Fatty liver : భారతీయుల్లో అధికంగా ఫ్యాటీ లివర్ సమస్య- ఈ 7 పండ్లతో చెక్!

ఫ్యాటీ లీవర్ సమస్యతో బాధపడేవారు ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన పండ్లను చేర్చుకోవడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో 7 పండ్లు తీసుకుంటే సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. అవి..

Updated on: Aug 25, 2026, 07:29:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆధునిక జీవనశైలి కారణంగా కాలేయ సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాటీ లీవర్ సమస్య నేడు ఎంతోమందిని వేధిస్తోంది. అయితే సరైన ఆహారపు అలవాట్లతో ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎలాంటి పండ్లు తీసుకోవాలనే అంశంపై ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు.

ఫ్యాటీ లీవర్ సమస్యకు చెక్ పెట్టే 7 అద్భుతమైన పండ్లు (Adobe Stock)
ఫ్యాటీ లీవర్ సమస్యకు చెక్ పెట్టే 7 అద్భుతమైన పండ్లు (Adobe Stock)

"ఫ్యాటీ లీవర్ కోసం అత్యుత్తమమైన 7 పండ్లు ఇవే. నేను లీవర్ స్పెషలిస్ట్ ని, కాబట్టి ఫాలో బటన్ నొక్కండి," అంటూ డాక్టర్ సేథ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే ఈ పండ్లు కాలేయ ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు.

యాపిల్..

యాపిల్‌లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని డాక్టర్ సేథ్ వెల్లడించారు. యాపిల్‌ను కొద్దిపాటి నట్స్‌తో కలిపి తింటే మంచి స్నాక్ ఆప్షన్ అవుతుందని ఆయన తెలిపారు. "యాపిల్ నిండా పెక్టిన్ ఉంటుంది. నేను యాపిల్‌ను కొన్ని నట్స్‌తో కలిపి తినడానికి ఇష్టపడతాను," అని ఆయన పేర్కొన్నారు.

కివి..

మలబద్ధకంతో బాధపడేవారికి కివి పండు చాలా మేలు చేస్తుందని డాక్టర్ సేథ్ సూచించారు. "మీకు మలబద్ధక సమస్య ఉంటే రోజుకు రెండు కివి పండ్లు తినండి. అంతేకాదు, దీని తొక్క కూడా తినదగినదే" అని ఆయన చెప్పారు. కివిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని, సరిగ్గా కడిగిన తర్వాత తొక్కతో సహా తినవచ్చని తెలిపారు. అయితే కివి పట్ల అలర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.

రాస్ బెర్రీస్..

ఫైబర్ అధికంగా ఉండే ఈ పండ్లను రోజూ తీసుకోవడం చాలా సులభం. వీటిని పెరుగు లేదా ఓట్ మీల్‌లో కలుపుకోవచ్చని డాక్టర్ సేథ్ సలహా ఇచ్చారు. "వీటిని సాధారణ గ్రీక్ యోగర్ట్ లేదా ఓట్ మీల్‌లో కలుపుకోండి" అని ఆయన సూచించారు. ఎలాంటి అదనపు పంచదార లేకుండానే ఇవి ఆహారానికి సహజమైన తీపిదనాన్ని, ఫైబర్‌ను అందిస్తాయి.

బ్లూ బెర్రీస్..

తాజా పండ్లు దొరకని సమయంలో ఫ్రోజెన్ బ్లూ బెర్రీస్ మంచి ప్రత్యామ్నాయమని డాక్టర్ సేథ్ తెలిపారు. "ఫ్రోజెన్ బ్లూ బెర్రీస్ తాజా పండ్ల వలె పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి," అని ఆయన పేర్కొన్నారు. వీటిని పెరుగు, ఓట్ మీల్ లేదా స్మూతీస్‌లో సులభంగా భాగం చేసుకోవచ్చు.

బేరి పండ్లు (పియర్స్)

బేరి పండ్లలో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీటిని తొక్కతో సహా తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని డాక్టర్ సేథ్ చెప్పారు. "గరిష్టంగా ఫైబర్ అందాలంటే వీటిని తొక్కతో సహా తినండి" అని ఆయన సూచించారు. అయితే తినే ముందు పండ్లను శుభ్రంగా కడగడం మాత్రం మరచిపోకూడదు.

అవకాడో..

ఇందులో ఆరోగ్యకరమైన అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా, చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. వెన్న లేదా క్రీమ్ చీజ్‌కు బదులుగా బ్రెడ్‌పై అవకాడోను స్ప్రెడ్ లాగా వాడొచ్చని డాక్టర్ సేథ్ తెలిపారు. "వెన్న లేదా క్రీమ్ చీజ్‌కు బదులుగా హోల్ గ్రైన్ టోస్ట్ పై అవకాడోను రాయండి" అని ఆయన పేర్కొన్నారు. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.

దానిమ్మ గింజలు..

చివరిగా దానిమ్మ గింజలను ఆయన తన జాబితాలో చేర్చారు. వీటిని సలాడ్స్‌లో చల్లుకోవడానికి తాను ఇష్టపడతానని డాక్టర్ సేథ్ తెలిపారు. "నేను వీటిని నా సలాడ్స్‌పై చల్లుకోవడానికి ఇష్టపడతాను" అని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల భోజనంలో రుచితో పాటు పోషకాలు కూడా పెరుగుతాయి.

కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ సౌరభ్ సేథ్ ఎండీ, ఎంపీహెచ్, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్- హెపాటాలజిస్ట్. ఆయన ఎయిమ్స్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి, టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంపీహెచ్ పట్టా పొందారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More