అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ సినిమాలను వెనక్కి నెట్టేసిన చిరంజీవి- మన శంకర వరప్రసాద్ గారు 2 డేస్ కలెక్షన్స్ ఇవే!
రెండేళ్ల విరామం తర్వాత వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి సందడి మొదలైంది. చిరు తాజా చిత్రం 'మన శంకర వరాప్రసాద్ గారు' తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 65.75 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ సినిమాలను వెనక్కి నెట్టేసింది చిరంజీవి మూవీ.
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఫామ్లోకి వచ్చారు. సుమారు రెండేళ్ల నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి అడుగుపెట్టిన చిరంజీవి తన మార్కు బాక్సాఫీస్ పవర్తో అభిమానులను అలరిస్తున్నారు.

రికార్డ్ స్థాయి వసూళ్లతో
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకర వరాప్రసాద్ గారు' చిత్రానికి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, 'వింటేజ్ చిరంజీవి'ని చూడాలనుకున్న ఫ్యాన్స్ మాత్రం థియేటర్లకు క్యూ కడుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.
చిరంజీవి కెరీర్లోనే మన శంకర వరప్రసాద్ గారు రెండో అతిపెద్ద ఓపెనింగ్ కావడం విశేషం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం తొలి రోజే భారత్లో రూ. 28.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
పెయిడ్ ప్రీవ్యూలతో
ఆదివారం (జనవరి 11) జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా వచ్చిన రూ. 8.75 కోట్లను కలిపితే, దేశీయంగా తొలి రోజు మొత్తం రూ. 37.50 కోట్ల నెట్ (రూ. 44.75 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ నమోదయ్యాయి. ఓవర్సీస్లో కూడా మెగాస్టార్ హవా నడుస్తోంది, అక్కడ సుమారు 2.3 మిలియన్ డాలర్ల వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది.
మొత్తంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ. 65.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. చిరంజీవి కెరీర్లో 2019 నాటి 'సైరా నరసింహారెడ్డి' (రూ.85 కోట్లు) తర్వాత ఇదే అత్యుత్తమ వసూళ్లు కావడం విశేషం.
మేనల్లుడి రికార్డు బ్రేక్!
అయితే, వరల్డ్ వైడ్గా తొలి రోజు మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు రూ. 84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది. ఈ లెక్కన చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప 2 ది రైజ్ తొలి రోజు కలెక్షన్స్ (రూ. 62.50 కోట్లు)ను మన శంకర వరప్రసాద్ సినిమా బీట్ చేసినట్లు తెలుస్తోంది.
అలాగే, చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' (రూ. 57.80 కోట్లు) కలెక్షన్స్ను కూడా నెట్టేసింది ఈ మూవీ. ఇక హిందీలో సూపర్ హిట్ మూవీ అయిన 'గదర్ 2' (రూ. 53.20 కోట్లు) వసూళ్లను సైతం చిరంజీవి మూవీ బ్రేక్ చేసేసింది.
ప్రభాస్ సినిమా తగ్గడంతో
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రమే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రభాస్ 'ది రాజా సాబ్' వసూళ్లు భారీ ఓపెనింగ్ తర్వాత నెమ్మదించడంతో ఇప్పుడు అందరి దృష్టి చిరంజీవి సినిమాపైనే ఉంది.
ఇక రెండో రోజున మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ఇండియాలో రూ. 15.56 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ పేర్కొంది. దీంతో భారతదేశంలో 2 రోజుల్లో చిరంజీవి సినిమాకు రూ. 53.06 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

E-Paper












