...
...
Next Story

Delhi crime news : 'ఊపిరాడనివ్వకుండా చేసి, రేప్​ చేసి, లాక్కెళ్లి..' దిల్లీ యువతి హత్య కేసులో షాకింగ్ నిజాలు!

Delhi rape case : దిల్లీలో మానవజాతి తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ సివిల్​ సర్వెంట్​ కూతురుని, ఆమె ఇంట్లో ఓ వ్యక్తి దారుణంగా రేప్​ చేసి హత్య చేశాడు. ఇంట్లో దొంగతానికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Published on: Apr 24, 2026, 11:45:12 IST
Advertisement

Kailash hills murder case : దేశ రాజధానిలోని కైలాష్ హిల్స్ ప్రాంతంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది. ఒక 22 ఏళ్ల యూపీఎస్సీ ఆస్పిరెంట్‌పై మాజీ ఇంటి పనివాడు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేశాడు. దొంగతనం చేసే క్రమంలో లాకర్‌ను తెరిచేందుకు ఆమె వేలిముద్రలను వాడేందుకు ప్రయత్నించడం ఈ కేసులో వెలుగుచూసిన అత్యంత భయంకరమైన నిజం!

పోలీసుల వద్ద దిల్లీ హత్య కేసు నిందితుడు.. (HT_PRINT/ANI)
పోలీసుల వద్ద దిల్లీ హత్య కేసు నిందితుడు.. (HT_PRINT/ANI)

దక్షిణ ఢిల్లీలోని విలాసవంతమైన ప్రాంతంలో జరిగిన ఈ హత్యోదంతం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం డబ్బు కోసం ఒక ఉన్మాదిలా ప్రవర్తించిన నిందితుడు రాహుల్ మీనా, ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్​ని, కాబోయే సివిల్ సర్వెంట్‌ను పొట్టనబెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ కేసులో వెలుగుచూసిన నిజాలను చదివితే సభ్య సమాజం తలదించుకుంటోంది.

పథకం ప్రకారం ప్రవేశం.. లోపాలను వాడుకుని!

23 ఏళ్ల రాహుల్ మీనా ఆ ఇంట్లో పనివాడిగా చేసేవాడు. అందుకే ఆ కుటుంబం గురించి బాగా తెలుసు. జూదం వ్యసనం వల్ల అప్పులు చేసి, ఇరుగుపొరుగు వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడని రెండు నెలల క్రితమే అతడిని పనిలో నుంచి తీసేశారు. అయితే, ఆ ఇంటి భద్రతలో ఉన్న 'లొసుగులు' అతడికి తెలుసు.

బుధవారం ఉదయం 6:30 గంటలకు నివాసం వద్దకు చేరుకున్న రాహుల్.. యువతి తల్లిదండ్రులు (సివిల్​ సర్వెంట్- డెంటిస్ట్) జిమ్‌కు వెళ్లే వరకు వేచి ఉన్నాడు. వారు వెళ్లగానే, షూ రాక్ దగ్గర రహస్యంగా దాచి ఉంచే స్మార్ట్ కీని తీసుకుని 6:39 గంటలకు నాలుగో అంతస్తులోని ఫ్లాట్‌లోకి ప్రవేశించాడు.

ఘాతుకానికి పాల్పడిన తీరు: ఛార్జర్ వైరుతో ఉరి!

మొదట ఆమె గొంతు నొక్కి, ఆపై ఫోన్ లాక్కున్నాడు.

మొబైల్ ఛార్జర్ వైరుతో ఆమె గొంతుకు బిగించి ఉరివేశాడు.

ఆమె గిలగిలలాడుతుండగానే వాటర్ బాటిల్, టేబుల్ ల్యాంప్‌తో తల మీద బలంగా కొట్టాడు.

యువతి స్పృహ కోల్పోయిన తర్వాత, ఆ కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటికే ఆమె ప్రాణం కొన ఊపిరితో ఉందని ఫోరెన్సిక్ నివేదికలు చెబుతున్నాయి.

వేలిముద్రల కోసం శవాన్ని ఈడ్చుకుంటూ..!

ఈ నేరంలో అత్యంత భయంకరమైన ఘట్టం ఇదే. నిందితుడి లక్ష్యం కేవలం హత్య కాదు, దోపిడీ. ఇంట్లోని లాకర్‌కు 'బయోమెట్రిక్' (వేలిముద్ర) లాక్ ఉందని అతడికి తెలుసు.

లాకర్ తెరవడానికి స్పృహలో లేని బాధితురాలిని మెట్ల గుండా మరో అంతస్తుకు ఈడ్చుకెళ్లాడు. ఆమె వేళ్లను స్కానర్‌పై పదే పదే నొక్కాడు. కానీ ఆ లాకర్ తెరుచుకోలేదు. చివరకు విసిగిపోయిన నిందితుడు ఒక బరువైన వస్తువుతో లాకర్‌ను పగులగొట్టి నగదు, నగలు దోచుకున్నాడు.

రక్తపు మరకల బట్టలు మార్చి పరారీ!

నేరం చేసిన తర్వాత ఏమాత్రం భయం లేకుండా, తన రక్తపు మరకల బట్టలను అక్కడే వదిలేసి 7:15 గంటలకు బయటకు వచ్చేశాడు. అంటే కేవలం 40 నిమిషాల్లోనే అత్యాచారం, హత్య, దోపిడీ పూర్తి చేశాడు.

ఈ వ్యవహారం దేశరాజధానిలో తీవ్ర కలకలం సృష్టించింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి అతడు ద్వారకలోని ఒక హోటల్​లో చిక్కాడు.

అనంతరం జరిపిన విచారణంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

రాజస్థాన్‌లో మరో దారుణం!

దిల్లీలో ఈ ఘాతుకానికి పాల్పడటానికి కొన్ని గంటల ముందే, మంగళవారం రాత్రి రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఒక మహిళపై ఇతడు అత్యాచారం చేశాడని విచారణలో తేలింది. అక్కడి నుంచి తప్పించుకోవడానికి సైకిల్ దొంగిలించి, ఒక పెళ్లికి వెళ్లి భోజనం చేసి, లిఫ్ట్ అడిగి చివరకు దిల్లీకి చేరుకున్నాడు. ఇదంతా చూస్తుంటే అతడు ఎంతటి క్రూరమైన నేరగాడో అర్థం చేసుకోవచ్చు.

కోర్టులో నిందితుడి వాంగ్మూలం

సాకేత్ కోర్టులో మేజిస్ట్రేట్ ముందు రాహుల్ మీనా మాట్లాడుతూ.. "తప్పు జరిగిపోయింది. డబ్బు కోసమే ఇదంతా చేశాను. లాకర్ తెరవడానికి ఆమె వేలిముద్రలు కావాల్సి వచ్చాయి," అని అతను చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కోర్టు ఈ నేరాన్ని "అత్యంత అరుదైన, క్రూరమైనది"గా పేర్కొంటూ నిందితుడిని కస్టడీకి ఇచ్చింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe