Jagamae Sangeetham Review: జగమే సంగీతం రివ్యూ- ఇవాళ ఓటీటీలోకి వచ్చిన ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ మ్యూజికల్ సిరీస్ ఎలా ఉందంటే?

Jagamae Sangeetham Review And Rating In Telugu: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మ్యూజికల్ వెబ్ సిరీస్ జగమే సంగీతం. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ నటించిన జగమే సంగీతం అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. శాస్త్రీయ సంగీతం, పాప్ ఫ్యూజన్ మధ్య నడిచే ఈ సిరీస్ ఎలా ఉందో నేటి జగమే సంగీతం రివ్యూలో చూద్దాం.

Published on: Sep 4, 2026, 13:20:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Series Jagamae Sangeetham Review In Telugu And Rating: ఓటీటీలో మంచి ఆదరణ పొందిన వెబ్ సిరీస్ 'బండిష్ బ్యాండిట్స్'. ఈ ఓటీటీ సిరీస్ ఆధారంగా రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ 'జగమే సంగీతం'.

జగమే సంగీతం రివ్యూ- ఇవాళ ఓటీటీలోకి వచ్చిన ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ మ్యూజికల్ సిరీస్ ఎలా ఉందంటే?
జగమే సంగీతం రివ్యూ- ఇవాళ ఓటీటీలోకి వచ్చిన ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ మ్యూజికల్ సిరీస్ ఎలా ఉందంటే?

ఓటీటీలోకి వచ్చేసిన జగమే సంగీతం

ఇవాళ (సెప్టెంబర్ 4) జగమే సంగీతం ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తోంది. తెలుగు మ్యూజికల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన జగమే సంగీతం సిరీస్‌కు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మెయిన్ లీడ్స్‌గా చేశారు. వీరితోపాటు సీనియర్ హీరోయిన్ మధుబాల, అక్షయ్ లాగుసాని, సుస్మితా శెట్టి కీలక పాత్రలు పోషించారు.

జగమే సంగీతం ఓటీటీ రివ్యూ

నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో జగమే సంగీతం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ మూలంలో హిందూస్తానీ సంగీతం నేపథ్యంగా ఉంటే, తెలుగులోకి వచ్చేసరికి దాన్ని మన దక్షిణాది సాంప్రదాయ కర్ణాటక సంగీతానికి అనుగుణంగా మలిచారు. మరి ఈ ఓటీటీ సిరీస్ ఎలా ఉందో నేటి జగమే సంగీతం రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

వైకుంఠపురం అనే ప్రాంతంలో ఈ సిరీస్ కథ మొదలవుతుంది. కర్ణాటక సంగీత దిగ్గజం శాస్త్రి (ప్రకాష్ రాజ్) మనవడు బాలు (అక్షయ్ లాగుసాని). తాతయ్య సంగీత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే తపన అతనిది. శాస్త్రికి కళ పట్ల అమితమైన నిష్ఠ ఉంది. సంగీతాన్ని వ్యాపారంగా మార్చడం ఆయనకు అస్సలు నచ్చదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని ఆయన వరకు రానివ్వరు.

మరోవైపు పల్లవి (సుస్మితా శెట్టి) డిజిటల్ యుగాన్ని పుణికిపుచ్చుకున్న యువతి. ఆటో ట్యూన్లు, సోషల్ మీడియా రీల్స్ ద్వారా పాపులర్ అవ్వడమే ఆమె లక్ష్యం. ఒకరిది ప్యూర్ క్లాసికల్ బాట అయితే, మరొకరిది క్లిక్స్ అండ్ వ్యూస్ బాట.

అదే సమయంలో శాస్త్రి సంగీత సామ్రాజ్యాన్ని సవాలు చేస్తూ త్యాగరాజు (శ్రీకాంత్ మేకా) రంగప్రవేశం చేస్తాడు. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన భారం బాలు భుజస్కంధాలపై పడుతుంది. ఆ తర్వాత ఏమైంది? బాలు, పల్లవి వంటి ఇద్దరు భిన్నమైన వ్యక్తులు కలిసినప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? శాస్త్రికి త్యాగరాజు విసిరిన సవాల్ ఏంటీ? తాత గౌరవాన్ని బాలు కాపాడాడ? చివరికి ఏమైంది? అనేదే ఈ ఓటీటీ సిరీస్ కథ.

విశ్లేషణ:

మన తెలుగు సినిమాకు సంగీత నేపథ్య కథలతో గొప్ప అనుబంధం ఉంది. కళాతపస్వి కె. విశ్వనాథ్ అందించిన 'శంకరాభరణం', 'సాగరసంగమం', 'రుద్రవీణ', 'స్వర్ణకమలం' వంటి కావ్యాలు మన ప్రేక్షకుడి గుండెల్లో పదిలంగా ఉన్నాయి.

'శంకరాభరణం'లో శంకరశాస్త్రి పాశ్చాత్య సంగీతాన్ని గౌరవిస్తూనే, శాస్త్రీయ సంగీత విశిష్టతను చాటిచెప్పే ఘట్టాలు ఈ సిరీస్‌ను చూస్తున్నప్పుడు దర్శనిమిస్తాయి. నటన పరంగా ప్రకాష్ రాజ్ తన అనుభవాన్ని మరోసారి చూపించారు. కఠిన క్రమశిక్షణ కలిగిన పితృస్వామ్య పెద్దగా ఆయన పాత్ర ఒదిగిపోయింది.

తల్లిగా మధుబాల కనిపించే సన్నివేశాలు ఇంట్లో మన అమ్మలను గుర్తుచేస్తాయి. పురుషాధిక్య కుటుంబంలో నలిగిపోతూనే ఇటు కుటుంబ బాధ్యతలను మోసే పాత్రలో ఆమె ప్రతిభ కనిపిస్తుంది. అక్షయ్, సుస్మిత తమ పాత్రలు బాగా ఆకట్టుకుంటాయి. ఎవరి ప్రపంచానికి తగినట్లుగా వారి హావాభావాలు మెప్పించేలా ఉన్నాయి. శ్రీకాంత్ ఆకట్టుకున్నారు.

క్లాసిక్ డ్రామాలో కొరవడిన బిగువు

అయితే, సంగీత ప్రధానమైన కథకు ప్రధాన బలం స్వరాలే కావాలి. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం వినడానికి బాగున్నప్పటికీ, సన్నివేశాలకు కావాల్సిన తీవ్రతను పూర్తిగా అందించలేకపోయింది. కథలో శ్రీకాంత్ పాత్ర ప్రవేశించే వరకు గ్రాఫ్ కాస్త మందకొడిగానే సాగుతుంది.

కథానాయకుడు బాలు తన గుర్తింపును దాచిపెట్టి వైరల్ పాటలు చేయడానికి పడే తపన కొన్నిచోట్ల నమ్మశక్యంగా అనిపించదు. చివరి ఎపిసోడ్‌లో వచ్చే జుగల్బందీ కచేరీ ఆకట్టుకున్నప్పటికీ, ముగింపు ముందే ఊహించగలిగేలా ఉంటుంది. 80ల నాటి సంగీత చిత్రాల్లో ఉండే ఎమోషనల్ డెప్త్ 2026 నాటి ఈ డిజిటల్ సిరీస్‌లో కాస్త తగ్గిందనే చెప్పాలి.

వీకెండ్‌కి ఓటీటీలో చూసేందుకు

శాస్త్రీయ సంగీతాన్ని, నేటితరం ఆలోచనలను ముడిపెడుతూ తీసిన ఈ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. అయితే, కథనంలో మరింత బలంగా ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఫైనల్‌గా చెప్పాలంటే వీకెండ్‌లో ప్రశాంతంగా ఓటీటీలో చూడటానికి జగమే సంగీతం సిరీస్ ఒక మంచి ఆప్షన్.

రేటింగ్: 2.5/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More