Vitamin D supplements : విటమిన్ డీ సప్లిమెంట్లు ఎప్పుడు తీసుకోవాలి? ఈ తప్పులు చేస్తే ఫలితం ఉండదు!
విటమిన్ డీ సప్లిమెంట్లను ఏ సమయంలో, ఏ ఆహారంతో, ఏ పానీయంతో కలిపి తీసుకోవాలి? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ డీని ఎలా తీసుకోవాలో వైద్యులు సూచించారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మన శరీరంలో ఎముకల బలం పెరగడానికి, కాల్షియం సరిగ్గా అబ్సార్బ్ అవ్వడానికి, రోగనిరోధక శక్తి సక్రమంగా పనిచేయడానికి విటమిన్ డీ అత్యంత కీలక. సూర్యకాంతి చర్మంపై పడినప్పుడు శరీరం స్వయంగా విటమిన్ డీని తయారు చేసుకుంటుంది. అయినప్పటికీ, చాలా మందిలో దీని లోపం సాధారణంగా కనిపిస్తుండటంతో వైద్యులు సప్లిమెంట్లను ఎక్కువగా సిఫార్సు చేస్తుంటారు. అయితే కేవలం సప్లిమెంట్లు వేసుకోవడం మాత్రమే సరిపోదు.. వాటిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలనే దానిపైనే మీ శరీరం వాటిని ఎంతవరకు గ్రహిస్తుంది అనేది ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా?

దిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్లో శిక్షణ పొందిన జనరల్ ఫిజీషియన్, న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ విటమిన్ డీ సప్లిమెంట్ల నుంచి గరిష్ట ప్రయోజనాలను పొందే అత్యుత్తమ మార్గాలను వివరించారు. ఆగస్టు 20న ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో, ఈ సప్లిమెంట్లను ఏ సమయంలో తీసుకోవాలి, ఏ పోషకాలతో కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి అనే అంశాలను ఆమె స్పష్టంగా తెలిపారు.
విటమిన్ డీ సప్లిమెంట్ల రకాలు..
విటమిన్ డీ అనేది కొవ్వులో కరిగే (ఫ్యాట్-సొల్యూబుల్) పోషకం. మార్కెట్లో విటమిన్ డీ సప్లిమెంట్లు వివిధ రూపాల్లో విస్తృతంగా లభిస్తున్నాయి. ఇది కొవ్వులో కరిగే గుణం కలిగి ఉండటం వల్ల, డైటరీ ఫ్యాట్ (ఆహారంలోని కొవ్వు) తో కలిసి తీసుకున్నప్పుడు దీని అబ్సార్ప్షన్ చాలా మెరుగ్గా ఉంటుంది.
ఈ అంశంపై డాక్టర్ సెహ్రావత్ మాట్లాడుతూ.. "విటమిన్ డీ సప్లిమెంట్లు క్యాప్సూల్స్, వయిల్స్, సిరప్ రూపంలో, నీటిలో కరిగించి తాగే పౌడర్ రూపంలోని సాచెట్స్గా అందుబాటులో ఉన్నాయి. విటమిన్ డీ అనేది కొవ్వులో కరిగే విటమిన్ కావడం వల్ల, మన జీర్ణశయాం (గట్), పేగులలో కొవ్వు పదార్థాలు ఉన్నప్పుడు దీని శోషణ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది," అని పేర్కొన్నారు.
విటమిన్ డీ తీసుకోవడానికి సరైన సమయం ఏది?
రోజూ ఏ సమయంలో భోజనం చేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, మీ రోజులో అతిపెద్ద భోజనం (హెవీ మీల్)తో పాటు విటమిన్ డీ సప్లిమెంట్ తీసుకోవాలని డాక్టర్ సెహ్రావత్ రోగులకు సలహా ఇస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ భోజనంలో ఆరోగ్యకరమైన కొవ్వు మూలం ఉండాలి. ఇది కొవ్వులో కరిగే ఈ విటమిన్ అబ్సార్ప్షన్ మరింత మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి మీరు ఉదయం పూట మంచి అల్పాహారం తీసుకున్నా, లేదా మధ్యాహ్నం అన్నం, పెరుగు, కూరలతో కూడిన సంపూర్ణ భోజనం (కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండేది) తీసుకున్నా.. ఆ సమయంలో విటమిన్ డీ సప్లిమెంట్ తీసుకోవడం చాలా అనువైన సమయం.
ఈ విషయమై ఆమె మరింత స్పష్టంచేస్తూ.. "రోజూ ఏ సమయంలో అయితే మీరు పొట్ట నిండా భారీగా తింటారో, ఆ అతిపెద్ద భోజనంతో పాటే దీన్ని తీసుకోవాలని నేను నా రోగులకు చెబుతుంటాను. ఉదయం పూట బలమైన అల్పాహారం తీసుకునేవారైనా, లేదా మధ్యాహ్నం సమయాల్లో అన్నం, పెరుగు, కూరలతో కూడిన మంచి భోజనం చేసేవారైనా సరే.. ఆ రోజులో మీ ప్రధాన భోజనంతో పాటు విటమిన్ డీ తీసుకోవడం మంచిది," అని వివరించారు.
విటమిన్ డీ సప్లిమెంట్లను దేనితో తీసుకోవాలి?
మీరు విటమిన్ డీ క్యాప్సూల్స్ లేదా సిరప్లను భోజనంతో పాటు నేరుగా తీసుకోవచ్చు. కానీ పౌడర్ రూపంలో ఉండే సాచెట్ల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. వాటిని ఏదో ఒక ద్రవ పదార్థంలో కరిగించి తీసుకోవాల్సి ఉంటుంది. నీరు అనేది అందరికీ తట్టే సాధారణ ఎంపిక అయినప్పటికీ, డాక్టర్ సెహ్రావత్ మాత్రం నీటికి బదులుగా పాలను ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. పాలలో విటమిన్ డీ అబ్సార్ప్షన్కు తోడ్పడే పోషకాలు ఉండటమే కాకుండా, అవి ఆరోగ్యకరమైన కొవ్వును, కాల్షియంను కూడా అందిస్తాయి.
ఈ అంశంపై ఆమె వివరిస్తూ.. "మీరు సాచెట్ రూపంలో పౌడర్ విటమిన్ డీ తీసుకుంటున్నట్లయితే.. దాన్ని నీటిలో కాకుండా పాలలో కలుపుకుని తీసుకోండి. ఎందుకు? మొదటిగా, పాలు ఆరోగ్యకరమైన కొవ్వుకు మంచి మూలం. రెండవది, పాలలో కాల్షియం ఉంటుంది. కాల్షియం, విటమిన్ డీ అనేవి ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి. మన శరీరంలో విటమిన్ డీ తగిన మోతాదులో ఉంటేనే, అది కాల్షియాన్ని ఎముకల్లోకి గ్రహించేలా సహాయపడుతుంది. అలాగే కాల్షియం సరిగ్గా ఉంటే, పేగుల నుంచి రక్తనాళాల్లోకి విటమిన్ డీ అబ్సార్ప్షన్ కూడా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి పౌడర్ సాచెట్లను పాలలో కరిగించి తీసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం. అంతేకాకుండా, రోజులో మీ ప్రధాన భోజనం ముగిసిన తర్వాతే ఏ రకమైన విటమిన్ డీ సప్లిమెంట్నైనా తీసుకోవడం చాలా మంచిది," అని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


