Charlapalli Gorakhpur Amrit Bharat Express : హైదరాబాద్ జంట నగరాల ప్రయాణికులకు, ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. చర్లపల్లి నుంచి గోరఖ్పూర్ మధ్య నడిచే నూతన ‘అమృత్ భారత్ ఎక్స్ప్రెస్’ వీక్లీ రైలును ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. జంట నగరాల నుంచి ప్రారంభమయ్యే 6వ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్గా, తెలంగాణ మీదుగ ప్రయాణించే 7వ అమృత్ భారత్ రైలుగా ఇది నిలవనుంది. ఈ కొత్త రైలు సర్వీసు అక్టోబర్ 2, 2026 నుంచి అధికారికంగా పట్టాలు ఎక్కనుంది.
ప్రయాణ వేళలు - సర్వీసు రోజులు
- చర్లపల్లి - గోరఖ్పూర్ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెం. 22075) : ఈ రైలు ప్రతి వారం శుక్రవారం రాత్రి 9:45 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల మీదుగా ప్రయాణించి, ఆదివారం ఉదయం 6:25 గంటలకు గోరఖ్పూర్ జంక్షన్ చేరుకుంటుంది. ఈ రెగ్యులర్ సర్వీసు 2026 అక్టోబర్ 2 శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తుంది.
- గోరఖ్పూర్ - చర్లపల్లి అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెం. 22076) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి వారం ఆదివారం ఉదయం 8:30 గంటలకు గోరఖ్పూర్ నుంచి బయలుదేరి…. సోమవారం సాయంత్రం 5:00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ సర్వీసు 2026 అక్టోబర్ 4 ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది.

ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రెండు వైపులా ప్రయాణించేటప్పుడు అనేక ముఖ్యమైన రైల్వే జంక్షన్లలో ఆగుతుంది.
• తెలంగాణ పరిధిలో : చర్లపల్లి, కాజీపేట జంక్షన్, పెద్దపల్లి, మంచిర్యాల.
• మహారాష్ట్ర పరిధిలో : బల్హార్షా, చంద్రపూర్, నాగపూర్ జంక్షన్.
• మధ్యప్రదేశ్ పరిధిలో : బేతుల్, ఇటార్సీ జంక్షన్, భోపాల్ జంక్షన్, బీనా జంక్షన్.
• ఉత్తరప్రదేశ్ పరిధిలో : వి.జి.ఎల్ ఝాన్సీ జంక్షన్, ఒరాయ్, పోఖ్రయాన్, కాన్పూర్ సెంట్రల్, ఐష్బాగ్, లక్నో సిటీ, గోమతీ నగర్, బారాబంకి జంక్షన్, గోండా జంక్షన్, గోరఖ్పూర్ జంక్షన్.
సాధారణ, మధ్యతరగతి ప్రయాణికులకు అత్యంత తక్కువ ఖర్చుతో ఆధునిక వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. ఈ అమృత్ భారత్ రైలులో స్లీపర్ క్లాస్, అన్రిజర్వ్డ్ బోగీలు మాత్రమే ఉంటాయి. ఆధునిక నెట్వర్క్ కనెక్టివిటీ, మెరుగైన సీటింగ్, పుష్-పుల్ సాంకేతికతతో ఈ రైలు సాగనుంది. ఉపాధి, వ్యాపార, పర్యటన నిమిత్తం వెళ్లే ప్రయాణికులకు ఈ కొత్త సర్వీసు ఎంతగానో ఉపకరిస్తుంది.