Mahesh Babu Varanasi: వారణాసి నుంచి మహేశ్ బాబు కొత్త ఫొటోలు.. ఫ్యాన్స్ ఖుషీ.. కానీ, కూల్ లుక్‌పై కూల్ డ్రింక్ కామెంట్స్

Trolling On Mahesh Babu Varanasi Photos: సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎస్‌ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' నుంచి కొత్త పోస్టర్లు విడుదలయ్యాయి. ఆఫ్రికన్ అడవుల్లో రుద్ర పాత్రలో మహేశ్ లుక్ అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, కొందరు నెటిజన్లు మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు.

Published on: Aug 9, 2026, 19:00:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trolling On Mahesh Babu Varanasi Photos: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆగస్టు 9న అంటే ఇవాళ 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులకు జక్కన్న ఎస్‌ఎస్ రాజమౌళి అదిరిపోయే బహుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

వారణాసి నుంచి మహేశ్ బాబు కొత్త ఫొటోలు.. ఫ్యాన్స్ ఖుషీ.. కానీ, కూల్ లుక్‌పై కూల్ డ్రింక్ కామెంట్స్
వారణాసి నుంచి మహేశ్ బాబు కొత్త ఫొటోలు.. ఫ్యాన్స్ ఖుషీ.. కానీ, కూల్ లుక్‌పై కూల్ డ్రింక్ కామెంట్స్

రెండు సరికొత్త ఫొటోలు

గ్లోబల్ వైడ్‌గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వారణాసి' సినిమా నుంచి మహేశ్ బాబుకు సంబంధించిన రెండు సరికొత్త ఫొటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ చిత్రంలో మహేశ్ 'రుద్ర' అనే అడ్వెంచరర్ పాత్రలో కనిపిస్తున్నారు.

ఆఫ్రికా అడవుల్లో 'రుద్ర'.. రాజమౌళి ఏమన్నారంటే?

ఈ కొత్త పిక్చర్స్‌లో మహేశ్ బాబు చాలా సింపుల్‌గా కార్గో ప్యాంట్, షర్ట్ ధరించి ఆఫ్రికాలోని ప్రసిద్ధ మాసాయి మారా (Masai Mara) అడవుల నేపథ్యంలో కనిపించారు. ఒక ఫొటోలో ఆయన బూట్లు, బ్యాగ్ పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటుండగా, మరొక క్లోజప్ షాట్‌లో వెనుక జింకలు, ప్రకృతి అందాలు కనిపిస్తున్నాయి.

"రుద్ర ప్రపంచం నుంచి మరికొన్ని దృశ్యాలు" అని రాసుకొస్తూ మహేశ్ బాబు ఈ ఫొటోలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఈ పాత్రపై స్పందిస్తూ మహేశ్ నటనను ఆకాశానికెత్తేశారు.

ఐమాక్స్‌కు అందనంత అద్భుతంగా

"తనకంటే చాలా పెద్దదైన ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి పుట్టిన పాత్రే రుద్ర. ఈ పాత్రలో ఎంత తీవ్రత ఉందో, అంతే సున్నితత్వం కూడా ఉంది. మహేశ్ ఈ రెండింటినీ అద్భుతంగా పండించారు. కిలిమంజారో, మాసాయి మారా అడవుల్లో మేం తీసిన సన్నివేశాలు 1.43:1 ఐమాక్స్ (IMAX) స్క్రీన్ పరిమాణానికి కూడా అందనంత అద్భుతంగా వచ్చాయి" అని రాజమౌళి పేర్కొన్నారు.

నెటిజన్ల భిన్న స్పందనలు..

పోస్టర్లు బయటకు రాగానే మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. విష్ణుమూర్తి కలకలలాడే తేజస్సులా ఆయన ముఖం ఉందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సాధారణ నెటిజన్ల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఆఫ్రికా అడవుల్లో ప్రమాదకరమైన అడ్వెంచర్ చేసే వ్యక్తి ముఖం అంత క్లీన్ షేవ్‌గా, నీట్‌గా ఎలా ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

కూల్ లుక్‌పై కూల్ డ్రింక్ కామెంట్లు!

మరికొందరైతే ఇది సినిమా పోస్టర్‌లా కాకుండా మహేశ్ బాబు నటించిన 'మౌంటైన్ డ్యూ' యాడ్ షూట్ (Mountain Dew Ad)లా ఉందని సెటైర్లు వేస్తున్నారు. డ్యూ యాడ్స్‌లో వాడే "భయం ముందు గెలుపు ఉంది" అనే డైలాగులను జోడిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

రామాయణంతో లింక్.. 2027లో భారీ విడుదల

రామాయణంతో అనుసంధానమైన టైమ్-ట్రావెల్ అడ్వెంచర్ డ్రామాగా 'వారణాసి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రపంచం అంతమయ్యే ప్రమాదం ఉన్న ఒక ప్రాచీన వస్తువును కాపాడేందుకు ప్రపంచమంతటా ప్రయాణించే 'రుద్ర' అనే సాహసికుడిగా మహేశ్ బాబు కనిపించనున్నారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో

వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా చేస్తున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న వారణాసి చిత్రం 2027 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More