KTR On Delimitation : దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోం - కేటీఆర్

KTR Comments On Delimitation : దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోం - కేటీఆర్ దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు.మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని… కానీ నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 

Published on: Apr 16, 2026 11:26 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

KTR Comments On Delimitation : మహిళా రిజర్వేషన్ బిల్లుకు భారత్ రాష్ట్ర సమితి (BRS) మొదటి నుంచి చిత్తశుద్ధితో సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత కోసం అనేక చర్యలు అమలు చేసిన రికార్డు తమకు ఉందన్నారు.

దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోం - కేటీఆర్
దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోం - కేటీఆర్

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడమే కాకుండా, అసెంబ్లీ మరియు కౌన్సిల్‌లో ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేసిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా, స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, మార్కెట్ కమిటీల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా మహిళా సాధికారత పట్ల తమకున్న అచంచలమైన నిబద్ధతను చాటుకున్నామని తెలిపారు.

మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనను రాజ్యాంగ సవరణలతో అనవసరంగా ముడిపెట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అత్యంత సరళమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సంక్లిష్టం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

"మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయండి. పార్లమెంటులో 543 సీట్లు ఉన్నాయి, అక్కడ వర్తింపజేయండి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇక్కడ కూడా అమలు చేయండి. సీట్ల పెంపు మరియు పునర్విభజనతో ముడిపెట్టి ఎందుకు అయోమయాన్ని సృష్టిస్తున్నారు?" అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్యాయం జరిగితే ప్రతిఘటిస్తాం - కేటీఆర్

రాజ్యాంగ విధివిధానాల ప్రకారం మొదట జనగణన (Census), తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, ఆ తర్వాతే నిర్మాణాత్మక మార్పులు జరగాలని కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగని ఏ సహేతుకమైన ప్రతిపాదనకైనా బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పారు. కానీ దక్షిణాదికి అన్యాయం చేసే ప్రయత్నం జరిగితే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామని… అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

రేవంత్ రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదని కేటీఆర్ ఆరోపించారు. "ఉదయం ఆయన కాంగ్రెస్‌ను ప్రతినిధిగా ఉంటారు, సాయంత్రానికి బీజేపీతో కలిసిపోతారు. సహజంగానే ఇలాంటి హైబ్రిడ్ విధానం ఆయన పాలనలో కూడా కనిపిస్తోంది" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇతరుల నుంచి నిబంధనలు కోరుతున్న ముఖ్యమంత్రి, హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదన విషయంలో జీహెచ్‌ఎంసీ (GHMC) ప్రతినిధులు, జెడ్పీటీసీ (ZPTC) సభ్యులు లేదా ఎమ్మెల్యేలను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు.

పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో ఉన్న అస్పష్టతలపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్ర నేతలు చెబుతున్నప్పటికీ, బిల్లులో మాత్రం ఆ ప్రస్తావన ఎక్కడా లేదని గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై 2022–23 నుంచే బీఆర్ఎస్ గళమెత్తుతోందని… కేవలం జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

1971లో పార్లమెంటు సీట్లపై విధించిన స్తంభన జనాభా నియంత్రణ ప్రాతిపదికన జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. గత ఐదు దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేశాయని తెలిపారు. "జాతీయ జనాభా విధానాన్ని తూచా తప్పకుండా పాటించినందుకు ఇప్పుడు మమ్మల్ని శిక్షిస్తారా?" అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం సుమారు 24% ఉందని, ఈ శాతాన్ని ఏ స్థితిలోనైనా కాపాడాలని ఆయన నొక్కి చెప్పారు. "0.01% శాతం తగ్గుదల కూడా మాకు ఆమోదయోగ్యం కాదు. ఆరు దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్ల శాతం 24% గానే కొనసాగాలి. దీనిని మార్చే ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు" అని కేటీఆర్ హెచ్చరించారు.

ఈ ఆందోళనలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. "మీరు ఒక నిప్పుల కుంపటి (Powder keg) మీద కూర్చున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది" అని వ్యాఖ్యానించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More