్లో ఉండేవారు, ఎండ తగలని వారు ఏడాది పొడవునా సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది.
5. సరైన మోతాదు తెలుసుకోండి
ఎంత పడితే అంత విటమిన్-డీ వాడటం ప్రమాదకరం. వయసును బట్టి దీని మోతాదు మారుతుంది:
0-12 నెలల పిల్లలకు: 400 IU (10 mcg)
1-70 ఏళ్ల వారికి: 600 IU (15 mcg)
71 ఏళ్లు పైబడిన వారికి: 800 IU (20 mcg)
గర్భిణీలు: 600 IU (15 mcg)
విటమిన్-డీ సప్లిమెంట్లు మొదలుపెట్టే ముందు ఒకసారి రక్త పరీక్ష చేయించుకుని, వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఆరోగ్యపరమైన విషయాల కోసం వైద్య నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.)
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. విటమిన్-డీ వేసుకోవడానికి ఉత్తమ సమయం ఏది?
సాధారణంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విటమిన్-డీ తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారంతో దీనిని తీసుకుంటే గ్రహణ శక్తి పెరుగుతుంది.
2. ఎండలో ఎంతసేపు ఉండాలి?
సహజంగా విటమిన్-డీ అందాలంటే రోజుకు 10 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. అయితే, చర్మ రంగు, వాతావరణాన్ని బట్టి ఈ సమయం మారవచ్చు.
3. కేవలం ఆహారం ద్వారానే విటమిన్-డీ పొందవచ్చా?
చేపలు, గుడ్లు వంటి కొన్ని ఆహారాల్లో విటమిన్-డీ ఉంటుంది. కానీ మన శరీరానికి అవసరమైన పూర్తి మోతాదు కేవలం ఆహారం ద్వారా అందడం కష్టం. అందుకే ఎండ, అవసరమైతే సప్లిమెంట్లు అవసరం.
4. విటమిన్-డీ లోపిస్తే ఏమవుతుంది?
ఎముకలు బలహీనపడటం, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం, వెన్నునొప్పి, జుట్టు రాలడం, మానసిక ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


