OTT Review: ఓటీటీ రివ్యూ- నవ్వులు, చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలతో- ఇవాళ ఓటీటీలోకి వచ్చిన కామెడీ సిరీస్ ఎలా ఉందంటే?

Adarsh Baal Vidyalaya OTT Review In Telugu: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఇవాళ సెటైరికల్ కామెడీ వెబ్ సిరీస్ ఆదర్శ్ బాల విద్యాలయ స్ట్రీమింగ్‌కు వచ్చింది. నవ్వులు, చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలతో హాయిగా సాగిపోయే ఈ సిరీస్ ఎలా ఉందో నేటి ఆదర్శ బాల విద్యాలయ ఓటీటీ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Jul 24, 2026, 06:44:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Series Adarsh Baal Vidyalaya Review In Telugu: డిజిటల్ ప్రియులను అలరించేందుకు సెటైరికల్ కామెడీ వెబ్ సిరీస్ ఆదర్శ్ బాల విద్యాలయ (Adarsh Baal Vidyalaya) ఓటీటీలోకి ఇవాళ (జూలై 24) వచ్చేసింది. పాపులర్ నటుడు కేకే మీనన్, నవీన్ కస్తూరియా, అర్చన పూరన్ సింగ్ వంటి అగ్ర నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఓటీటీ సిరీస్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తోంది.

ఓటీటీ రివ్యూ- నవ్వులు, చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలతో- ఇవాళ ఓటీటీలోకి వచ్చిన కామెడీ సిరీస్ ఎలా ఉందంటే?
ఓటీటీ రివ్యూ- నవ్వులు, చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలతో- ఇవాళ ఓటీటీలోకి వచ్చిన కామెడీ సిరీస్ ఎలా ఉందంటే?

ఆదర్శ బాల విద్యాలయ రివ్యూ

మొత్తం 7 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ రూపుదిద్దుకుంది. వీక్షకులను నవ్విస్తూనే ఆలోచింపజేసేలా ఈ ఓటీటీ సిరీస్‌ను తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్‌లో ఆదర్శ్ బాల విద్యాలయ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో నేటి ఆదర్శ బాల విద్యాలయ రివ్యూలో తెలుసుకుందాం.

ఢిల్లీలోని ఒక నిరుత్సాహకరమైన స్కూల్ నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. అక్కడ చదివే పిల్లలకు చదువుపై శ్రద్ధ ఉండదు, బోధించాలనే ఉత్సాహం ఉపాధ్యాయులకు ఉండదు. ఇక హెడ్‌మాస్టర్‌కు (కేకే మీనన్) అసలే పట్టింపు ఉండదు.

విదేశీ ప్రయాణ కల నెరవేర్చుకోడానికి

అయితే, పదో తరగతి బోర్డు పరీక్షల్లో టాప్ 10లో నిలిచే పాఠశాల హెడ్‌మాస్టర్లను విదేశాల్లోని ప్రసిద్ధ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పంపుతామని ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రకటిస్తుంది. దీంతో ఆ హెడ్‌మాస్టర్ తన విదేశీ ప్రయాణ కల నెరవేర్చుకోవడానికి పడే తాపత్రయమే ఈ ప్రధాన కథాంశం.

స్కూల్ రోజులను గుర్తుచేసే సరదా సన్నివేశాలు

ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి మంచి ఫలితాలు సాధించే క్రమంలో హెడ్‌మాస్టర్‌కు అనేక చిత్రమైన సవాళ్లు ఎదురవుతాయి. కథ ప్రభుత్వ పాఠశాలల లోపాలను ఎత్తిచూపినప్పటికీ, ప్రతి ఒక్కరికీ తమ చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.

ఒక ఎపిసోడ్‌లో బయోలాజీ టీచర్ తరగతి గదిలో అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి ఉన్నప్పుడు 'హ్యూమన్ రీప్రొడక్షన్' (మానవ ప్రత్యుత్పత్తి) పాఠం చెప్పడానికి పడే ఇబ్బంది కామెడీని తెప్పిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు తమ స్కూల్‌లో కచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. అందుకే ఈ సీన్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది.

పాఠశాల మొత్తాన్ని భయపెట్టే స్ట్రిక్ట్ టీచర్ ఎంట్రీ, కొత్తగా వచ్చిన లేడీ టీచర్‌ను అల్లరి పిల్లలు ఆటపట్టించడం వంటి సన్నివేశాలు చాలా సహజంగా కుదిరాయి. ప్రతీ ఒక్కరి స్కూల్ రోజుల్లో కచ్చితంగా ఇటువంటి ఒక ఉపాధ్యాయుడు ఉండే ఉంటారనే భావన ఈ సీన్లు కలిగిస్తాయి.

ప్లస్ పాయింట్లు.. ఎవరెలా చేశారంటే?

ఈ ఓటీటీ సిరీస్‌కు అతిపెద్ద బలం నటీనటుల ఎంపిక. హెడ్‌మాస్టర్‌గా కేకే మీనన్ తనదైన కామెడీ టైమింగ్‌తో జీవించేశారు. నవీన్ కస్తూరియా, అర్చన పూరన్ సింగ్, దేవేన్ భోజానీ, ప్రసన్న బిష్త్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చైల్డ్ ఆర్టిస్టులు చేసిన అల్లరి, వారి నటన వీక్షకులను ఎంతగానో అలరిస్తుంది.

హాస్యంతో పాటు తండ్రీకూతుళ్ల అనుబంధం, ఉపాధ్యాయులు-విద్యార్థుల మధ్య ఉండే సున్నితమైన సంబంధాలను దర్శకుడు హిమాంక్ గౌర్ అద్భుతంగా తెరకెక్కించారు. క్లైమాక్స్ బాగుంటుంది.

మైనస్ పాయింట్లు.. చూడవచ్చా?

కథాంశం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను కావాలని సాగదీశారనే భావన కలుగుతుంది. అయినప్పటికీ, వారాంతంలో కుటుంబంతో కలిసి ఆహ్లాదకరమైన వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి 'ఆదర్శ్ బాల విద్యాలయ' ఒక మంచి ఎంపిక.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయిన 7 ఎపిసోడ్స్ గల ఈ సెటైరికల్ కామెడీ సిరీస్ ఆదర్శ బాల విద్యాలయను ఎంచక్కా సరదాగా బింజ్ వాచ్ చేయవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More