Weight Loss Tips : బరువు ఎప్పుడు చూసుకోవాలి? ఏ టైమ్​లో చూసుకోకూడదు? రెండింటికి తేడా ఏంటి?

When to check weight : బరువు తగ్గే క్రమంలో బరువు చూసుకునే మిషన్‌తో చాలా మందికి వింత బంధం ఉంటుంది. అయితే, రోజులో కొన్ని సమయాల్లో బరువు చూసుకోవడం వల్ల తప్పుడు ఫలితాలు వస్తాయని, అది మానసిక ఒత్తిడికి దారితీస్తుందని ఫిట్‌నెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published on: Jun 13, 2026, 07:28:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Best Time To Check Weight : బరువు తగ్గాలని ప్రయత్నించే చాలా మందికి వేయింగ్ స్కేల్ (బరువు చూసుకునే మిషన్)తో ఒక వింతైన బంధం ఉంటుంది! ఒకరోజు బరువు తగ్గినట్లు కనిపిస్తే ఎంతో ఉత్సాహం వస్తుంది. అదే మరుసటి రోజు కాస్త పెరిగినట్లు చూపించగానే, తాము పడుతున్న కష్టమంతా వృథా అయిపోయిందనే తీవ్ర నిరాశలోకి జారుకుంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అసలు విషయం ఒకటి ఉంది. మన శరీర బరువు అనేది రోజంతా సహజంగానే మారుతూ ఉంటుంది. మిషన్ మీద నంబర్ పెరిగిన ప్రతిసారీ శరీరంలో కొవ్వు పెరిగిపోయిందని భావించడం పూర్తిగా అపోహ మాత్రమే.

బరువు ఎప్పుడు చూసుకోవాలి?
బరువు ఎప్పుడు చూసుకోవాలి?

మనం తినే ఆహారం, తాగే నీరు, హార్మోన్ల మార్పులు, తీసుకునే ఉప్పు మోతాదు, వర్కౌట్లు, సమయం.. ఇలా అనేక అంశాలు మన శరీర బరువును ప్రభావితం చేస్తాయి. అందుకే ఒక్కసారి చూసుకునే బరువు మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని పూర్తిగా ప్రతిబింబించలేదని వైద్య నిపుణులు చెప్తుంటారు. ఒకే ఒక్క నంబర్ కంటే, మనం క్రమం తప్పకుండా పాటించే అలవాట్లే ఇక్కడ ముఖ్యం అని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే, ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ రిచా వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నారు. మన శరీర బరువును చూసుకోవడానికి అస్సలు పనికిరాని కొన్ని అధ్వాన్నమైన సమయాల గురించి, ఆయా సమయాల్లో బరువు ఎందుకు తప్పుగా చూపిస్తుందో ఆమె క్లియర్​గా వివరించారు.

బరువు చూసుకోకూడని ఆ 7 సందర్భాలు ఇవే..

ఆహారం తిన్న వెంటనే లేదా నీళ్లు తాగిన తర్వాత: మనం తిన్న ఆహారం, తాగిన నీరు పొట్టలో అలాగే ఉండటం వల్ల ఆ బరువు తక్షణమే మిషన్ మీద కనిపిస్తుంది. ఇది శరీరంలో పెరిగిన కొవ్వు కాదు, కేవలం తాత్కాలిక బరువు మాత్రమేనని ఫిట్‌నెస్ కోచ్ పేర్కొన్నారు.

పీరియడ్స్ సమయంలో (మహిళల్లో): నెలసరి సమయంలో మహిళల శరీరంలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా జరుగుతాయి. దీనివల్ల శరీరం ఉబ్బినట్లు అవ్వడం, నీటి శాతాన్ని ఎక్కువగా పట్టి ఉంచడం జరుగుతుంది. ఫలితంగా ఆ కొన్ని రోజులు బరువు ఎక్కువగా చూపించడం చాలా సాధారణం.

మద్యం సేవించిన తర్వాత: ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో హైడ్రేషన్ స్థాయిలు దెబ్బతింటాయి. దీనివల్ల బరువు తాత్కాలికంగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఎలా చూసినా ఇది మీ శరీర అసలు కొవ్వు శాతాన్ని చూపించదు.

వ్యాయామం చేసిన వెంటనే: వర్కవుట్ చేసినప్పుడు విపరీతంగా చెమట పట్టడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీనివల్ల వేయింగ్ మిషన్ మీద బరువు తగ్గినట్లు చూపిస్తుంది. అంతమాత్రాన అంత కొవ్వు కరిగిపోయిందని సంబరపడలేం.

రోజులో ఏ సమయ పట్టిక లేకుండా: ఉదయం నుంచి రాత్రి వరకు మనం తీసుకునే ఆహారం, ద్రవపదార్థాలు, శారీరక కదలికలు, ఉప్పు ఆధారంగా బరువు నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి రోజులో ఎప్పుడు పడితే అప్పుడు బరువు చూడటం కరెక్ట్ కాదు.

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తిన్నాక: పిజ్జా, చిప్స్ లేదా ఉప్పు ఎక్కువగా ఉండే ఇతర జంక్ ఫుడ్స్ తిన్నప్పుడు, మన శరీరం అదనపు నీటిని నిల్వ చేసుకుంటుంది. దీనివల్ల మిషన్ మీద బరువు తాత్కాలికంగా పెరుగుతుంది.

చీట్ మీల్ లేదా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకున్న మరుసటి రోజు: కార్బోహైడ్రేట్లు మన కండరాలలో నీటిని నిల్వ చేస్తాయి. దీనివల్ల శరీరంలో ఎలాంటి కొవ్వు పెరగకపోయినా, ఒకటి లేదా రెండు రోజుల పాటు బరువు ఎక్కువగా చూపిస్తుంది.

వీటితో పాటు మనం వేసుకునే బరువైన బట్టలు, షూస్, జాకెట్లు కూడా బరువును అదనంగా చూపిస్తాయని, ఇవి కూడా రీడింగ్ మారడానికి కారణమవుతాయని రిచా గుర్తుచేశారు.

మరి బరువు చూసుకోవడానికి సరైన సమయం ఏది?

శరీర అసలైన బరువును తెలుసుకోవడానికి ఉదయం పూట, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత.. ఎలాంటి ఆహారం లేదా నీరు తీసుకోకముందే బరువు చూసుకోవడం అత్యంత ఉత్తమమైన సమయమని ఫిట్‌నెస్ కోచ్ వివరించారు. అన్నింటికంటే ముఖ్యంగా, ప్రతిసారీ ఇదే పద్ధతిని (రొటీన్) అనుసరించాలి. వారంలో ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా, ఒకే సమయానికి క్రమం తప్పకుండా ట్రాక్ చేయడం వల్ల మాత్రమే మీ వెయిట్ లాస్ ప్రోగ్రెస్ పై స్పష్టమైన అవగాహన వస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More