కళ్ల ముందే మంటల్లో కాలిబూడిదైన ఊరు.. బాధితులకు కొత్త ఇళ్లు, ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం
సంక్రాంతి పండుగ వేళ ఏపీలో ఘోరమైన ఘటన జరిగింది. కళ్ల ముందే గిరిజనులకు చెందిన ఊరు కాలి బూడిదైంది. దాదాపు ఊరు మెుత్తం రోడ్డు మీద పడింది.
సంక్రాంతి పండుగ దగ్గరకొచ్చింది. కానీ ఓ ఊర్లో ఈ సమయంలో విషాదం నెలకొన్నది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది. మన్యంలో ఉన్న ఈ తండాలో 38 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కేవలం మూడు పక్కా ఇళ్లు మాత్రమే మిగిలాయి. దాదాపు ఊరు ఊరంతా కాలి బూడిదైన పరిస్థితి.

ఈ ఘోరమైన ప్రమాదంలో సుమారు 120 మంది గిరిజనులు కట్టుబట్టలతో రోడ్డు మీదకు వచ్చారు. తమకు చెందిన వస్తువులన్నీ కళ్ల ముందే కాలి బూడిదైపోయాయి. గిరిజనులు బిక్కుబిక్కుమంటూ చూశారు. సరకులు కొనుగోలు చేసేందుకు కొందరు గ్రామస్థులు తుని పట్టణానికి వెళ్లారు. మరికొందరు ఊర్లోనే ఉన్నారు. తుని నుంచి వచ్చేసరికి ఊరు ఊరంతా కాలిపోయింది. అక్కడే ఉన్న గ్రామస్థులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టడం తప్ప.. ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
అగ్నిమాపక వాహనాలు వచ్చేసరికి ఊరంతా కాలిపోయింది. గ్యాస్ బండ పేలిందని కొందరు, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి అగ్ని వ్యాపిస్తూ.. 38 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ప్రతిపాడు ఎమ్మెల్యే సార్లంకపల్లెకు వచ్చి బాధితులను పరామర్శించారు. ఆహారం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
బాధితులకు కొత్త ఇళ్లు
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో సార్లంకపల్లెలో అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందన్నారు. ఊరిలో ఉన్న మొత్తం 38 తాటాకు ఇళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని వివరించారు హోం మంత్రి అనిత, ఇతర అధికారులు.
బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి అండగా నిలవాలని చంద్రబాబు ఆదేశించారు. తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 వేలు నేడు అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలన్నారు.
ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సహాయం అందించాలన్నారు. బాధితులకు అందే సహాయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, మంత్రులు పర్యవేక్షించాలని చెప్పారు.

E-Paper












