Rachana Banerjee: వేశ్యల ఇళ్లల్లో మాట్లాడే పదాల కంటే ఘోరంగా ఉన్నాయి: తెలుగు సీనియర్ హీరోయిన్ రచనా బెనర్జీ ఘాటు కామెంట్స్

Rachana Banerjee Fires On Kalyan Banerjee: తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న రచనా బెనర్జీ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై రచనా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తీరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Published on: Jun 29, 2026, 11:00:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rachana Banerjee Fires On Kalyan Banerjee: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం 'బావగారు బాగున్నారా' సినిమా గుర్తుందిగా? అందులో సెకండ్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి రచనా బెనర్జీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారారు.

వేశ్యల ఇళ్లల్లో మాట్లాడే పదాల కంటే ఘోరంగా ఉన్నాయి: తెలుగు సీనియర్ హీరోయిన్ రచనా బెనర్జీ ఘాటు కామెంట్స్
వేశ్యల ఇళ్లల్లో మాట్లాడే పదాల కంటే ఘోరంగా ఉన్నాయి: తెలుగు సీనియర్ హీరోయిన్ రచనా బెనర్జీ ఘాటు కామెంట్స్

రెడ్ లైట్ ఏరియా సంబాషణల కంటే

టీవీ9 బంగ్లాకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో రచనా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మరిచి ఆయన మాట్లాడే తీరు, వాడే పదజాలం కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియా (యౌనపల్లి) సంభాషణల కంటే ఘోరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. కేవలం ఆయన భాషనే కాకుండా, ఆయన రాజకీయ వైఫల్యాలను కూడా బహిరంగంగా ఎండగట్టారు.

నా నియోజకవర్గంలో నీ పెత్తనమేంటి?

శ్రీరాంపూర్ ఎంపీ అయిన కల్యాణ్ బెనర్జీ.. హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గ వ్యవహారాల్లో పదే పదే జోక్యం చేసుకోవడంపై రచనా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు హుగ్లీ భూగోళం తెలియదంటూ కల్యాణ్ చేసిన వెటకారపు వ్యాఖ్యలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

"హుగ్లీ జాగ్రఫీ గురించి మీకే అంత బాగా తెలిసి ఉంటే, మొన్నటి ఎన్నికల్లో ఉత్తరపారా అసెంబ్లీ స్థానం నుంచి మీ సొంత కొడుకును ఎందుకు గెలిపించుకోలేకపోయారు దాదా?" అని రచనా బెనర్జీ నిలదీశారు.

సాధారణ రాజకీయ నాయకుల్లా కల్యాణ్ బెనర్జీ విమర్శలను ఆమె తేలికగా తీసుకోలేదు. ఆయన సొంత ఇల్లే గెలవలేదన్న చేదు నిజం గుర్తు చేస్తూ కల్యాణ్‌ను రాజకీయంగా డిఫెన్స్‌లో పడేశారు. తన ప్రాంతాన్ని వదిలేసి పక్క నియోజకవర్గాలపై పడి ఏడవడం మానుకోవాలని హితవు పలికారు.

మహిళలను అవమానించే నీచ సంస్కృతి

పార్లమెంట్ లోపల మహిళా ప్రజాప్రతినిధులను కల్యాణ్ బెనర్జీ అవమానించే తీరు అత్యంత సిగ్గుచేటని రచనా బెనర్జీ ఆరోపించారు. గతంలో టీఎంసీకే చెందిన మరో ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రాపై కల్యాణ్ చేసిన పాత వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

"సీనియర్ ఎంపీ స్థానంలో ఉండి పార్లమెంట్‌లో మహువా మోయిత్రాపై ఆయన ఏ భాష వాడారో దేశమంతా చూసింది. ఉత్తర కోల్‌కతాలోని వేశ్యల ఇళ్లల్లో అనాగరికులు వాడే నీచమైన పదాలను ఆయన పార్లమెంట్ సాక్షిగా అరుస్తూ ఉపయోగించారు" అని రచనా బెనర్జీ మండిపడ్డారు.

ఇదే సమయంలో మహువా మోయిత్రా ద్వంద నీతిని కూడా రచనా వదిలిపెట్టలేదు. గతంలో తనను అంతలా అవమానించిన వ్యక్తితోనే ఈరోజు మహువా కేవలం పదవుల కోసం, అధికారం కోసం ఒకే కారులో ప్రయాణిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పసలేని రాజకీయం చేస్తున్న వీరిద్దరి నైతికతను తీవ్రంగా తప్పుపట్టారు.

ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా!

తృణమూల్ కాంగ్రెస్‌తో విభేదాల తర్వాత రచనా బెనర్జీ బెంగాలీ బుల్లితెరపై అత్యంత పాపులర్ అయిన 'దీదీ నెంబర్ 1' రియాలిటీ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రజాదరణ తగ్గిపోయిందంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకే ఆమె ఇంత ఘాటుగా స్పందించినట్లు స్పష్టమవుతోంది.

రాజకీయాల్లో తానెవరికీ తలవంచే ప్రసక్తే లేదని, సినిమా గ్లామర్ పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలోనే తన సత్తా ఏంటో చూపిస్తానని రచనా బెనర్జీ సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే, రచనా బెనర్జీ తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

రచనా బెనర్జీ తెలుగు సినిమాలు

బావగారు బాగున్నారా, శ్రీకాంత్-ఉపేంద్రల కన్యాదానం, జగపతి బాబు మావిడాకులు, నేను ప్రేమిస్తున్నాను, రాయుడు, పిల్లా నచ్చింది, నీతోనే ఉంటాను, ఎస్వీ కృష్ణారెడ్డి అభిషేకం వంటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు రచనా బెనర్జీ.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More